త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ravi Narayana Reddy Memorial National Award 2025 Ceremony | ఎవరు తెలంగాణ జాతిపిత? ఎవరు ఉద్యమకారులు? కేసీఆర్‌పై రేవంత్ ఫైర్

వన్ నేషన్.. వన్ పార్టీ అని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయాలని బీజేపీ SIR ను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలని రేవంత్ స్పష్టం చేశారు.

J

Telangana | Published On Feb 2, 2026, 7.35 pm IST

Ravi Narayana Reddy Memorial National Award 2025 Ceremony | ఎవరు తెలంగాణ జాతిపిత? ఎవరు ఉద్యమకారులు? కేసీఆర్‌పై రేవంత్ ఫైర్
Advertisement

Ravi Narayana Reddy Memorial National Award 2025 Ceremony | తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు ప్రదానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా రేవంత్ రెడ్డి.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దగ్గర్నుంచి బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సుదీర్ఘంగా ప్రసంగించారు.

  • అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేద ప్రజల కోసం తన 500 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప వ్యక్తి. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారు. బండి యాదగిరి లాంటి నిరక్షరాస్యులను ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి. దేశంలో తొలి ప్రధాని నెహ్రూ కంటే కూడా ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా ఆనాడు తొలి పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డితో నెహ్రూ ప్రారంభింపజేశారు. 60 ఏళ్ల వయసులో ప్రజలకు స్ఫూర్తినిస్తూ పార్టీ, రాజకీయ పదవుల నుంచి తప్పుకున్న గొప్ప నేత రావి నారాయణరెడ్డి. ఈ కాలంలో ప్రజలు ఓడించినా కొందరు పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు.
  • రావి నారాయణరెడ్డి పురస్కారం జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి దక్కడం గౌరవప్రదం. తొలి తరంలో బూర్గుల, రావి నారాయణ రెడ్డి స్ఫూర్తినిస్తే… మలి తరంలో జైపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్లు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తి. 2019లో నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన వారు రాజకీయాల్లో ఉండాలని జైపాల్ రెడ్డిని కోరా. కానీ తరం మారింది.. ప్రత్యక్ష రాజకీయాలకు తను దూరం అని, మీలాంటి యువతరం రాజకీయాల్లో ఉండాలని ఆయన ప్రోత్సహించారు. సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనని గౌరవించిన గొప్ప నాయకులు జైపాల్ రెడ్డి, రావి నారాయణరెడ్డి.
  • జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిబద్ధత మోదీని భయపెడుతుందని ఆయనను రాహుల్ గాంధీ ఉపరాష్ట్రపతిగా బరిలో దించారు. ప్రజలకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించాలంటే ఏక పార్టీ, ఏక వ్యక్తి పాలనకు వ్యతిరేకంగా సుదర్శన్ రెడ్డి ఎన్నికల బరిలో దిగారు. అలాంటి వ్యక్తికి రావి నారాయణరెడ్డి పురస్కారం అందించడం సముచితం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న నిర్వాహకులకు అభినందనలు.

  • ఈ మధ్య తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు. ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారు. పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారు. మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారు.
  • తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా? ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా.. అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా? పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా… నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. రావి నారాయణ రెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు. పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి.. హుందాగా తప్పుకుంటే కొంతైనా మీ గౌరవం నిలబడేది. ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం, ఇదెక్కడి జాతిపిత లక్షణం.
  • అక్రమ మార్గం ఎంచుకున్న వారికి ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు. శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారు. మనమేం దైవాంశ సంభూతులం కాదు. మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారు. మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లింది. ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందే.
  • కమ్యూనిస్టు సోదరులు నినాదాలు ఇచ్చారు, పోరాటాలు చేశారు. ఆ నినాదాలకు, పోరాటాలకు చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్. దున్నే వాడికే భూమి అని పోరాడితే పేదలకు భూములు పంచింది కాంగ్రెస్. నాణేనికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు కమ్యూనిస్టులు ఉండాలి.
  • వన్ నేషన్.. వన్ పార్టీ అని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును కాలరాయాలని బీజేపీ SIR ను తీసుకువచ్చింది. ఓటు హక్కును కాలరాయాలన్న కుట్రపై కమ్యూనిస్టులు గ్రామాల్లో చైతన్యం తీసుకురావాలి. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.. దీనిపై మనమంతా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు తీసుకుంటాం. అందరితో సమావేశమై తెలంగాణలో సముచిత గౌరవం కల్పించే బాధ్యత మా ప్రభుత్వానిది.
Advertisement
Advertisement