త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | విద్యా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు.. అభివృద్ధికి పునాది వేసే వేదికల‌ని సీఎం రేవంత్‌రెడ్డి స్ప‌ష్‌టం చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఎల్‌బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విద్యా రంగ అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

P

Telangana | Published On May 11, 2026, 8.41 pm IST

CM Revanth Reddy | విద్యా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు.. అభివృద్ధికి పునాది వేసే వేదికల‌ని సీఎం రేవంత్‌రెడ్డి స్ప‌ష్‌టం చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఎల్‌బీ స్టేడియంలో విద్యా వారోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విద్యా రంగ అభివృద్ధిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రూ.1011 కోట్ల వ్యయంతో క్యూర్ ప్రాంతంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.

ప్ర‌త్యేక ప్ర‌ణాళిక ప్రారంభిస్తున్నం..

అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.1700 కోట్లతో ప్రత్యేక ప్రణాళికను ప్రారంభిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ ఉద్యమాల సమయంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు పోషించిన పాత్రను గుర్తు చేస్తూ.. 1969 తొలి తెలంగాణ ఉద్యమం నుంచి 2009 మలి దశ ఉద్యమం వరకు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ముందుండి పోరాడారన్నారు. యూనివర్సిటీలు, విద్యను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుందని సీఎం హెచ్చరించారు. పేదలు, దళితులు, గిరిజనులు, మారుమూల గ్రామాల పిల్లలకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. అందుకే విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

11వేల ఉపాధ్యాయుల నియామ‌కాలు..

గతంలో 60 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేశామని, 22 వేల మందికి పదోన్నతులు కల్పించామని సీఎం వివరించారు. 36 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలను ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తి చేసినట్లు చెప్పారు. నీతి ఆయోగ్ కూడా విద్యాశాఖ సాధించిన పురోగతిని అభినందించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 27వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకుంటుండగా, 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. తెలంగాణలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. మరోవైపు 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 38 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొంటూ.. ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న గొప్పతనం ఏమిటి? ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న లోపం ఏంట‌ని సీఎం ప్ర‌శ్నించారు.

బ‌డ్జెట్‌లో 8శాతం విద్య‌కే నిధులు

రాష్ట్ర బడ్జెట్‌లో ప్రస్తుతం 8 శాతం నిధులను విద్య కోసం కేటాయిస్తున్నామని, భవిష్యత్తులో దానిని 15 శాతానికి పెంచే దిశగా అడుగులు వేస్తామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెట్టడమే లక్ష్యమన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని పేర్కొన్న సీఎం, విద్యా విధానాల అధ్యయనం కోసం 25 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన మరో 500 మంది ఉపాధ్యాయులను విదేశాలకు పంపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తామని ప్రకటించారు.

నూత‌న విద్యావిధానం..

తెలంగాణకు ప్రత్యేక నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తున్నామని సీఎం వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పదో తరగతి తర్వాత ఇంటర్‌లో డ్రాప్‌అవుట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, పేద విద్యార్థులు ఆకలితో పాఠశాలలకు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పాలు, రాగిజావ పంపిణీ చేస్తామని చెప్పారు. కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్టుగా పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నట్లు తెలిపారు.

చార్జీలు పెంచాం..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ పిల్లలతో సమానమని, తల్లిదండ్రుల్లా ప్రభుత్వం వారిని చూసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం, డైట్ ఛార్జీలు 40 శాతం పెంచినట్లు వెల్లడించారు. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్ల వ్యయంతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని సీఎం ప్రకటించారు. పేదల పిల్లలు “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో చదివాం” అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకురావడమే తన ధ్యేయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు టీచర్లు, ఐఏఎస్ అధికారులు లేదా రాజకీయ నాయకుల కోసం కాదని, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం అని స్పష్టం చేశారు. పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేయబోమన్నారు.

కావాల‌నే విద్యాశాఖ నా వ‌ద్ద ఉంచుకున్న‌..

విద్యార్థులకు అందించే ఎడ్యుకేషన్ కిట్ నాణ్యతను తానే స్వయంగా పరిశీలించానని సీఎం తెలిపారు. పుస్తకాలు, నోట్‌బుక్స్ సమయానికి విద్యార్థులకు చేరాలని ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే ఒక జత యూనిఫాం, నెలాఖరులో మరో జత అందజేస్తామని చెప్పారు. ఎడ్యుకేషన్ కిట్ల కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసే సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నూటికి నూరు శాతం మార్కులు సాధించాలన్నదే తన కల అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సీఎం అన్నారు. “ప్రభుత్వ టీచర్లకు ఇది ఉద్యోగం కాదు.. బాధ్యత” అని వ్యాఖ్యానించారు. 19 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల భవిష్యత్తు ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని గుర్తుచేశారు. “విద్యాశాఖకు మంత్రి లేడని కొందరు విమ‌ర్శిస్తున్నారు. కావాలనే నేను విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నాను. సమీక్షల సమయంలో నన్ను ముఖ్యమంత్రిగా కాకుండా విద్యాశాఖ మంత్రిగా చూడండి” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే విద్యాశాఖలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
Advertisement