త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adluri Lakshman Kumar | మేడిగడ్డను కూల్చి.. గోదావరిపై రాజకీయాలా?

Adluri Lakshman Kumar | గోదావరి వరదలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ నేతలు నాయకులు చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలని ఆ పార్టీ నేతలు చేస్తున్న డిమాండ్లు వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

P

Telangana | Published On Aug 3, 2026, 7.25 pm IST

Adluri Lakshman Kumar | మేడిగడ్డను కూల్చి.. గోదావరిపై రాజకీయాలా?
Advertisement
  • బీఆర్‌ఎస్‌ నేతలు వైఫల్యాలకు సమాధానం చెప్పాలి
  • వరదలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సరికాదు
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఫైర్‌

Adluri Lakshman Kumar | గోదావరి వరదలను సైతం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ నేతలు నాయకులు చేస్తున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోయాలని ఆ పార్టీ నేతలు చేస్తున్న డిమాండ్లు వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. సాగునీటి వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై సోమవారం స్పందించిన మంత్రి.. గోదావరిలో వరద ప్రవాహం ఉందని చెప్పడం ఒకటైతే, ఆ నీటినంతా వెంటనే ఎత్తిపోయవచ్చని చెప్పడం మరో విషయమని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాజకీయ వేదికలపై చేసే ప్రకటనలతో కాదని, నీటి మట్టాలు, పంపింగ్‌ సామర్థ్యం, కాలువల సామర్థ్యం, దిగువ జలాశయాల నిల్వలు, విద్యుత్‌ లభ్యత, ఇంజినీర్ల సాంకేతిక అనుమతులు, భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

మేడిగడ్డపై మాట్లాడే నైతిక హక్కు లేదు

తెలంగాణ ప్రజల సొమ్ముతో వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ ఈ పరిస్థితికి ఎందుకు చేరిందో బీఆర్‌ఎస్‌ నేతలు ముందుగా సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన లోపాల కారణంగా రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందని, ఇప్పుడు అదే ప్రాజెక్టు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించడం రాజకీయ దివాళాకోరుతనమని విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించడంపై గులాబీ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి అవగాహన రాహిత్యాన్ని బయటపెడుతున్నాయని మంత్రి అన్నారు. ప్రాజెక్టుల రూపకల్పనలో ఎక్కడ గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమో అక్కడ ఆ విధానాన్ని, అవసరమైన చోట ఎత్తిపోతల విధానాన్ని ఉపయోగిస్తారని తెలిపారు. ఇది పూర్తిగా సాంకేతిక అంశమని, రాజకీయ వ్యాఖ్యలతో నిర్ణయించేది కాదని స్పష్టం చేశారు.

పదేళ్ల పాలనలో ఏం చేశారు?

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని, పదేళ్ల అధికారంలో దాన్ని ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు వివరించాలని మంత్రి ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులపై ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి విమర్శలు చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. రాజకీయ ప్రచారం కోసం కాకుండా నిపుణుల సూచనలు, సాగునీటి శాఖ ఇంజినీర్ల సాంకేతిక సలహాల ఆధారంగా ప్రాజెక్టుల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు.

సమాధానం చెప్పాలి

మేడిగడ్డ బ్యారేజీ ఈ పరిస్థితికి రావడానికి బాధ్యులు ఎవరు? నిర్మాణ నాణ్యతపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ప్రాజెక్టుల భద్రత కంటే రాజకీయాలే ముఖ్యమా? గోదావరి వరదలను కూడా రాజకీయ ప్రచారానికి ఉపయోగించడం రైతుల పట్ల బాధ్యతేనా? పదేళ్ల పాలనలో పూర్తి చేయని హామీలపై ప్రజలకు ఎప్పుడు వివరణ ఇస్తారు? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రైతులు అమాయకులు కాదని, ఏది వాస్తవమో.. ఏది రాజకీయ ప్రచారమో వారికి తెలుసని మంత్రి అన్నారు. ప్రజలకు కావాల్సింది ప్రెస్‌మీట్లు కాదని, రైతులకు కావాల్సింది విమర్శలు కాదని.. సమయానికి అందే సాగునీరు అని పేర్కొన్నారు. మేడిగడ్డను దెబ్బతీసిన వారే ఇప్పుడు అదే ప్రాజెక్టుపై నీతులు చెప్పడం చరిత్రను మరిచిపోవడమేనని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో సాగునీటి నిర్వహణ కొనసాగిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement