త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etela Rajender | “తుంట పోయి మొద్దు వచ్చినట్టుంది”.. రేవంత్ పాలనపై ఈటల రాజేందర్ నిప్పులు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నట్టు" రేవంత్ రెడ్డి పాలన ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

J

Telangana | Published On Jan 18, 2026, 9.15 pm IST

Etela Rajender | “తుంట పోయి మొద్దు వచ్చినట్టుంది”.. రేవంత్ పాలనపై ఈటల రాజేందర్ నిప్పులు

సంక్షిప్త సారాంశం

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేటలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గతంలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే దోచుకుంటే, ఇప్పుడు అనేక కుటుంబాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు. మోదీ 11 ఏళ్ల మచ్చలేని పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసే అభ్యర్థులను ఎంచుకుని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు.

Advertisement

Etela Rajender | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఎల్లంపేట మున్సిపల్ బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈటల.. రేవంత్ రెడ్డి పాలనపై, బీఆర్ఎస్‌ పార్టీపై ఘాటైన విమర్శలు చేశారు.

ప్రజలు విసిగిపోయారు.. మార్పు కోరుకుంటున్నారు

"రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే 'తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నట్టు' ఉందని ప్రజలు అనుకుంటున్నారు. గతంలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అనేక కుటుంబాలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. రెండేళ్లలోనే ప్రజల చేత ఛీ కొట్టించుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం" అని ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలే లక్ష్యం: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించాలని ఈటల పిలుపునిచ్చారు.

అభ్యర్థుల ఎంపిక: పనిచేసే వారిని, పొత్తుల సద్దిలా అందరినీ కలుపుకుపోయే వారిని అభ్యర్థులుగా ఎంచుకోవాలని సలహా ఇచ్చారు.

డబ్బుకు లొంగవద్దు: రాజకీయం డబ్బుమయం అయిందని, కానీ ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని.. ప్రజలు పనిచేసే వారికే ఓటు వేయాలని కోరారు.

ఫ్లెక్సీలు గెలిపించవు: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు డబ్బాలో గులకరాళ్లు వేసి ఊపినట్టు హంగామా చేస్తాయని, కానీ ఫ్లెక్సీలు గెలిపించవని, చాపకింద నీరులా ప్రజల గుండెల్లో చోటు సంపాదించాలని కార్యకర్తలకు సూచించారు.

కేంద్ర నిధులే రాష్ట్రానికి ఆధారం

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాగుతోందని ఈటల వివరించారు. "స్మార్ట్ సిటీ, అమృత్ నగరాలు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాకపోతే సఫాయి కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. పెరిగే చెట్లు, సీసీ రోడ్లు, మురుగుకాలువలు, అంగన్ వాడీ భవనాలు, చివరికి మనం తినే బియ్యం, స్మశాన వాటికలు కూడా కేంద్రం నిధులతోనే నిర్మిస్తున్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందదు అనే మోదీ భావన వల్లే పార్టీలతో సంబంధం లేకుండా నిధులు మంజూరు చేస్తున్నారు" అని ఈటల వెల్లడించారు.

మోదీ 11 ఏళ్ల పాలన - ఒక గర్వకారణం

ప్రధాని నరేంద్ర మోదీ గత 11 ఏళ్లుగా ఒక్క స్కామ్ లేకుండా, మచ్చలేని పాలన సాగిస్తున్నారని కొనియాడారు. "నేను భారతీయుడిని.. నాది బీజేపీ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి దేశాన్ని మోదీ తీసుకెళ్లారు. మోదీకి ఎలాగైతే మంచి పేరు ఉందో, అలాగే జిల్లా, మండల స్థాయి నాయకులకు కూడా మంచి పేరు ఉంటే ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే" అని ధీమా వ్యక్తం చేశారు.

చివరగా, "నన్ను ఎంపీగా గెలిపించిన బాధ్యత మీది.. మిమ్మల్ని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించే బాధ్యత నాది. మీ గెలుపుపైనే మా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది" అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement