త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Prashanth Reddy | గవర్నర్ ప్రసంగ‌మంతా డొల్ల.. అది చిత్తు కాగితంతో సమానం: వేముల ప్ర‌శాంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో సోమ‌వారం జ‌రిగిన గవర్నర్ ప్రసంగం (Governer's speech)పై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్  రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. వర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్లగా, అబద్ధాలతో నిండిపోయిందని, ప్రజలకు ఉపయోగపడే స్కీంల కంటే స్కామ్‌లే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు.

S

Telangana | Published On Mar 16, 2026, 6.06 pm IST

Vemula Prashanth Reddy | గవర్నర్ ప్రసంగ‌మంతా డొల్ల.. అది చిత్తు కాగితంతో సమానం: వేముల ప్ర‌శాంత్‌రెడ్డి
Advertisement

- బీఆర్ఎస్ ప‌నుల‌ను తామే చేసినట్టు గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు
- స్కీమ్‌లు కంటే … స్కామ్‌ల సంబందించిన కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి
- 6 గ్యారంటీలు గాలికి… 420 హామీలు అటకెక్కాయి
- రుణమాఫీ సగం మందికే… రైతు భరోసా అడ్రస్ లేదు
- జాబ్ క్యాలెండర్ ఎక్కడ?
- అభివృద్ధి శూన్యం, ప్రచారమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో సోమ‌వారం జ‌రిగిన గవర్నర్ ప్రసంగం (Governor's speech)పై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్  రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్రస్థాయిలో విమ‌ర్శించారు. సోమ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు సంజ‌య్‌, కౌశిక్ రెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్లగా, అబద్ధాలతో నిండిపోయిందని, ప్రజలకు ఉపయోగపడే స్కీంల కంటే స్కామ్‌లే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఇది ప్రజలను మరోసారి మోసం చేసే ప్రయత్నమేనని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్‌ (Congress script) ను గవర్నర్ చదవడం తప్ప ఈ ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గొప్పగా ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీలు గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలను మోసం (Cheeting) చేసినట్టేనని మండిప‌డ్డారు.

దివ్యాంగుల‌కు మొండి చేయి...

ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండేళ్లుగా మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని, ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరమన్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు రూ.4,000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని, కొత్త పెన్షన్ల మంజూరుపై కూడా గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదన్నారు. తులం బంగారం హామీ అటకెక్కించార‌ని ఆగ్ర‌హించారు.

రుణ‌మాఫీపై ప‌చ్చి అబ‌ద్దాలు..

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పించడం పూర్తిగా అబద్ధమన్నారు. రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ పూర్తి కాలేదని, అయినప్పటికీ అందరికీ చేశామని ప్రచారం చేయడం మోసమన్నారు. ఎన్నికల సమయంలో ఎకరాకు రూ.15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో రైతు భరోసా ఇచ్చామని చెప్పి అబద్దమాడి ఇప్పటికి రెండు సార్లు ఇచ్చి మూడుసార్లు ఎగ్గొట్టి రైతులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు రైతులకు అందలేదని, కొద్దిమందికే ఇచ్చి అందరికీ ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.

ఇచ్చింది 12 వేల ఉద్యోగాలే..

ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆయన విమర్శించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం సుమారు 12 వేల ఉద్యోగాలే ఇచ్చిందని తెలిపారు. కానీ గవర్నర్ ప్రసంగంలో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పించడం వాస్తవాలకు విరుద్ధమ‌ని చెప్పారు. ఇవి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ఫలితమేనని, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ ప్రకటించలేదని విమర్శించారు.

గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో కొత్తగా ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పనులనే ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ తమవిగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా వాస్తవాలకు దూరంగా ఉండి, డొల్ల ప్రసంగం, చిత్తు కాగితంతో సమానమ‌ని వేముల వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

 

Advertisement
Advertisement