త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Special Intensive Revision SIR | ఎస్ఐఆర్‌పై అనుమానాలున్నాయి : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

కేంద్ర ఎన్నికల సంఘం జూన్ నుంచి చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం పారదర్శకంగా జరగాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డిని కలిసి పలు అనుమానాలపై వినతి పత్రం సమర్పించారు.

J

Telangana | Published On Apr 28, 2026, 6.46 pm IST

Special Intensive Revision SIR | ఎస్ఐఆర్‌పై అనుమానాలున్నాయి : మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో జరగనున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (SIR) పై బీఆర్ఎస్ పార్టీ కీలక సూచనలు చేసింది. మాజీ ఎంపీలు వినోద్ కుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి.. రాష్ట్ర ఎన్నికల సీఈవో సుదర్శన్ రెడ్డిని కలిసి మెమోరాండం అందజేశారు. కొత్త ఫోటోల సేకరణ, డబుల్ ఓట్ల తొలగింపు వంటి అంశాలపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆదేశించినట్లు వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Advertisement
  • ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి
  • ఎన్నికల సీఈవోకు విజ్ఞప్తి

Special Intensive Revision SIR | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ఎస్ఐఆర్ కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఈ మేరకు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి, ఇతర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఓటర్ల జాబితా సవరణపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ సీఈవోకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది మరింత కీలకంగా మారిందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఓటర్ల నుంచి కొత్త ఫోటోలు సేకరించాలని అధికారులు చెబుతున్నారని, అయితే దీనిపై గ్రామీణ స్థాయి ప్రజల్లో సరైన అవగాహన లేదని ఆయన సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియకు సంబంధించి పార్టీకి ఉన్న పలు అనుమానాలను, అభ్యంతరాలను అధికారులకు వివరించినట్లు తెలిపారు.

డబుల్ ఓట్ల గుర్తింపుపై ఫోకస్

తాజాగా జరగనున్న ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా.. ఒక ఇంట్లో సదరు ఓటరు నిజంగానే నివాసం ఉంటున్నాడా లేదా? అన్నది అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అలాగే, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయా? రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందా? అన్న కోణంలోనూ ఎన్నికల సంఘం చెక్ చేయనున్నట్లు సమాచారం. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు విధిగా ప్రభుత్వ గుర్తింపు కార్డులు (ఐడీ ప్రూఫ్స్) సమర్పించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

బూత్ లెవెల్ ఏజెంట్స్ యాక్టివ్‌గా ఉండాలి

ఎన్నికల సంఘం నియమించే బూత్ లెవెల్ ఆఫీసర్లు మాత్రమే కాకుండా, పార్టీల తరపున ఉండే బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఈ ప్రక్రియలో అత్యంత చురుగ్గా పాల్గొనాలని వినోద్ కుమార్ సూచించారు. ఈ టైమ్‌లో ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకతను కాపాడాలని స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ నిన్న జరిగిన సమావేశంలో దిశానిర్దేశం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా, జాగ్రత్తగా సాగాలని సీఈవోను కోరినట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.

Advertisement
Advertisement