త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ ‘గురుదక్షిణ’.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర

గోదావరి జలాలపై ఏపీకి సీఎం రేవంత్ పరోక్షంగా సహకరిస్తున్నారని, చంద్రబాబుకు 'గురుదక్షిణ' ఇస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. సుప్రీంలో పిటిషన్ కొట్టివేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Telangana | Published On Jul 13, 2026, 7.24 pm IST

Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ ‘గురుదక్షిణ’.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర

సంక్షిప్త సారాంశం

గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన సూట్ లోపభూయిష్టంగా ఉందంటూ కోర్టు దానిని డిస్మిస్ చేసిందని హరీశ్ రావు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బలహీనమైన పిటిషన్ వేయించి, చంద్రబాబు నాయుడుకు 'గురుదక్షిణ' చెల్లించుకున్నారని ఆరోపించారు. తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ సీఎం సూచన మేరకే రాష్ట్ర సలహాదారుగా నియమించారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడితోనే దేవాదుల ప్రాజెక్టు వద్దకు మంత్రులు వెళ్లారని, కేసీఆర్ కట్టిన సమ్మక్క బ్యారేజీ వల్లే అక్కడికి నీళ్లు వచ్చాయని కౌంటర్ ఇచ్చారు.

Advertisement
  • చంద్రబాబుకు కొమ్ముకాసేలా రేవంత్ వ్యవహారం
  • గురుదక్షిణ చెల్లించుకోవడంపైనే రేవంత్ దృష్టి
  • బీఆర్ఎస్‌ను తిట్టడంపైనే దృష్టి
  • తెలంగాణ జల ద్రోహి రేవంత్
  • తెలంగాణకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్
  • సమ్మక్క బ్యారేజీని నిర్మించింది కేసీఆర్
  • బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నిస్తేనే దేవాదుల వద్దకు వెళ్లారు
  • జలవివాదాలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ జల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) 'గురుదక్షిణ' చెల్లించుకుంటున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో (Sangareddy) ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో (Press meet) ఆయన మాట్లాడుతూ.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు (Godavari-Banakacherla) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో (Supreme Court) కావాలనే లోపభూయిష్టమైన సూట్ వేసిందని, అందుకే ఆ పిటిషన్ డిస్మిస్ అయ్యిందని సంచలన ఆరోపణలు చేశారు.

సుప్రీంలో అక్షింతలు.. కావాలనే తప్పులు చేశారా?

బనకచర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొదటినుంచీ ఏపీకి పరోక్షంగా సహకరిస్తోందని, బీఆర్ఎస్ నిలదీయడంతోనే ప్రభుత్వం బ్యాక్‌డేట్ తో లేఖలు రాసిందని హరీశ్ రావు ఆరోపించారు. "దేశంలోనే ఇంత లోపభూయిష్టమైన సూట్ మరొకటి ఉండదు. ఇది ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా జరగదు. అడ్వొకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదులు ఏం చేస్తున్నారు?" అని ఆయన విమర్శించారు. "కొట్టినట్లు చేయాలి.. దెబ్బ తాకకూడదు.. ప్రాజెక్టు ఆపినట్లు చేయాలి.. కానీ ఆగకూడదు" అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందంటూ ఎద్దేవా చేశారు. గత ఏడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన సూట్ ఎందుకు వేయలేకపోయిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Harish Rao Slams CM Revanth Over SC Dismissing Godavari Suit

ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై ఫైర్

చంద్రబాబు నాయుడుతో సీఎం రేవంత్ కుమ్మక్కు అయ్యారనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదన్నారు. ఢిల్లీలో "చర్చ లేదు, కమిటీ లేదు" అని చెప్పిన ప్రభుత్వం.. తీరా డిసెంబర్ 15, 2025న ఏపీ కమిటీ వేయగానే, డిసెంబర్ 23న తెలంగాణ కూడా కమిటీ వేసిందని గుర్తుచేశారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచిన ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ సీఎం సూచన మేరకే రాష్ట్ర నీటిపారుదల సలహాదారుగా నియమించారని మండిపడ్డారు. ఇదంతా చూస్తుంటే సీఎం రేవంత్ ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జల ద్రోహిగా కూడా మిగిలిపోతారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీల నీళ్లు తెలంగాణ హక్కని, దానికి ఎలాంటి NOC (No Objection Certificate) అవసరం లేదని, పోలవరం ఇంటర్‌లింకింగ్‌కు అనుమతిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని ఆయన స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ అడిగితేనే దేవాదుల మోటార్లు ఆన్

ఇరిగేషన్ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన తక్కువ, ఆవేశం ఎక్కువని హరీశ్ రావు విమర్శించారు. దేవాదుల (Devadula) ఏ బేసిన్‌లో ఉందో, నల్లమల ఎక్కడ ఉందో కూడా ఈ ప్రభుత్వానికి తెలియదన్నారు. బీఆర్ఎస్ గట్టిగా ప్రశ్నించిన తర్వాతే మంత్రులు దేవాదుల వద్దకు వెళ్లారని.. పది మోటార్లకు గాను కేవలం ఆరు మాత్రమే నడుస్తున్నాయని వివరించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దేవాదులపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సమ్మక్క బ్యారేజీని కేసీఆర్ (KCR) నిర్మించడం వల్లే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు నీరు అందుతోందని ఆయన కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన దేవాదుల నత్తనడకన సాగితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రీ-ఇంజినీరింగ్ చేసి మూడో దశను పూర్తి చేసిందని, 30 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు నీరందించిందని హరీశ్ రావు గణాంకాలతో సహా వివరించారు.

Advertisement
Advertisement