త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TPCC | ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ అనుమానాలు

TPCC | తెలంగాణలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో ఎన్యుమరేషన్‌ దశ సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజేష్‌కుమార్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

P

Telangana | Published On Aug 10, 2026, 3.35 pm IST

TPCC | ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ అనుమానాలు
Advertisement
  • 75ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించే అవ‌కాశం
  • నిజ‌మైన ఓట‌ర్ల‌ను తొల‌గిస్తే ఈసీ, కేంద్ర‌మే బాధ్య‌త వ‌హించాలి
  • టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజేశ్‌కుమార్‌

TPCC | తెలంగాణలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియలో ఎన్యుమరేషన్‌ దశ సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో టీపీసీసీ ఎలక్షన్‌ కమిషన్‌ కోఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌ పులిపాటి రాజేష్‌కుమార్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వద్ద నమోదైన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 72,21,419 మంది ఎన్యుమరేషన్‌ ఫారాలు నింపలేదని, 61,14,754 అనామలీస్‌, 2,84,021 మంది ఏఎస్‌డీడీ జాబితాలో, 3,18,598 మంది డీఎస్‌ఈ (డెమోగ్రాఫికల్లీ సిమిలర్‌ ఎంట్రీస్‌) కేటగిరీలో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్న సుమారు 3.38 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 1.31 కోట్ల ఓట్లను అనుమానాస్పదంగా పరిగణించినట్లు కనిపిస్తోందని రాజేశ్‌కుమార్‌ అన్నారు.

75ల‌క్షల ఓట్ల‌ను తొల‌గించే అవ‌కాశం

ఇందులో సుమారు 75 లక్షల ఓట్లను ఈ నెల 17న విడుదల చేసే ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ఆరోపించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి బీఎల్‌ఓ ఓటర్ల ఇళ్లకు కనీసం మూడుసార్లు వెళ్లి ఎన్యుమరేషన్‌ ఫారాలను అందజేసి, తిరిగి సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, తెలంగాణవ్యాప్తంగా మొదటి మూడు, నాలుగు రోజులు మాత్రమే ఈ ప్రక్రియ సక్రమంగా జరిగినట్లు తమకు సమాచారం ఉందన్నారు. మరోవైపు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ 100 శాతం పూర్తయిందని ఎన్నికల సంఘం ప్రకటిస్తోందని చెప్పారు.

ఫారాలు బీఎల్‌ఓల వద్దే ఎందుకు?

ఎన్యుమరేషన్‌ ఫారాలు 100 శాతం పంపిణీ చేసినట్లయితే ఇప్పటికీ వందల సంఖ్యలో ఫారాలు బీఎల్‌ఓల వద్ద ఎందుకు ఉన్నాయని రాజేశ్‌కుమార్‌ ప్రశ్నించారు. ఫారాలు అందించకపోవడమే కాకుండా, కొంతమంది ఓటర్లను ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చి రాజకీయ పార్టీల బీఎల్‌ఏల నుంచి సంతకాలు తీసుకున్నట్లు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ముసాయిదా జాబితా నుంచి తొలగించే అవకాశం ఉన్న సుమారు 75 లక్షల ఓట్లలో అర్హులైన నిజమైన ఓటర్లు ఉంటే వారి తొలగింపునకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అర్హులైన ఓటర్లు తొలగిపోతే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం, ఈసీపై అనుమానాలు

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకుని ఓటు చోరీకి పాల్పడుతోందనే అనుమానం తమకు ఉందని రాజేష్‌కుమార్‌ ఆరోపించారు. తెలంగాణలో పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ వైపు ఉన్నారనే ఉద్దేశంతో వారిని ఓటరు జాబితా నుంచి తొలగించి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాన్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఒక్క అర్హత కలిగిన నిజమైన ఓటరు కూడా తొల‌గిస్తే అందుకు ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పులిపాటి రాజేష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement