త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

El Nino impact Telangana | రైతులకు అలర్ట్: ఎల్ నినో ఎఫెక్ట్‌పై మంత్రి తుమ్మల ముందస్తు సమీక్ష.. ఆ వరి రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కీలక ఆదేశాలు

రాబోయే వర్షాకాలంలో 'ఎల్ నినో' ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ముందస్తు సాగు ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న వరి రకాలనే రైతులకు అందుబాటులో ఉంచాలని, అలాగే అమాంతం పడిపోయిన పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును మళ్లీ పెంచేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

J

Telangana | Published On Apr 25, 2026, 9.14 pm IST

El Nino impact Telangana | రైతులకు అలర్ట్: ఎల్ నినో ఎఫెక్ట్‌పై మంత్రి తుమ్మల ముందస్తు సమీక్ష.. ఆ వరి రకాలకే ప్రాధాన్యం ఇవ్వాలని కీలక ఆదేశాలు
Advertisement

El Nino impact Telangana | రాబోయే వర్షాకాలం సీజన్‌పై వాతావరణ శాఖ నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. 'ఎల్ నినో' (El Nino) ప్రభావంతో వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని అంచనాలు వస్తున్న తరుణంలో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు నష్టపోకుండా ముందస్తుగా సాగు ప్రణాళికలు (Crop Plan) సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఉత్తర తెలంగాణ కంటే దక్షిణ తెలంగాణలోనే ముప్పు

సాధారణంగా రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ కంటే ఉత్తర తెలంగాణలో అధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే రాబోయే ఎల్ నినో ప్రభావంతో ఉత్తర తెలంగాణలో తక్కువ వర్షపాతం, దక్షిణ తెలంగాణలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. మే 15 నాటికి వాతావరణ శాఖ (IMD) నుంచి కచ్చితమైన నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. ఆ రిపోర్టు ఆధారంగా జిల్లా వారీగా రైతులు ఏయే పంటలు వేయాలో సూచిస్తూ ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆందోళన కలిగిస్తున్న పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు

రాష్ట్రంలో ఒకవైపు వరి సాగు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా, మరోవైపు కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు గణనీయంగా పడిపోవడం పట్ల మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. 2013-14 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సాగు వివరాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

వరి సాగు: ఏకంగా 131.7 శాతం పెరిగింది.

పప్పుధాన్యాలు: మొత్తంగా 39 శాతం పడిపోయింది. ఇందులో పెసలు 75.2%, మినుములు 71.5%, ఉలవలు 71.6%, బొబ్బర్లు 72.4% మేర పడిపోయాయి.

నూనెగింజలు, ఇతరాలు: సజ్జలు 95%, నువ్వులు 94.9%, పొద్దుతిరుగుడు 98.5%, ఆముదం 98.5%, వేరుశనగ 51% మేర సాగు తగ్గిపోయింది.

El Nino Alert Minister Tummala Directs Officials on Advance Crop Plan Focus on Sanna Biyyam and Pulses

మన అవసరాల కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి రాకూడదని, రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నందున వీటి సాగును వెంటనే పెంచేలా వ్యవసాయ యూనివర్సిటీ, శాఖాధికారులు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. ఒకే పంట వేయడం వల్ల భూసారం తగ్గడంతో పాటు యూరియా వాడకం పెరుగుతోందని గుర్తుచేశారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతులు యూరియా వైపు మొగ్గు చూపుతున్నారని, ఎరువుల ధరలను రేషనలైజ్ చేయాలని కేంద్రాన్ని కోరినా పట్టించుకోవడం లేదని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

డిమాండ్ ఉన్న 'సన్నాల'కే ప్రాధాన్యం

రాష్ట్రంలో సన్న బియ్యం (Fine Rice) కొనుగోళ్లపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి చర్చించారు. బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న, ప్రభుత్వ మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పలికే సన్న వరి రకాల విత్తనాలనే రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతుల ఆదరణ పొందిన విత్తనాల ఎంపిక కోసం రాష్ట్రస్థాయిలో మిల్లర్లు, ఎఫ్‌సీఐ (FCI) అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షలో విత్తనాభివృద్ధి సంస్థ (సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య, ఐఎండీ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement