త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musi Rejuvenation | ఆవాసాలు లేని చోట తొలి ద‌శ‌ మూసీ అభివృద్ధి ప‌నులు

Musi Rejuvenation | హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న 21 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఆవాసాలు లేని తొలి ఐదు కిలోమీటర్ల మేర‌ పనులను తొలి దశలో తక్షణమే ప్రారంభించాలని మూసీ పున‌రుజ్జీవం ప్రాజెక్టు స‌బ్ క‌మిటీ (Cabinet Sub-Committee on Musi Rejuvenation Project) అధికారుల‌ను ఆదేశించింది.

S

News | Published On May 8, 2026, 4.07 pm IST

Musi Rejuvenation | ఆవాసాలు లేని చోట తొలి ద‌శ‌ మూసీ అభివృద్ధి ప‌నులు
Advertisement
  • ఫేజ్-1 కోసం రూ.7,055 కోట్ల‌ ఏడీబీ బ్యాంకు నిధులు
  • ఐదు కిలోమీట‌ర్లు వెంట‌నే ప‌నులు చేప‌ట్టాలి
  • 2027, డిసెంబ‌ర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయండి
  • అధికారుల‌కు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు క్యాబినెట్ స‌బ్‌ క‌మిటీ ఆదేశాలు

Musi Rejuvenation | త్రినేత్ర‌.న్యూస్‌: హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఉన్న 21 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఆవాసాలు లేని తొలి ఐదు కిలోమీటర్ల మేర‌ పనులను తొలి దశలో తక్షణమే ప్రారంభించాలని మూసీ పున‌రుజ్జీవం ప్రాజెక్టు స‌బ్ క‌మిటీ (Cabinet Sub-Committee on Musi Rejuvenation Project) అధికారుల‌ను ఆదేశించింది. ప్రజల ఆస్తులకు, నివాసాలకు కనీస నష్టం కూడా కలగకూడదన్న ఉద్దేశంతో ఉన్న నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా అలైన్ మెంట్‌ను మార్చుకోవాలని సూచించింది. ఫేజ్-1 కోసం సుమారు రూ.7,055 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి నిధులు సమకూర్చుకునేందుకు చర్చలు విజయవంతమైన‌ట్లు తెలిపింది.

ప్ర‌జ‌ల‌ను భాగం చేయ‌డ‌మే అభివృద్ధి..

మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు. మూసీ నది పునరుజ్జీవనం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, అది నగరవాసుల సామాజిక బాధ్యత అని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. అభివృద్ధి అంటే మనుషులను దూరం చేయడం కాదని, వారిని భాగస్వాములను చేయడమేనని చాటి చెబుతూ అధికారులకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

ర‌బ్బ‌ర్ డ్యామ్ న‌మూనాల ప‌రిశీల‌న‌..

నదిలో నీటి నిల్వను పెంచి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి 'రబ్బర్ డ్యామ్' (Obermeyer Spillway Gate Technology) నమూనాలను మంత్రులు పరిశీలించారు. 2026, ఆగస్టు నాటికి అన్ని అనుమతులు పూర్తి చేసుకుని పనులు ప్రారంభించి, 2027, డిసెంబర్ నాటికి ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి, ప్రజల హితం సమాంతరంగా సాగాలని, ఐఐటీ, జేఎన్ టీయూ వంటి సంస్థల సాంకేతిక సహకారంతో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులు జరగాలని మంత్రులు అధికారులను దిశానిర్దేశం చేశారు.

ఇవీ చేప‌ట్టే ప‌నులు..

  • నదిలోని వ్యర్థాల తొలగింపు, రివర్ బెడ్ ప్రొఫైలింగ్
  • వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్స్, రెండు వైపులా రోడ్ల నిర్మాణం
  • ప్రధాన మురుగు నీటి కాలువలు, నాలాలు, బ్యారేజీల ఏర్పాటు
  • నార్సింగి నుండి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం

ఈ ప్రాజెక్టు హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement