త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pulwama Attack Mastermind Killed | పీవోకేలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో పుల్వామా దాడుల మాస్టర్‌మైండ్ ‘హంజా బుర్హాన్’ హతం

40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల బలిదానానికి కారణమైన పుల్వామా దాడుల సూత్రధారి, ఉగ్రవాది హంజా బుర్హాన్ పీవోకేలో దారుణ హత్యకు గురయ్యాడు.

J

National | Published On May 21, 2026, 4.00 pm IST

Pulwama Attack Mastermind Killed | పీవోకేలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో పుల్వామా దాడుల మాస్టర్‌మైండ్ ‘హంజా బుర్హాన్’ హతం
Advertisement
  • పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు
  • పుల్వామా దాడి ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన హంజా బుర్హాన్ అలియాస్ 'డాక్టర్' హతం
  • 2022లో ఇతడిని కరుడుగట్టిన ఉగ్రవాదిగా ప్రకటించిన భారత కేంద్ర హోంశాఖ
  • చదువు పేరుతో పాక్ వెళ్లి అల్-బదర్ ఉగ్ర సంస్థలో కమాండర్‌గా ఎదిగిన బుర్హాన్

Pulwama Attack Mastermind Killed | త్రినేత్ర.న్యూస్ : పాకిస్థాన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల (unknown men) ఆపరేషన్ మళ్లీ మొదలైందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన హంజా బుర్హాన్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) లో హత్యకు గురయ్యాడు. ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు.

కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన హంజా బుర్హాన్‌ను ఉగ్రవాద వర్గాల్లో 'డాక్టర్' అని పిలుస్తారు. 2022లో కేంద్ర హోంశాఖ ఇతడిని కరుడుగట్టిన ఉగ్రవాదిగా (designated terrorist) ప్రకటించింది. బుర్హాన్ అసలు పేరు అర్జుమాండ్ గుల్జార్ దార్. ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఇతడిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో, శరీరంలోకి అనేక బుల్లెట్లు దూసుకెళ్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్, పీవోకేలలో భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదులు వరుసగా ఇలాగే హత్యకు గురవుతున్న విషయం తెలిసిందే.

చదువుకని వెళ్లి ఉగ్రవాదిగా

పుల్వామాలోని రత్నిపొర ప్రాంతానికి చెందిన బుర్హాన్.. ఉన్నత చదువుల పేరుతో 2017లో పాకిస్థాన్ వెళ్లాడు. కానీ అక్కడ చదువు మానేసి, నిషేధిత 'అల్-బదర్' (Al-Badr) ఉగ్రవాద సంస్థలో చేరాడు. అతి తక్కువ కాలంలోనే ఆ సంస్థకు కమాండర్‌గా ఎదిగాడు. ఆ తర్వాత కశ్మీర్ తిరిగి వచ్చి యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టాడు. పుల్వామా నుంచి షోపియాన్ వరకు తన నెట్‌వర్క్‌ను చాపకింద నీరులా విస్తరించాడు.

బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్‌కు దారితీసిన దాడి

జైష్-ఏ-మహ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ చేసిన 2019 పుల్వామా దాడి, భారత భద్రతా బలగాలపై జరిగిన అత్యంత దారుణమైన దాడిగా చరిత్రలో మిగిలిపోయింది. ఫిబ్రవరి 14, 2019న లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి పేలుడు పదార్థాలతో ఉన్న కారును ఓ ఉగ్రవాది ఢీకొట్టి 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. ఈ దాడికి ప్రతీకారంగానే కొద్దిరోజుల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో సర్జికల్ స్ట్రైక్స్ (surgical strikes) నిర్వహించి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఆ దాడికి మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన బుర్హాన్.. గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతం కావడం గమనార్హం.

Advertisement
Advertisement