త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నేనేందుకు రాజీనామా చేయాలి.. 2034 వ‌ర‌కు నేనే సీఎం

CM Revanth Reddy | తెలంగాణ‌లో విద్యాశాఖ‌కు పూర్తిస్థాయిలో మంత్రి లేడు.. అర్జంట్‌గా విద్యాశాఖ‌కు పూర్తిస్థాయి మంత్రిని నియ‌మించాల‌ని కొంద‌రు అంటున్న‌రు.. మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jul 30, 2026, 3.58 pm IST

CM Revanth Reddy | నేనేందుకు రాజీనామా చేయాలి.. 2034 వ‌ర‌కు నేనే సీఎం
Advertisement

విద్యాశాఖ తీసుకుని రోజు తిట్లు తింటున్నాను
న‌న్ను ఉపాధ్యాయులే కాపాడాలి
విద్య లేక‌పోవ‌డ‌మే అస‌లైన వెనుక‌బాటుత‌నం
ప్ర‌పంచంతో పోటీ ప‌డేలా విద్యార్థుల‌ను తీర్చిదిద్దాలి
ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అద‌నంగా ల‌క్ష మంది చేరిక‌
విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై ఉపాధ్యాయ సంఘాలు కొట్లాడాలి
విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్ల‌కు బ్రేక్‌ఫాస్ట్, లంచ్
ప్ర‌తి ఏటా టీచ‌ర్ల‌ను విదేశాల‌కు పంపిస్తాం
ఆ ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది
ఉపాధ్యాయుల‌తో ఇంట‌రాక్ష‌న్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో విద్యాశాఖ‌కు పూర్తిస్థాయిలో మంత్రి లేడు.. అర్జంట్‌గా విద్యాశాఖ‌కు పూర్తిస్థాయి మంత్రిని నియ‌మించాల‌ని కొంద‌రు అంటున్న‌రు.. మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. విద్యాశాఖ తీసుకుని రోజు తిట్లు తింటున్నాను. ఆ తిట్లు నాకు పడకుండా ఉండాలి అంటే ఉపాధ్యాయులే కాపాడాలి. లేదా మీరు అందరూ ఎవరికైనా ఆ శాఖ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాన‌ని సీఎం పేర్కొన్నారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఫిన్‌లాండ్, జ‌ర్మ‌నీ దేశాల్లో ప‌ర్య‌టించి వ‌చ్చిన ఉపాధ్యాయుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ఇంట‌రాక్ష‌న్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం ప్ర‌సంగించారు.

దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొట్ట మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు కు ప్రాధాన్యత ఇచ్చారు. సమాజంలో విద్య సమూల మార్పులు తీసుకువచ్చేందుకు పునాదిగా పనిచేస్తుందని నెహ్రూ నమ్మారు. దేశంలో కరువును పారద్రోలేందుకు ఇరిగేషన్ అవసరాన్ని నెహ్రూ గుర్తించారు. అందుకే సాగునీటి ప్రాజెక్టులను ఆయన ఆధునిక దేవాలయాలుగా వర్ణించారు. ఆనాటి ప్రధాని నెహ్రూ దూరదృష్టితో ఈనాడు 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని తెలంగాణ ఉత్పత్తి చేయగలిగింది. హరిత విప్లవం, పంచవర్ష ప్రణాళికలు తెచ్చిన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసని సీఎం అన్నారు.

వెనకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేదు

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2104 వరకు ప్రధానులుగా ఉన్నవాళ్లు చేసిన మొత్తం అప్పు రూ. 50 లక్షల కోట్లు. 2014 నుంచి 2026 వరకు ప్రధాని మోదీ చేసిన అప్పు రూ. 151 లక్షల కోట్లు. ఇప్పటి వరకు దేశంపై ఉన్న అప్పు రూ. 201 లక్షల కోట్లు. కొందరు చిన్న చిన్న సంఘటనలు చూపి గొప్ప గొప్ప విజయాలుగా మాట్లాడుతున్నారు. ఆనాడు ఎన్నో యుద్ధాలను ఎదుర్కొని భారత్‌ను సార్వభౌమత్వ దేశంగా మార్చిన వారి గురించి మాత్రం తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నాడు పీవీ తీసుకొచ్చిన గురుకులాలే నేటి నవోదయ విద్యాలయాలకు స్ఫూర్తి. ఆనాటి నాయకులు తెచ్చిన సంస్కరణలతో విద్య అందింది.. ఆకలి తీరింది. కానీ ప్రపంచంతో పోటీ పడాలంటే ఇది సరిపోదు. ప్రతీ పేదవాడికి విద్యను అందించడం మాత్రమే సరిపోదు.. వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలి. నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందిచడమే లక్ష్యంగా పనిచేయాలి. ఆ దిశగా తెలంగాణను తీర్చిదిద్దే ప్రతినిధులు మీరే. వెనకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులతో సంబంధం లేదు. విద్య లేకపోవడమే అసలైన వెనకబాటుతనం అని సీఎం పేర్కొన్నారు.

ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 8 వేలు ఖర్చు

ప్రభుత్వ ఆదాయం పెంచడం పేదలకు పంచడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష 8 వేలు ఖర్చు చేస్తోంది. ప్రైవేటు స్కూల్ పిల్లలకు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు దాదాపు 50 వేలు. మరి తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్స్‌కు ఎందుకు ప్రాధాన్యతనిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య లక్ష మంది అదనంగా చేరారని సీఎం తెలిపారు.

మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా..?

విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి వైదొలగాలని కొందరు మాట్లాడుతున్నారు. మంచి పర్ఫామెన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖకు రాజీనామా చేయాలా..? నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా..? టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా..? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? విద్యార్థులకు స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్‌గా నియమించినందుకా? అని సీఎం ప్ర‌శ్నించారు.

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది..

విద్య నైపుణ్యం కాదు.. విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంగ్లీష్ ఒక్కటే ముఖ్యమనుకుంటుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది? 25 ఏళ్లు అమెరికా వైపు చూశాం.. ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలపై. ఆ దేశాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రపంచంపై సంపూర్ణ అవగాహన ఉండాలి. విద్యార్థుల్లో ఆ అవగాహన పెంపొందిచాల్సింది ఉపాధ్యాయులే. ఈ వేదికగా ఉపాధ్యాయులకు నేను ఒకటే సూచన చేస్తున్నా. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. ఉపాధ్యాయ సంఘాలు మీ సమస్యలపై కాదు.. విద్యార్థుల సమస్యలపై కొట్లాడండి అని సీఎం సూచించారు.

క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రాణిస్తారు

ప్రపంచ దేశాలు మనవైపు చేసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదాం. ఒక ఐదేళ్లు సమాజం కోసం, తరతరాల భవిష్యత్‌ను మార్చేందుకు ప్రతిజ్ఞ పూనండి. దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేయండి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇంకా ఏం చేయాలో మీరే సూచన చేయండి. వచ్చే విద్యా సంవత్సరానికి ఏం చేస్తే బాగుంటుందో డిసెంబర్‌లోగా నివేదిక రూపొందించండి. ప్రతీ మండలాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేయండి. విద్యతోపాటు క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో రాణిస్తారు అని రేవంత్ రెడ్డి తెలిపారు.

పిల్లలు తల్లిదండ్రులకు స్ట్రెస్ బస్టర్స్..

2034 వరకు ప్రజా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు అందుతున్నాయి. ఉపాధ్యాయులు మీ అనుభవాన్ని విద్యార్థులకు పంచాలన్నదే మా ఆలోచన. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఏర్పాటు అందిస్తున్నాం. మానవ సంబంధాలను పునరుద్ధరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులకు స్ట్రెస్ బస్టర్స్. అందుకే డే స్కాలర్ విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందిస్తున్నామని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

ఓట్ల కోసం, రాజకీయం కోసం నేను పనులు చేయడం లేదు

సమాజంలో మానవ సంబంధాలు విచ్ఛిన్నమైతే ఏ కుటుంబం, ఏ దేశం నిలబడదు. తల్లిదండ్రుల కంటే పిల్లలు ఉపాధ్యాయుల దగ్గరే ఎక్కువ సమయం ఉంటారు. తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో ఉపాధ్యాయులకు అంతే బాధ్యత ఉంది. విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేయడానికైనా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్‌ల‌తో సమానంగా ప్రతీ ఏటా టీచర్స్‌ను విదేశాలకు పంపి చదువుకునేందుకు అవకాశం కల్పిద్దాం. నాణ్యమైన విద్యను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఖర్చులను ప్రభుత్వమే భరించేలా ప్రణాళికలు రూపొందించాలి. ఓట్ల కోసం, రాజకీయం కోసం నేను పనులు చేయడంలేదు. నాణ్యమైన విద్యను అందించాలనే బాధ్యతతో పని చేసుకుంటూ వెళ్తున్నా.. నా సంకల్పాన్ని మీరు ముందుకు తీసుకెళ్లేందుకు ఇక్కడి నుంచే దీక్ష తీసుకుని బయలుదేరండి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement
Advertisement