త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karimnagar Corporation | క‌రీంన‌గ‌ర్ కోసం కారెక్కిన చెయ్యి.. మేయ‌ర్ పీఠం కోసం బీఆర్ఎస్‌, ఎంఐఎంతో జ‌ట్టు

Karimnagar Corporation | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని అన్ని కార్పొరేష‌న్ల‌లో జెండా ఎగ‌రేసేందుకు కాంగ్రెస్ (Congress) రంగం సిద్ధం చేసింది. ఇప్ప‌టికే నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ కార్పొరేషన్ల‌ను ద‌క్కించుకున్న అధికార‌పార్టీ, నిజామాబాద్‌, కొత్త‌గూడెంలో ఎంఐఎం, సీపీఐతో జ‌త‌క‌ట్టింది. ఇక క‌రీంన‌గ‌ర్‌ను (Karimnagar Corporation) చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంతో చేతులు క‌లిపుతున్న‌ది.

G

Telangana | Published On Feb 16, 2026, 7.37 am IST

Karimnagar Corporation | క‌రీంన‌గ‌ర్ కోసం కారెక్కిన చెయ్యి.. మేయ‌ర్ పీఠం కోసం బీఆర్ఎస్‌, ఎంఐఎంతో జ‌ట్టు
Advertisement

Karimnagar Corporation | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని అన్ని కార్పొరేష‌న్ల‌లో జెండా ఎగ‌రేసేందుకు కాంగ్రెస్ (Congress) రంగం సిద్ధం చేసింది. ఇప్ప‌టికే నల్లగొండ, మంచిర్యాల, రామగుండం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ కార్పొరేషన్ల‌ను ద‌క్కించుకున్న అధికార‌పార్టీ, నిజామాబాద్‌, కొత్త‌గూడెంలో ఎంఐఎం, సీపీఐతో జ‌త‌క‌ట్టింది. ఇక క‌రీంన‌గ‌ర్‌ను (Karimnagar Corporation) చేజిక్కించుకోవ‌డానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంతో చేతులు క‌లిపుతున్న‌ది. క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌లో బీజేపీని నిలువ‌రించేందుకు ఆ రెండు పార్టీల‌కు ఎంఐఎం తోడయ్యింది. దీంతో మేయ‌ర్ పీఠం కాంగ్రెస్ వ‌శం కానున్న‌ది.

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీకి 30 డివిజన్లు దక్కాయి. కాంగ్రెస్ 14, బీఆర్‌ఎస్‌ 9, స్వతంత్రులు 4, మజ్లిస్‌ 3, ఏఐఎఫ్‌బీ 2 చొప్పున గెలుపొందాయి. 30 మంది కార్పొరేట‌ర్ల‌తోపాటు నలుగురు స్వతంత్రులు, ఎంపీ బండి సంజయ్‌ ఓటుతో బీజేపీ బలం 35కు చేరింది. అయితే క‌మ‌లం పార్టీలో చేరిన ఓ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాంగ్రెస్‌లో చేర‌డంతో ఆ సంఖ్య 34కు ప‌డిపోయింది. అయితే బీజీపీకి మేయ‌ర్‌ పీఠాన్ని ద‌క్క‌కుండా చేయ‌డానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు అవగాహనకు వచ్చినట్టు తెలుస్తున్న‌ది. వీరికి మజ్లిస్, స్వతంత్రులు కూడా తోడయ్యారు.

దీంతో కాంగ్రెస్‌ (14), బీఆర్‌ఎస్‌ (9), స్వతంత్రులు (4), మజ్లిస్‌ (3), ఏఐఎఫ్‌బీ (2) తోపాటు ఆ పార్టీల ఎమ్మెల్యేలు కమలాకర్‌, కవ్వంపల్లి సత్యనారాయణల‌ ఎక్స్‌అఫీషియో ఓట్లతో కూటమి బలం 34కు చేరింది. బీజేపీ గూటికి వెళ్లిన స్వతంత్రుల్లో ఒకరు కాంగ్రెస్‌ కూటమికి రావడంతో ఆ సంఖ్య 35కు చేరింది. బీజేపీ నుంచి మరో ఇద్దరు కూడా వస్తారనే ప్రచారం జోరందుకున్న‌ది. క‌రీంన‌గ‌ర్‌లో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుండ‌టంతో మేయ‌ర్ పీఠం ఎవ‌రిని వ‌రిస్తుందో వేచి చూడాల్సిందే.

ఇక నిజామ‌బాద్ కార్పొరేష‌న్‌లో బీజేపీ 28 డివిజ‌న్ల‌తో అతిపెద్ద‌పార్టీగా అవ‌త‌రించిన‌ప్ప‌టికీ, మేయ‌ర్ పీఠానికి అవ‌స‌ర‌మైన మెజార్టీ మార్కును దాట‌లేక‌పోయింది. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం ఒక్క‌ట‌య్యాయి. మేయ‌ర్ కాంగ్రెస్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎంఐఎంకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో నిజామాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోనే ప‌డింది.

ఇందూరులో బీజేపీకి 28 డివిజన్లు రాగా, మ్యాజిక్‌ ఫిగర్‌కు మూడు తగ్గాయి. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డిలు ఎక్స్‌ అఫీషియో ఓట్లు వేస్తే ఆ మేరకు బలం చేకూరనుంది. కానీ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 17 మంది, ఎంఐఎం 14 మందితోపాటు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్‌ కూటమి బలం 34కు చేరనుంది. దీంతో మేయర్‌ పీఠం కాంగ్రెస్‌కు, డిప్యూటీ మేయర్‌ ఎంఐఎంకు దక్కడం లాంఛన ప్రాయమే కానుంది.

Advertisement
Advertisement