త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు

అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు. రాత్రికి రాత్రే నిందితుల సంపద వంద రెట్లు ఎలా పెరిగింది? వాట్సాప్ చాట్స్ ఎందుకు డిలీట్ చేశారు?

J

National | Published On Jun 28, 2026, 7.39 pm IST

Ram Mandir Theft | రాముడి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు.. అయోధ్య విరాళాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు
Advertisement
  • అయోధ్య రామ మందిరం విరాళాల లెక్కింపులో పాల్గొన్న సిబ్బంది సుమారు రూ. 7.75 కోట్లు కాజేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి
  • ఈ చోరీ తర్వాత నిందితుల ఆస్తులు రాత్రికి రాత్రే 100 రెట్లు పెరగడంతో పాటు వాళ్లు భారీగా హోటళ్లు, ప్లాట్లు కొనుగోలు
  • డిజిటల్ ఆధారాలు దొరకకుండా నిందితులు తమ ఫోన్లను ఫార్మాట్ చేయగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా
  • ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Ram Mandir Theft | త్రినేత్ర.న్యూస్ : అయోధ్య (Ayodhya) రామ మందిరంలో భక్తులు సమర్పించుకున్న విరాళాల (Donations) చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగుచూస్తున్నాయి. రాముడి సొమ్మును కాజేసిన నిందితులు.. ఆ డబ్బుతో రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. అతి తక్కువ వ్యవధిలోనే వీరి ఆస్తులు ఏకంగా వంద రెట్లు (100x) పెరగడం దర్యాప్తు అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

హుండీ డబ్బుతో హోటళ్లు, ప్లాట్ల కొనుగోలు

హుండీ డబ్బుతో కనీసం ఊహించలేని ఖరీదైన ఆస్తులను ఈ నిందితులు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏకంగా ల్యాండ్స్, రెసిడెన్షియల్ ప్లాట్లతో పాటు హోటళ్లను కూడా సొంతం చేసుకున్నారు. చోరీ చేసిన డబ్బును పంచుకునే విషయంలో వీళ్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగానే ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టిన్నూ యాదవ్ (Tinnu Yadav) సహా 30 మంది అనుమానితులపై సిట్ లోతైన విచారణ జరుపుతోంది.

సాక్ష్యాలు దొరక్కుండా మొబైల్స్ ఫార్మాట్

విరాళాల చోరీపై విచారణ జరుగుతోందని తెలియగానే.. నిందితులు డిజిటల్ ఆధారాలను (Digital evidence) తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు. తమ మొబైల్ ఫోన్లలోని వాట్సప్ చాట్స్ (WhatsApp chats) సహా ఇతర డేటాను డిలీట్ చేయడంతో పాటు, కొందరైతే ఏకంగా ఫోన్లను పూర్తిగా ఫార్మాట్ చేసేశారు. అయితే, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ (CCTV footage), కాల్ డేటాను కీలక ఆధారాలుగా చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఆలయ కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జి, సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

8 మంది అరెస్ట్.. రూ. 7.75 కోట్ల గోల్‌మాల్

కానుకల లెక్కింపు విభాగంలో పనిచేస్తున్న అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రమాశంకర్ (టిన్నూ యాదవ్) లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సీసీటీవీ కెమెరాల్లో వీరంతా విరాళాలను కాజేస్తూ స్పష్టంగా దొరికిపోయారు. ఇప్పటివరకూ దాదాపు రూ. 7.75 కోట్ల విరాళాలు దారిమళ్లినట్లు అంచనా వేయగా, పోలీసుల దాడుల్లో కేవలం రూ. 80 లక్షలు మాత్రమే రికవరీ అయ్యాయి.

మందిరం ప్రారంభోత్సవం తర్వాత నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల చిట్టాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా ట్రస్ట్ సభ్యులకు ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. కాగా, ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ (Champat Rai) నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ స్కామ్ వ్యవహారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దృష్టికి వెళ్లడంతో.. ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కమిటీ హెడ్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

Advertisement
Advertisement