త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధ‌మే.. అన్న‌దాత‌ల కోసం బీఆర్ఎస్ పోరాటం కొన‌సాగుతుంది..

BRS | రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధ‌మేన‌ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. అన్న‌దాత కోసం బీఆర్ఎస్‌ (BRS) పోరాటం ఆగ‌ద‌ని స్ఫ‌ష్టం చేశారు.

G

Telangana | Published On May 7, 2026, 5.34 pm IST

BRS | రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధ‌మే.. అన్న‌దాత‌ల కోసం బీఆర్ఎస్ పోరాటం కొన‌సాగుతుంది..
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధ‌మేన‌ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. అన్న‌దాత కోసం బీఆర్ఎస్‌ (BRS) పోరాటం ఆగ‌ద‌ని స్ఫ‌ష్టం చేశారు. చనిపోయిన రైతులను ఆదుకోవాల‌ని, పంట నష్టపరిహారం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర, మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీనివాస్ రెడ్డితో క‌లిసి ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మంత్రులు రైతు సమస్యలపై కనీసం స్పందించడం లేదని మండిప‌డ్డారు. వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించి న రైతు సంగ్రామ సదస్సు విజయవంతం కావడంతో ప్రభుత్వం రైతు మేళా పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం గడిచిన రెండున్నర ఏండ్ల‌లో రైతుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల మేళా పెట్టాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ కార్యకర్తలను బస్సులో తీసుకొచ్చి మేళా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు మంత్రులుగా ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఇప్పటి వరకు 50 శాతం ధాన్యం కొనుగోళ్లు కొనలేదని విమర్శించారు. ఇంతవరకు రైతులకు బోనస్‌ ఇవ్వలేదని చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన ప‌థ‌కాల‌ను అమ‌లు చేయాల‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతు బోగ‌స్ అయ్యింద‌న్నారు. మహబూబాబాద్,భూపాలపల్లి జిల్లాలో తీవ్ర పంట నష్టం జరిగిందని, రైతులు చనిపోయినా పట్టించుకోవడం లేదని వెల్లడించారు. క‌నీసం అధికారులు వెళ్లి రిపోర్ట్ చేశారా అని ప్ర‌శ్‌నించారు. కేటీఆర్ రైతుల గురించి మాట్లాడితే కేసులు పెట్టారని, మ‌రి కేసీఆర్ పైన‌ అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ మీద ఎన్ని కేసులు పెట్టాలని ప్ర‌శ్నించారు.

ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు.. 

వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ నిర్వ‌హించిన రైతు సంగ్రామ స‌భ‌ను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయ‌కులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర విమ‌ర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు బంగారం పండించార‌న్నారు. నాడు కల్లాల్లో మంత్రులు తిరిగి ధాన్యం కొనేదాకా కష్టపడ్డారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ధాన్యం కొనే పరిస్థితి లేద‌ని చెప్పారు. రైతులు ఇండ్లలో పడుకునే పరిస్థితి లేద‌ని, ధాన్యం కుప్పలమీద పడుకుంటున్నార‌ని తెలిపారు. ఈ ప్ర‌భుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్న‌ద‌ని విమ‌ర్శించారు.

పదేండ్ల‌లో రైతులకు చేసింది చూడాల‌ని, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నదో గమనించాల‌న్నారు. రేవంత్ రెడ్డి భాష చూస్తే అసహ్యంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీకి చాలెంజ్ చేస్తున్నాం.. రైతు డిక్లరేషన్ అమలు అవుతుందా? లేదా? సమాధానం చెప్పాల‌న్నారు. పంట కొనేందుకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయడం కూడా తెలియదా అని ప్ర‌శ్నించారు.

కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంద‌న్నారు. బీజేపీ గుండాలు చేసిన దాడి అత్యంత హేయమైన చర్య అని మండిప‌డ్డారు. బండి సంజయ్ వాడిన భాష చాలా అసహ్యంగా ఉంద‌ని చెప్పారు. ఇలాంటి దాడులు మంచిది కాద‌ని వెల్ల‌డించారు.

రైతుల బాధలు చూడండి..

రైతు సభలో రైతుల అంశాలు, రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్‌పై కేటీఆర్‌ అడిగార‌ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. డిక్లరేషన్ ఇచ్చి నాలుగేండ్లు అవుతుంద‌ని, దానిపైనే సభ పెట్టామ‌ని చెప్పారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది రైతులు వచ్చారని వెల్ల‌డించారు. సభకు ఒకరోజు ముందు కాంగ్రెస్ రైతు మేళా అని పెట్టారు.. జనం కరువయ్యారని విమ‌ర్శించారు. రైతుల బాధలు చూడాల‌ని.. సిగ్గు శరం ఉంటే కల్లాల వద్దకు వెళ్లాల‌న్నారు. రోడ్ల మీద తిరిగే అద్దంకి దయాకర్‌కు రైతుల కష్టాలు తెలియవ‌ని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి అన్నమాటలు గుర్తు చేశామే త‌ప్ప ఎక్కువ మాట్లాడలేద‌ని చెప్పారు.

అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు..

బీఆర్ఎస్‌ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏసీ హాల్‌లో, ఏసీ బస్సుల‌లో హోటల్ ఫుడ్ పట్టుకొచ్చి కాంగ్రెస్ రైతు మేళా నిర్వహించింద‌న్నారు. కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ పొలిటికల్ డైలీ లేబర్ బ్యాచ్ కేటీఆర్‌ను రెగ్యులర్ తిడితే రోజు వారికి ప్యాకేజీ వస్తుంద‌ని ఎద్దేవా చేశారు. రైతుల గురించి వాళ్లకు కనీసం తెలియద‌న్నారు. రైతు బంధు ఇవ్వాలని రైతులు ధర్నా చేయలేదు.. కేసీఆర్ ఆలోచన చేసి రైతు బంధు ఇచ్చార‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అనేక‌ హామీలు ఇచ్చి మోసం చేసింద‌ని విమ‌ర్శించారు.

Advertisement
Advertisement