త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఆ ప‌సిపాప హంత‌కుల‌కు ఉరి శిక్ష వేయాలి.. కేటీఆర్ డిమాండ్

KTR | తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన సంఘటన కుమ్మెరలో జరిగింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పసిపాపను హత్య చేసిన హంతకులను శిక్షించి జైల్లో వేయాలి, అవసరమైతే ఉరిశిక్ష వేయాలి కానీ బయటకి వదలవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Feb 25, 2026, 3.33 pm IST

KTR | ఆ ప‌సిపాప హంత‌కుల‌కు ఉరి శిక్ష వేయాలి.. కేటీఆర్ డిమాండ్
Advertisement

హంత‌కుల‌కు అండ‌గా నిల‌బ‌డ్డ ప్ర‌తి ఒక్క‌డు దోషినే..
హ‌త్యా నేరం కింద కేసులు న‌మోదు చేయాల్సిందే..
హంత‌కులు ఎవ‌రైనా స‌రే జైల్లో పెట్టాల్సిందే..
పోలీసు యంత్రాంగానికి సిగ్గుందా అస‌లు..?
రాజ్యాంగాన్ని కూడా ఖ‌న‌నం చేశారు..
కుమ్మెర బాధితుల‌కు ఇల్లు క‌ట్టిస్తాం..
త‌క్ష‌ణ స‌హాయం కింద రూ. ల‌క్ష అంద‌జేత‌
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ సమాజం మొత్తం బాధతో, ఆవేదనతో తలదించుకునే దుర్మార్గమైన సంఘటన కుమ్మెరలో జరిగింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పసిపాపను హత్య చేసిన హంతకులను శిక్షించి జైల్లో వేయాలి, అవసరమైతే ఉరిశిక్ష వేయాలి కానీ బయటకి వదలవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో కాంగ్రెస్ గూండాల దాడిలో మృతి చెందిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని కేటీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

పసిపాప హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు ముమ్మాటికి దోషినే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ ఎవరైనా ఆ పసిపాప ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడటం ముమ్మాటికి తప్పే. హంతకుడు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా వారిని జైల్లో పెట్టాలి. దాడి చేసిన 8 మంది పైన ముమ్మాటికి హత్యానేరం కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలి. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఈ దాడి మాన‌వ‌త్వానికే మ‌చ్చ‌..

బిడ్డకు పాలు ఇవ్వాల్సిన తల్లి ఖననం చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ న్యాయం కోసం రోడ్డు మీద కూర్చుంది. నాగర్‌క‌ర్నూల్ అధికార యంత్రాంగం ఈరోజు ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసింది. గుడిలో దర్శనం చేసుకునే అవకాశం కల్పించమని అడిగిన పాపానికి దాడి చేసి 2 నెలల పాపను చంపేశారు. ఈ దాడి మానవత్వానికే మచ్చ.. తెలంగాణ సమాజమే తలదించుకునే సంఘటన కుమ్మెరలో జరిగింది అని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆ ప‌సిబిడ్డ‌కు కులం, మ‌తం అంటే ఏంటో తెలుసా..?

రెండు నెలల పసిబిడ్డకు కులం, మతం, అధికారం అంటే ఏంటో తెలుసా? మనిషి పుట్టినాక పుట్టింది కులం, మతం
మనుషులను చిన్నచూపు చూసి, దేవుడి దర్శనానికి వెళ్లకుండా అడ్డుకొని దాడి చేసి, తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టారు. హంతకులు ఏ పార్టీ వారైనా హంతకులే.. చిన్నారిని హత్య చేసిన 8 మంది హంతకుల ముఠాకు శిక్ష పడేలా చూడాలని స్థానిక ఎమ్మెల్యేకు డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన రెండు నెలల చిన్నారి ఒక ఎమ్మెల్యే బిడ్డనో, ఒక ఎంపీ బిడ్డనో, ఒక రాజకీయ నాయకుడి బిడ్డనో అయితే పోలీసులు ఇలానే స్పందించేవారా? అని కేటీఆర్ నిల‌దీశారు.

నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా పోలీసుల‌కు సిగ్గుందా..?

పసిగుడ్డు మొహమైనా చూసి వదిలేయండన్నా అంటే.. దుర్మార్గుడు, మానవమృగం కాలితో తంతే పసి పాప చనిపోయింది. బాధితులు మౌనిక, గణేష్ పోయి కంప్లైంట్ తీసుకోండని పోలీసులను అడిగితే మీరు సరిగ్గా రాసి ఇవ్వలేదని అన్నాడు అంట. నీకు జీతం ఇచ్చేది రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు కాదు.. నువ్వు సేవ చేయాల్సింది బాధితులకు. సుమోటోగా కేసు తీసుకోవాల్సింది పోయి.. అధికార నాయకులకు ఫోన్ చేసి మీ మీద ఫిర్యాదు చేశారు.. మీరు కూడా ఫిర్యాదు చేయండని సిగ్గులేకుండా ప్రేరేపించావు. నాగర్‌కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి సిగ్గుందా అసలు? పోలీసులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు.. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. పోలీసులు వేసుకున్న యూనిఫాంకి గౌరవం ఇవ్వకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకుండా అధికార పార్టీ నేతలను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

ఇల్లు క‌ట్టిస్తాం.. త‌క్ష‌ణ సాయం కింద రూ. ల‌క్ష‌

కుమ్మెర బాధితుల‌ కుటుంబానికి అండగా ఉంటామని, వారికి పది లక్షలతో ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి తక్షణ సహాయంగా రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న అన్ని వర్గాల నాయకులను, కార్యకర్తలను కలిసి కుటుంబానికి సంఘీభావం తెలిపారు.

Advertisement
Advertisement