త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | 80 శాతం ఉద్యోగాలు కాజీపేట యువ‌త‌కు ద‌క్కాల్సిందే : హ‌రీశ్‌రావు

Harish Rao | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Feb 28, 2026, 6.27 pm IST

Harish Rao | 80 శాతం ఉద్యోగాలు కాజీపేట యువ‌త‌కు ద‌క్కాల్సిందే : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కొలువుల కోసం కొట్లాట పేరిట హన్మకొండ జిల్లా కాజీపేట చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

స్థానిక యువతకు ఉద్యోగాల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన వినయ్ భాస్కర్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మా ఉద్యోగాలు మాకే కావాలి అనే బలమైన నినాదంతోనే నాడు కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కేవలం రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణ యువతకు 95 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే 95 శాతం స్థానికత దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దే అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే కాజీపేటకు ఈ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఇక్కడ పరిశ్రమలు రావాలని ముఖ్యంగా మన స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు దొరకాలని మనం కోరుకున్నాం. కానీ ఈరోజు ఫ్యాక్టరీ వచ్చినా.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. నాడు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం.. దేవాదాయ శాఖకు చెందిన 150 ఎకరాల భూములను హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని మరీ కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇచ్చింది. కేవలం భూములు ఇవ్వడమే కాదు కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం నాడు బీఆర్ఎస్ ఎంపీలు రైల్వే మంత్రిని కలిసి, పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ఆనాడు దేశంలో కోచ్ ఫ్యాక్టరీల అవసరమే లేదని మనకు సమాధానం చెప్పిన బీజేపీ ప్రభుత్వం.. ఆ తర్వాత అస్సాం, లాతూర్ మహారాష్ట్రలలో కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసి తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపింది. కోచ్ ఫ్యాక్టరీ అడిగితే వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతామన్నారు. అసలు ఇప్పుడు ఇక్కడ కడుతున్నది వ్యాగన్ ఫ్యాక్టరీనా? లేక కోచ్ ఫ్యాక్టరీనా? అన్న దానిపై ఇప్పటివరకు కనీసం గెజిట్ నోటిఫికేషన్ కూడా రాలేదు. వెంటనే దీనిపై స్పష్టతనిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలి అని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

మహారాష్ట్రలోని లాతూర్ వ్యాగన్ ఫ్యాక్టరీలో 70 శాతం స్థానికులకే రిజర్వేషన్ ఇచ్చారు. మరి తెలంగాణలో మన కాజీపేట యువతీ యువకులకు ఎందుకు ఆ రిజర్వేషన్ కల్పించడం లేదు.. మహారాష్ట్రకు ఒక చట్టం, తెలంగాణకు ఒక చట్టం ఉంటుందా? రాష్ట్ర ప్రజలు బీజేపీకి 8 మంది, కాంగ్రెస్ కు 8 మంది ఎంపీలను గెలిపిస్తే వాళ్లు తెలంగాణకు చేస్తున్న నిర్వాకం ఇది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీ స్థానికుల ఉద్యోగాల గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నారు. కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తామని అంటున్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులకు, స్థానికులకు లాతూర్ తరహాలో 70 శాతం రిజర్వేషన్ కల్పించకుండా ప్రారంభోత్సవానికి వస్తే.. బిడ్డా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా నిలదీస్తామ‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

ఒకప్పుడు దేశంలోనే ప్రసిద్ధి గాంచిన కాజీపేట జంక్షన్ ప్రాధాన్యత రోజురోజుకూ తగ్గిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంకు రైల్వే జోన్ ఇచ్చినట్లుగానే, కాజీపేటను కూడా తక్షణమే రైల్వే జోన్ గా ప్రకటించాలి. బడే భాయ్.. ఛోటే భాయ్ అంటూ మాట్లాడే రేవంత్ రెడ్డి.. కాజీపేట జంక్షన్‌ను రైల్వే జోన్‌గా ఎందుకు చేయించడం లేదు..
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడగడం లేదు. కాంగ్రెస్ ఎంపీలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు. తాను చేసిన అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారా..? కాజీపేటలో స్థానికుల ఉద్యోగాల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈ అంశంపై రాజ్యసభలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం అని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement