త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Praja Palana – Pragathi Pranalika | పాలనపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్.. అధికారుల ముందు 99 రోజుల యాక్షన్ ప్లాన్!

సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా సాంకేతికతను (Technology) పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలపై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

J

Telangana | Published On Feb 28, 2026, 9.03 pm IST

Praja Palana – Pragathi Pranalika | పాలనపై సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్.. అధికారుల ముందు 99 రోజుల యాక్షన్ ప్లాన్!
Advertisement

Praja Palana - Pragathi Pranalika | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మరింత స్పీడ్ పెంచారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనా సంస్కరణలపై ప్రభుత్వ కార్యదర్శులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఎన్నికలో ప్రజలు తనకు కావాల్సిన బలాన్ని ఇచ్చారని, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి:

మార్చి 6 నుంచి 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'

రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' పేరుతో ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగోను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతి అధికారి విధిగా పాల్గొనాలని, ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి ప్రభుత్వ ఆఫీసులన్నీ పరిశుభ్రంగా ఉండాలని, ఆ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆదేశించారు. కాగా, మార్చి 4న కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తానని, అందులో అందరి పనితీరుపై సమీక్షిస్తానని హెచ్చరించారు.

అద్దె భవనాల్లో ప్రభుత్వ ఆఫీసులు ఉండొద్దు..

పరిపాలనలో జవాబుదారీతనం తీసుకురావాలని సీఎం సూచించారు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని, రాబోయే బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని కచ్చితంగా చేర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న రెగ్యులర్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలి. నిర్ణీత సమయంలో ఫైళ్లు క్లియర్ కావాల్సిందేనని, ఇ-ఫైల్ (e-File) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. పాత కాలం నాటి సర్వర్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ఐటీ శాఖకు సూచించారు.

100 నియోజకవర్గాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'

నాణ్యమైన విద్య, వైద్యం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న ఆయన.. త్వరలోనే వంద నియోజకవర్గాల్లో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్' (Telangana Public Schools) ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడాలని, ప్రాంతాల వారీగా ప్రజల మెడికల్ డేటాను తయారు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు.

ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టులే కీలకం

హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు సీఎం గుర్తుచేశారు. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 10 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్యూర్ అర్బన్ రీజియన్‌లో మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని విస్తరించాలని సూచించారు. పారిశ్రామికీకరణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ' (Future City) దేశ ఆర్థిక స్థితిని మార్చబోతోందని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి వల్ల వచ్చే మార్పులను ప్రజలకు స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు. వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, పెట్టుబడులు త్వరగా గ్రౌండ్ అయ్యేలా (కార్యాచరణలోకి వచ్చేలా) చూడాలన్నారు.

సంక్షేమ పథకాల్లో సాంకేతికత..

సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందేలా సాంకేతికతను (Technology) పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలపై అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్వీస్ సెక్టార్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి, అన్ని పనులు ఆన్‌లైన్ విధానంలోనే జరిగేలా చూడాలన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఏఐ (AI) సమావేశంపై విమర్శలు వచ్చాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం గుర్తుచేశారు.

Advertisement
Advertisement