త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttam Kumar Reddy | సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Uttam Kumar Reddy | రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్‌, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి, సాధ్యమైనంత త్వరగా అనుమతులు పొందేందుకు చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On Aug 3, 2026, 8.20 pm IST

Uttam Kumar Reddy | సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులే లక్ష్యం : మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
Advertisement

Uttam Kumar Reddy | రాష్ట్ర సాగునీటి భవిష్యత్తుకు కీలకమైన నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్‌, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చి, సాధ్యమైనంత త్వరగా అనుమతులు పొందేందుకు చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆరు నెలల్లో అనుమతులే లక్ష్యం

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పర్యావరణ అనుమతుల విషయంలో న్యాయపరమైన స్పష్టత వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖతో పాటు సంబంధిత సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించి, అవసరమైన పత్రాలను ఏడు రోజుల్లో సమీకరించాలని ఆదేశించారు. పర్యావరణ అధ్యయనాలు, భూ రికార్డులు, న్యాయపరమైన పత్రాలు, ఇతర నివేదికలను 30 రోజుల్లో సిద్ధం చేయాలని, దరఖాస్తుల ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సాధ్యమైన ప్రతి ప్రాజెక్టుకు ఆరు నెలల్లో అనుమతులు సాధించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. తెలంగాణ సాగునీటి ప్రయోజనాల పరిరక్షణలో అంతర్రాష్ట్ర విభాగం కీలకమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సాంకేతిక, పర్యావరణ, న్యాయ నిపుణులతో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి చరిత్ర, పర్యావరణ అనుమతులు, రీడిజైన్‌లు, విస్తరణలు, పెండింగ్‌ దరఖాస్తులు, న్యాయస్థానాల్లో ఉన్న కేసులు, నిబంధనల వివరాలను ఒకే సమగ్ర దస్త్రంలో పొందుపరచాలని ఆదేశించారు.

గౌరవెల్లికి ప్రత్యేక ప్రాధాన్యం

గౌరవెల్లి ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పంపుల తనిఖీలు, పరీక్షలు, అవసరమైన మరమ్మతులు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎడమ, కుడి కాలువ వ్యవస్థలను ఇంజినీరింగ్‌ బృందాలు పరిశీలించి, నీటి ప్రవాహానికి అడ్డంకులను గుర్తించాలని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కాలువ పనులు, నీటి విడుదల కేంద్రాలు, రహదారి క్రాసింగ్‌లు, వంతెనల అవసరాలపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సీతారామ సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అధ్యయనాలు, పత్రాలను వెంటనే నవీకరించాలని మంత్రి ఆదేశించారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేలా ఇంజినీరింగ్‌ ప్రణాళికలు, అంచనాలు, టెండర్‌ పత్రాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే వేగంతో ముందుకు సాగాలని తెలిపారు.

రైతులు, నిర్వాసితుల ప్రయోజనాలకు రక్షణ

ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతులు, భూ యజమానులు, నిర్వాసిత కుటుంబాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి, సామాజిక న్యాయం మధ్య సమతుల్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై కూడా సమావేశంలో చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూములు, గ్రామాలు, మౌలిక వసతులపై ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎదుట బలంగా వినిపించేందుకు క్షేత్రస్థాయి సమాచారం, సాంకేతిక నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. బ్యాక్‌వాటర్‌ ప్రభావంతో నష్టపోయే భూములు, ఆస్తులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతి వారం పురోగతి నివేదిక ఇవ్వాలని, ప్రతి నెలా ఉన్నతస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అనుమతుల ప్రక్రియలో ఆలస్యం, నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) ఓవీ రమేష్‌బాబు, జాయింట్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (అడ్మిన్‌) పీ శ్రీనివాస్‌, ఇంజినీర్‌-ఇన్‌ చీఫ్‌ (ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) ఆర్‌ మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement