త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dharani Portal Scam | ధరణి డొంక కదిలింది.. తీగ లాగితే షాకింగ్ నిజాలు.. కోడ్ ఆడిట్‌కు మంత్రి పొంగులేటి ఆదేశం

ధరణి పోర్టల్ అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోర్టల్ నిర్వహణలో విదేశీ సంస్థ ప్రమేయం, డేటా మాయం, కోడ్ ఆడిట్ లేకపోవడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తీగ లాగితే డొంక కదులుతోందని, దోషులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

J

Telangana | Published On Feb 18, 2026, 6.00 pm IST

Dharani Portal Scam | ధరణి డొంక కదిలింది.. తీగ లాగితే షాకింగ్ నిజాలు.. కోడ్ ఆడిట్‌కు మంత్రి పొంగులేటి ఆదేశం
Advertisement
  • ధరణి పోర్టల్ అక్రమాలు 'తీగ లాగితే డొంక కదిలినట్లు' ఉన్నాయని మంత్రి పొంగులేటి వెల్లడి
  • గత పాలకులు స్వలాభం కోసం పోర్టల్‌లో సాంకేతిక లొసుగులు సృష్టించారని ఆరోపణ
  • అనుమానాస్పద లావాదేవీలు బయటపడకుండా లాగిన్‌లు, డేటాను డిలీట్ చేశారని గుర్తింపు
  • వెంటనే ధరణి పోర్టల్‌పై 'కోడ్ ఆడిట్' నిర్వహించాలని ఆదేశం
  • సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్..
  • త్వరలో 'భూభారతి' పోర్టల్

Dharani Portal Scam | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పోర్టల్ అడ్డుపెట్టుకొని భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఉన్నతస్థాయి కమిటీతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

అది సాంకేతిక లోపం కాదు.. ముమ్మాటికీ దోపిడీనే

ప్రజల ఆస్తుల రక్షణ కోసం ఉండాల్సిన వ్యవస్థను, గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని మంత్రి మండిపడ్డారు. ధరణి పోర్టల్‌లో జరిగినవి సాధారణ సాంకేతిక లోపాలు కాదని, వ్యవస్థాగతంగా ఉద్దేశపూర్వకంగా సృష్టించిన లోపాలని స్పష్టం చేశారు. ఈ లొసుగులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెద్ద ఎత్తున కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లాగిన్‌లు మాయం.. డేటా డిలీట్

విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. భూ లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పద సమాచారం దొరక్కుండా కొన్ని 'లాగిన్'లను డిలీట్ చేశారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన లాగిన్ వివరాలు లేకుండా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్ల సమాచారం లభించకుండా జాగ్రత్త పడ్డారు. ధరణి పోర్టల్ సెక్యూరిటీ ఆడిట్ సమయంలో గుర్తించిన లోపాలను సరిదిద్దకుండానే, అంతా సవ్యంగా ఉన్నట్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని పొంగులేటి స్పష్టం చేశారు.

విదేశీ సంస్థ చేతిలో మన భూముల రికార్డులు?

ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను 'టెర్రాసిస్' అనే విదేశీ సంస్థకు అప్పగించడం వల్లే అనేక సమస్యలు తలెత్తాయని సమీక్షలో గుర్తించారు. అసలు పోర్టల్‌కు సంబంధించి 'ఫోరెన్సిక్ ఆడిట్'లో 'కోడ్ ఆడిట్' నిర్వహించలేదన్న విషయం బయటపడింది. దీంతో తక్షణమే కోడ్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.

సిరిసిల్ల, సిద్దిపేట తరహాలో అన్ని జిల్లాల్లో..

సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో నిర్వహించిన విధంగానే.. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ 'ఫోరెన్సిక్ ఆడిట్' నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన వారిని, అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పైసా వసూలు చేస్తామని హెచ్చరించారు.

త్వరలో 'భూభారతి'

భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా, అధికారుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండేలా 'భూభారతి' పోర్టల్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, సీఎంఆర్వో మందా మకరంద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement