త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhishek Banerjee Attacked | బెంగాల్‌లో దారుణం: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి.. హెల్మెట్ పెట్టుకుని ప్రాణరక్షణ

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికులు, బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో ఆయన హెల్మెట్ ధరించారు.

J

National | Published On May 30, 2026, 6.18 pm IST

Abhishek Banerjee Attacked | బెంగాల్‌లో దారుణం: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి.. హెల్మెట్ పెట్టుకుని ప్రాణరక్షణ
Advertisement
  • బెంగాల్‌లోని సోనార్‌పూర్‌లో పర్యటించిన టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి
  • బాధితులను పరామర్శించేందుకు వెళ్లగా.. కోడిగుడ్లు, రాళ్లు రువ్విన దుండగులు
  • 'దొంగ.. దొంగ' అంటూ నినాదాలు
  • తలకు గాయం కాకుండా హెల్మెట్ పెట్టుకున్న వైనం
  • ఇది కచ్చితంగా బీజేపీ పనేనని, తనను చంపడానికే కుట్ర చేశారని ఆరోపించిన అభిషేక్

Abhishek Banerjee Attacked | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలు ఎన్నికల తర్వాత కూడా రణరంగాన్ని తలపిస్తున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం దారుణ దాడి జరిగింది. సౌత్ 24 పరగణాల పరిధిలోని సోనార్‌పూర్‌లో (Sonarpur) స్థానికులు, కొందరు బీజేపీ కార్యకర్తలు ఆయనపై కోడిగుడ్లు, రాళ్లు రువ్వి భౌతిక దాడికి దిగారు.

అసలేం జరిగిందంటే..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలైన తర్వాత చోటుచేసుకున్న హింసలో (Post-poll violence) ఓ పార్టీ కార్యకర్త (సంజు) దారుణ హత్యకు గురయ్యాడు. ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు అభిషేక్ బెనర్జీ అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో భారీ ఎత్తున గుమిగూడిన జనం ఆయనను అడ్డుకున్నారు. 'దొంగ.. దొంగ' (Chor Chor) అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్‌పైకి రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.

ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నాయి. ప్రాణరక్షణ కోసం అభిషేక్ బెనర్జీ ఓ క్రికెట్ హెల్మెట్ (Cricket Helmet) ధరించి, భద్రతా సిబ్బంది మధ్య నడుచుకుంటూ వెళ్లారు. చుట్టూ జనం ఆయనను నెట్టేస్తూ, చొక్కా పట్టుకుని లాగుతున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఆయన కళ్లద్దాలు పగిలిపోగా, బట్టలు చిరిగిపోయాయి.

TMC MP Abhishek Banerjee Attacked in Bengal Stones Thrown

అదంతా బీజేపీ స్పాన్సర్డ్: అభిషేక్

ఈ ఘటనపై అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇదంతా బీజేపీ (BJP) చేయిస్తున్న పనే. వారి ప్రజాస్వామ్యానికి ఇదే నిదర్శనం. నన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేశారు. అదృష్టవశాత్తూ హెల్మెట్ ఉండటం వల్ల నా తలకు గాయం కాలేదు. మేము ముందుగానే మెయిల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇక్కడ వారి జాడ లేదు. ఫోన్ చేసినా ఎత్తలేదు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించే వరకు, అదనపు బలగాలు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు" అని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సాక్ష్యాలతో హైకోర్టును, గవర్నర్‌ను ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సెంట్రల్ ఫోర్స్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కేంద్ర హోంమంత్రి జవాబు చెప్పాలి

టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దేశంలోనే అతిపెద్ద రెండో ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత.. హింసకు గురైన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే బీజేపీ మద్దతుదారులు ఆయనపై దాడికి దిగారని మండిపడ్డారు. కౌంటింగ్ రోజున ఆయనకు సెక్యూరిటీ ఎందుకు తొలగించారో కేంద్ర హోంమంత్రి (Home Minister) సమాధానం చెప్పాలని 'ఎక్స్' వేదికగా డిమాండ్ చేశారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 208 స్థానాలు గెలుచుకుని బెంగాల్‌లో తొలిసారి సింగిల్ మెజారిటీతో అధికారంలోకి రాగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత పలు చోట్ల టీఎంసీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం టీఎంసీ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్‌ను సైతం ఆయన సొంత నియోజకవర్గంలోనే కొందరు అడ్డుకోవడం గమనార్హం.

Advertisement
Advertisement