త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రైతుల క‌ష్టాలు గాలికొదిలి గాలిమోటార్ల‌లో సీఎం చెక్క‌ర్లా?: హ‌రీశ్‌రావు

Harish Rao | ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంట(Crop)కు బోనస్ (Bonus) ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయ‌ని.. వెంటనే రూ.5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

S

News | Published On Apr 13, 2026, 2.23 pm IST

Harish Rao | రైతుల క‌ష్టాలు గాలికొదిలి గాలిమోటార్ల‌లో సీఎం చెక్క‌ర్లా?: హ‌రీశ్‌రావు
Advertisement
  • మార్కెటింగ్ మంత్రి, సీఎం ఎక్క‌డికి పోయిర్రో
  • బోనస్ ఇవ్వరు, పంటను కొనరు
  • కోటా సాకుతో కొర్రీలు
  • ద‌ళారుల‌క‌మ్మితే అన్న‌దాత‌ల‌కు న‌ష్టమ‌ని తెల్వ‌దా?
  • రైతుల వ‌ద్ద‌ ఇంకా 60 వేల క్వింటాళ్ల శ‌న‌గ‌లున్న‌య్‌
  • రూ.5870 ధ‌ర‌తో వెంట‌నే కొనాలి
  • సదాశివపేట శ‌న‌గ‌ల‌ కొనుగోలు కేంద్రంలో హరీశ్ రావు డిమాండ్

త్రినేత్ర‌.న్యూస్‌: ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ లో ప్రతి పంట(Crop)కు బోనస్ (Bonus) ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు (Harish Rao) మండిప‌డ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల దగ్గర ఉన్నాయ‌ని.. వెంటనే రూ.5870 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట (Sadashivapeta) రైతు సేవా కేంద్రంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని సోమ‌వారం ఆయ‌న‌ సందర్శించారు. కోటా అయిపోయిందంటూ కొనుగోళ్లు నిలిపివేయడంతో వారం రోజులుగా అక్కడే పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు గుప్పించారు. రైతుల కష్టాలు గాలికొదిలేసి సీఎం, మంత్రులు గాలి మోటార్లలో విహ‌రిస్తున్నార‌న్నారు. భూములు, కాంట్రాక్టులు, కమీషన్ల మీద స‌మీక్ష‌లు చేస్తారు తప్ప పేద‌ రైతుల స‌మ‌స్య‌ల‌పై స‌మీక్ష చేసేందుకు మీకు సమయం దొరకదా? అని ప్ర‌శ్నించారు. ఎందుకు కొనుగోలు చేయడం లేదని అధికారులను నిలదీశారు.

కోటా సాకుతో శనగలు, మక్కలు, జొన్నల కొనుగోళ్లు నిలిపివేసి రైతులను నిలువునా ముంచుతున్నారని దుయ్య‌బ‌ట్టారు. కొనుగోలు కేంద్రాలు లేక పంట‌లు దళారుల పాలవుతున్నాయ‌ని.. శ‌నగలపై ఎకరానికి 10 వేల నష్టం వాటిళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేదన చెందారు. రైతులు బయట అమ్ముకుని క్వింటాల్ కు రూ.1000 చొప్పున ఎకరానికి పది వేల రూపాయలు నష్టపోతారన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రి, సివిల్ సప్ల‌యి మంత్రి, ముఖ్యమంత్రి ఎక్కడికి పోయారని నిల‌దీశారు.

పండిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే. ఎన్నికల ముందు ఇచ్చిన బోనస్ హామీ పూర్తిగా బోగస్. నేడు కనీస మద్దతు ధర కూడా దిక్కు లేదు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి సన్నవడ్లకు గత యాసంగితో పాటు, ఈ యాసంగి బోనస్ కూడా చెల్లించాలి. ఏటిగడ్డ సంఘం తదితర గ్రామాల రైతులు తమ శనగలు కొనడం లేదని మా దృష్టికి తెచ్చారు. అందుకే ఇక్కడి డీసీఎంఎస్ సెంటర్ కు రావడం జరిగింది. రైతులను, నిర్వాహకులను అడిగితే కోటా అయిపోయిందని చెబుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోంది. సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ధ్వ‌జ‌మెత్తారు.

గ‌ల్లీకి త‌క్కువ‌.. ఢిల్లీకి ఎక్కువ‌..

ముఖ్యమంత్రి, మంత్రులు గల్లీకి తక్కువ.. ఢిల్లీకి ఎక్కువ అన్నట్లుగా తయారయ్యారు. గాలి మోటార్లలో తిరుగుతూ కేరళ, ఢిల్లీ పర్యటనల్లో ఉన్న బిజీలో వారికి రైతుల కష్టాలు పట్టడం లేదు. భూమి మీద తిరుగుడు తక్కువైపోయి గాలి మోటార్ల తిరుగుడు ఎక్కువైపోయింది. సదాశివపేటలో కొత్తగా శనగలు కొనకపోగా, ఇప్పటికే కొన్న శనగలను కూడా బిల్లులు కావడం లేదని బస్తాలు ఖాళీ చేసి రైతులకే వెనక్కి ఇచ్చేస్తున్నారు. వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నామని మొగలయ్య లాంటి రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇప్ప‌టికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.

ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లి అమ్ముకునే ప‌రిస్థితి..

రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న పండితే, సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు. సంచులు లేవని, టోకెన్లు ఆపేశారని చెబుతున్నారు. మద్దతు ధర రూ. 2400 ఉంటే రూ. 1600-1700 కే అమ్ముకుని రైతులు మోసపోతున్నారు. జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదు. ఆరుగాలం కష్టపడ్డ రైతులు పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చింది. వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయి. మక్కలు, కందులు, శనగలు, జొన్నలకు బోనస్ ఇవ్వడం లేదు. కనీసం సన్న వడ్లకైనా ఈ యాసంగిలో బోనస్ ఇస్తారా లేదా స్పష్టం చేయాలి. గత యాసంగి బోనస్ వెంటనే విడుదల చేయాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

సీఎం త‌క్ష‌ణ‌మే స్పందించాలే...

ముఖ్యమంత్రి ఢిల్లీ, కేరళ టూర్లు ఆపి రైతుల కష్టాల మీద రివ్యూ చేయాలి. కొనుగోళ్లు ఆగిపోయాయన్న కనీస సమాచారం మీ ఇంటెలిజెన్స్ మీకు చెప్పడం లేదా? ఇక్కడ మల్లేషం అనే రైతు చెబుతున్నాడు.. రోజుకు కేవలం 10 గంటల కరెంటే ఇస్తున్నారని. పొద్దున ఎనిమిదింటికి కరెంటు వస్తోందని రైతులు వాపోతున్నారు. కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా? ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జొన్నలు, సన్ ఫ్లవర్, వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కోటా పేరుతో ఆగిపోయిన శనగల కొనుగోలును వెంటనే తిరిగి మొదలు పెట్టాలని హ‌రీశ్‌రావు ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు.

హరీశ్ రావు వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు.

Advertisement
Advertisement