త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

G Jagadish Reddy | కేసీఆర్ మల్లెపువ్వులా బయటికి వస్తారు

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కేసీఆర్ స్వచ్ఛమైన మల్లెపువ్వు అని తేలిపోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

J

Telangana | Published On Apr 22, 2026, 4.26 pm IST

G Jagadish Reddy | కేసీఆర్ మల్లెపువ్వులా బయటికి వస్తారు
Advertisement

G Jagadish Reddy | త్రినేత్ర.న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ (BRS) చెబుతున్న వాదనే అక్షర సత్యమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జి. జగదీష్ రెడ్డి (G.Jagadish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్ని విచారణలు చేసుకున్నా కేసీఆర్ (KCR) మల్లెపువ్వులా స్వచ్ఛంగా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అది పీసీ ఘోష్ కాదు.. ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష

పీసీ ఘోష్ కమిషన్‌పై జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "అది పీసీ ఘోష్ కమీషన్ కాదు.. ప్రదేశ్ కాంగ్రెస్ ఘోష అని మేము ముందే చెప్పాము. కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలనే కమీషన్ ఘోష్ రిపోర్టు రూపంలో ఇచ్చింది," అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదని, ప్రాజెక్టు ఎక్కడా కూలిపోలేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని హైకోర్టు తీర్పుతో నిరూపితం అయిందన్నారు.

ఆంధ్రాకు నీళ్లు తరలించే కుట్ర

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఇష్టం లేని ఏపీ పెద్దల కుట్ర ఇందులో దాగి ఉందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పిల్లర్లు కుంగాయి అనే సాకుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన దుర్మార్గాన్ని బట్టబయలు చేసుకుందని, కాళేశ్వరం పేరుతో ఆంధ్రా బాసులకు నీళ్లు వదిలారని విమర్శించారు. బనకచర్లకు రూట్ క్లియర్ చేయడం కోసమే గోదావరి నీళ్లను కిందకు వదిలేశారని దుయ్యబట్టారు.

వెంటనే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి

రాష్ట్రంలో ఇప్పటికే తాగునీటి ఎద్దడి మొదలైందని, సీఎం చెత్త మాటలు పక్కనపెట్టి ఇప్పటికైనా కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. "మాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినా కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ చేసి చూపిస్తాం" అని సవాల్ విసిరారు. రాష్ట్ర అవసరాలు తెలిసే కేసీఆర్ మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మించారని, ఆయన ఒక ఇంజనీర్‌గానే ప్రాజెక్టు గురించి మాట్లాడారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న రేవంత్ రెడ్డి నిర్వాకం బయటపడిందని, తెలంగాణ ప్రజలకు సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

brs leader Jagadish Reddy Fires on CM Revanth Reddy Over Kaleshwaram Row

రేవంత్, బండి సంజయ్ ఇద్దరూ ఒకటే

రాష్ట్రంలో సీఎం కుటుంబ సభ్యులు, మంత్రుల కమీషన్ల దందా నడుస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖులు భూమి కనపడగానే రియల్ ఎస్టేట్ దందా చేస్తారని విమర్శించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడేవారిని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుతో కొట్టాలని ఘాటుగా స్పందించారు. బీజేపీ నేత బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇద్దరూ వేరు కాదని.. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్‌నే బండి సంజయ్ చదువుతారని ఎద్దేవా చేశారు.

ఆర్టీసీని సంక్షోభంలో నెట్టే కుట్ర

ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగానే సంక్షోభంలోకి నెట్టాలని ప్రభుత్వం చూస్తోందని, కార్మికులు సమ్మె చేసేలా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రోజువారీ కూలీల కంటే ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. అలాగే విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలను రేవంత్ రెడ్డి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రెస్ మీట్‌లో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు భాస్కర్ రావు, ఒంటెద్దు నరసింహ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి, తుంగబాలు, ధర్మేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement