త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajender | సంఘాలను కూడా పార్టీల ముద్ర వేసి నిర్వీర్యం చేస్తున్నారు: ఎంపీ ఈటల రాజేందర్

Etala Rajender | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో అతిపెద్ద కుల‌మైన ముదిరాజులు (Mudiraj) ఐక్య‌పోరాటాల‌కు సిద్ధం కావాల‌ని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajender) పిలుపునిచ్చారు. అప్పుడు ముదిరాజ్‌ల డిమాండ్‌లు ఎందుకు నెర‌వేర‌వో చూద్దామ‌న్నారు.

G

Telangana | Published On May 27, 2026, 6.49 am IST

Etala Rajender | సంఘాలను కూడా పార్టీల ముద్ర వేసి నిర్వీర్యం చేస్తున్నారు: ఎంపీ ఈటల రాజేందర్
Advertisement

Etala Rajender | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో అతిపెద్ద కుల‌మైన ముదిరాజులు (Mudiraj) ఐక్య‌పోరాటాల‌కు సిద్ధం కావాల‌ని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ (Etala Rajender) పిలుపునిచ్చారు. అప్పుడు ముదిరాజ్‌ల డిమాండ్‌లు ఎందుకు నెర‌వేర‌వో చూద్దామ‌న్నారు. రాజకీయాలు పార్టీలు ఏమైనా ఉండవచ్చు కానీ జాతి మనుగడ కోసం న్యాయమైన డిమాండ్ కోసం ముందు ఉండి పని చేయాల‌న్నారు. సంఘాలను కూడా పార్టీల ముద్ర వేసి నిర్వీర్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనేది గుర్తుపెట్టుకుని అంద‌రం క‌లిసి ఐక్యంగా పోరాడ‌దామ‌న్నారు. హైద‌రాబాద్ జ‌ల‌విహార్‌లో జ‌రిగిన `ముదిరాజ్ సింహవాలోకనం` కార్య‌క్ర‌మంలో మాట్లాడారు.

`ఒకటే సంఘంగా ఉండాలి అనేది మొదటి నుంచి నా విజ్ఞప్తి. ఎన్నో ఏండ్లుగా మన హక్కుల కోసం కొట్లాడుతున్నం. కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. రేషంలో, సాహసంలో కొదవలేదు కానీ మనం ఎక్కడ ఉన్నాము పునరాలోచన చేసుకోవాలి. అప్పట్లో బండ ప్రకాశ్ ముదిరాజులు కోసం పేపర్లు పట్టుకొని అసెంబ్లీ చుట్టూ తిరిగే వారు. బీసీడీ నుంచి బీసీ ఏ కి మార్చాలని మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడింది నేనే. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అనేకసార్లు అసెంబ్లీలో ప్రస్తావించాను. 2008లో ఉప ఎన్నికల సందర్భంగా రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ అందినట్టే అంది దూరం అయ్యింది.

సీజను వారీగా పండ్లు, కూరగాయలు అమ్ముకొని రెక్కల కష్టం నమ్ముకుని బ్రతికే వాళ్ళు ముదిరాజులు. మాది మాకు కావాలని మాత్రమే అడుగుతున్నాం. నేను ఎల్లప్పుడూ న్యాయం పక్షాన ఉంటాను. ఈ జాతి అనేక సంవత్సరాలుగా అక్రోషిస్తుంది. బీసీ డీ నుంచి బీసీ ఏ అనే ప్రక్రియ ఒకసారి అమలు జరిగి ఆగిపోయింది. కాబట్టి దానిని పరిశీలించి సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మేము ఏ కులాన్ని, వర్గాన్ని ద్వేషించే వాళ్ళం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు సరైన వాటా దక్కాలని కోరుతున్నాం.

జ‌నాభా ఆధారంగా ఫలితాలు అందాలని సోయి పార్టీలకు ప్రభుత్వ పెద్దలకు ఉండాలి. పైసలు ఉన్నవారు మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతున్నారు. గుడిసెలో ఉన్నవారికి, వంద కోట్ల బంగ్లాలో ఉన్నవారికైనా ఒకటే ఓటు అని సంబరపడటం కానీ ప్రజాసేవ చేసే అవకాశం అందరికీ రావడం లేదు. దీనిని పోగొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఇది సంఘాలకు మేధావులకు చైతన్యవంతులకు మాత్రమే ఉంటుంది. సంఘాలను కూడా పార్టీల ముద్ర వేసి నిర్వీర్యం చేస్తున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనేది గుర్తుపెట్టుకుని మనందరం ఐక్యంగా పోరాడాలి. మనలాంటి జాతులందరినీ కలుపుకొని ముందుకు పోవాలి. 26 లక్షల జనాభా ముదిరాజ్.. 7.46 శాతం ఉన్నారు.

తెలంగాణలో అతిపెద్ద కులం ముదిరాజ్. 35 నియోజకవర్గాల్లో ముదిరాజులు శాసించే స్థాయిలో ఉన్నారు కానీ ఏం లాభం అని మన మేధావులు అడుగుతున్నారు. రాజకీయాలు పార్టీలు ఏమైనా ఉండవచ్చు కానీ జాతి మనుగడ కోసం న్యాయమైన డిమాండ్ కోసం ముందు ఉండి పని చేస్తాం. ఎంఆర్‌పీఎస్ (MRPS) ఉద్యమంలో నేను కూడా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్టిఫికెట్ లేని కులాలు కూడా అనేకం ఉన్నాయని గుర్తించి అసెంబ్లీ వేదికగా మీటింగ్‌లు పెట్టాను. దిక్కులేని వారందరికీ నేనే దిక్కు అని ప్రకటించాను. నా ఛాంబర్ లో సెంటు వాసన కాదు చెమట వాసన వచ్చినప్పుడు ఎక్కువ పని చేస్తున్నట్టుగా భావిస్తాను అని మా అధికారులకు చెప్పాను.

పురుగుల అన్నం తిని నీళ్ల చారు తాగి పెరిగినవాడిని కాబట్టి ఆర్థిక మంత్రిని అయిన వెంటనే నా పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలని పాత జీవోలను పీకిపడేసి.. బీపీటీ సన్నబియ్యం పెట్టాలని ఆదేశాలు ఇచ్చాను. పదవి వస్తే మేము ఎక్కడి నుంచి వచ్చాము ఆ జాతుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేశాను. రూ.1650 జీతానికి కంటిన్జెంట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి జీతాలు పెంచాం. మాటలు చెప్పడం సులభం పని చేయడం కష్టం.. కానీ నేను ఎక్కడ ఉన్నా నాకోసం నేను పని చేసుకోలేదు.. ఈ జాతి నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తాను మీ వెంట నేను ఉంటాను. ఇంత పెద్ద జాతి శక్తి సాహసం ఉంది ఎందుకు కాదో చాలెంజ్ చేసి నడిపించండి మీకు నేను అండగా ఉంటా` అని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.

Advertisement
Advertisement