త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actress Pratyusha | సినీ న‌టి ప్ర‌త్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ ఆదేశాలు

Actress Pratyusha | ప్ర‌ముఖ సినీ న‌టి ప్ర‌త్యూష (Actress Pratyusha) మృతి కేసులో దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తుది తీర్పు వెలువ‌రించింది.

D

National | Published On Feb 17, 2026, 11.25 am IST

Actress Pratyusha | సినీ న‌టి ప్ర‌త్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ ఆదేశాలు
Advertisement

Actress Pratyusha | ప్ర‌ముఖ సినీ న‌టి ప్ర‌త్యూష (Actress Pratyusha) మృతి కేసులో దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నేడు తుది తీర్పు వెలువ‌రించింది. ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి (Sidhartha Reddy) దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. సిద్ధార్థ్ రెడ్డిని వెంట‌నే పోలీసుల ఎదుట లొంగిపోవాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు నాలుగు వారాల పాటు గ‌డువు ఇచ్చింది. అదేవిధంగా ఈ కేసులో సిద్ధార్థ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు వేసిన రెండేళ్ల జైలు శిక్ష‌ను సుప్రీం ధర్మాసనం సమర్థించింది.

ఈ త‌ర్పుపై ప్ర‌త్యూష త‌ల్లి స‌రోజిని దేవి (Sarojini Devi) స్పందించారు. కోర్టు తీర్పును గౌర‌విస్తున్న‌ట్లు చెప్పారు. కానీ త‌న‌కు న్యాయం ద‌క్క‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “ఆమెను చంపేశార‌ని మొద‌టి నుంచి చెబుతున్నా. నా కుటుంబం ఎంతో న‌లిగిపోయింది. ప్ర‌త్యూష చ‌నిపోయిన త‌ర్వాత నాకు బెదిరింపులు వ‌చ్చాయి. సాక్ష్యాలను కూడా తారుమారు చేశారు. ఈ కేసులో ఉన్న‌వారు ఒక్క సాక్ష్యాన్ని మిగల్చ‌లేదు. ఉన్న సాక్ష్యాల‌తోనే కోర్టును ఆశ్ర‌యించా. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ఇది మ‌ర్డ‌ర్ అనే తేలింది. ప్య‌త్యూష శ‌రీరం, గొంతుపై గాట్లు ఉన్నాయి. ప్ర‌తీసాక్ష్యాన్నీ నాశ‌నం చేశారు. వైద్యులు కూడా నిందితుల‌కే స‌హ‌రించారు” అంటూ ప్ర‌త్యూష త‌ల్లి స‌రోజిని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న కూతుర్ని రేప్ చేసి చంపేశార‌ని ఆమె ఆరోపించారు.

ఇదీ కేసు నేప‌థ్యం..

రెండు ద‌శాబ్దాల క్రితం అప్ప‌టి వ‌ర్ధ‌మాన న‌టి ప్ర‌త్యూష అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెంద‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. 2002లో ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన సాయంత్రం కూల్ డ్రింక్‌లో పురుగుల మందు క‌లుపుకుని ప్ర‌త్యూష, సిద్ధార్థ‌రెడ్డిలు ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించారు. మ‌రుస‌టి రోజు ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన ప్ర‌త్యూష హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెంద‌గా, సిద్ధార్థ రెడ్డి మాత్రం బ‌తికి బ‌య‌టప‌డ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ‌రెడ్డికి గ‌తంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. దీంతో సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. 2012లో స‌రోజినీ దేవి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఇరు వ‌ర్గాలు వాద‌న‌ల‌ను వినిపిస్తూ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసింది. నేడు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement