త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Assembly Security Breach | బారికేడ్లను బద్దలు కొట్టి, స్పీకర్ కారులో బొకే పెట్టి పరారైన దుండగుడి అరెస్ట్

ఢిల్లీ అసెంబ్లీ వద్ద భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ మాస్క్ ధరించిన దుండగుడు కారుతో అసెంబ్లీ గేటును బద్దలు కొట్టి, స్పీకర్ కారులో పూల బొకే ఉంచి పరారయ్యాడు. పోలీసులు తీవ్ర గాలింపు తర్వాత నిందితుడు సరబ్జిత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

J

National | Published On Apr 6, 2026, 7.04 pm IST

Delhi Assembly Security Breach | బారికేడ్లను బద్దలు కొట్టి, స్పీకర్ కారులో బొకే పెట్టి పరారైన దుండగుడి అరెస్ట్
Advertisement

Delhi Assembly security breach | త్రినేత్ర.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే ఢిల్లీ శాసనసభ (Delhi Assembly) ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం ఊహించని భద్రతా వైఫల్యం బయటపడింది. ఓ మాస్క్ ధరించిన వ్యక్తి కారుతో ఏకంగా అసెంబ్లీ బారికేడ్లను బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకొచ్చాడు. ఏకంగా స్పీకర్ కారులోనే పూల బొకే ఉంచి అక్కడి నుంచి దర్జాగా పరారవడం భద్రతా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

కొన్ని గంటల్లోనే నిందితుడి అరెస్ట్

ఈ ఘటన తర్వాత అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కొన్ని గంటల వ్యవధిలోనే నార్త్ ఢిల్లీలోని జనసాంద్రత గల రూప్ నగర్ ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతడి కారును సీజ్ చేశారు. పట్టుబడిన నిందితుడిని సరబ్జిత్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగిందంటే?

పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో యూపీ (UP) రిజిస్ట్రేషన్ నంబర్ (UP-26 AZ 8090) ఉన్న టాటా సియెర్రా కారులో మాస్క్ ధరించిన వ్యక్తి అసెంబ్లీ 2వ నంబర్ గేటు వద్దకు చేరుకున్నాడు. వీఐపీల ప్రవేశం కోసం ఉద్దేశించిన ఆ గేటు వద్ద సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలు పహారా కాస్తున్నాయి. భద్రతా సిబ్బందిని దాటుకుని అత్యంత వేగంగా బారికేడ్లను ఢీకొట్టి కారును లోపలికి తీసుకెళ్లాడు.

Masked Man Arrested After Major Security Breach at Delhi Assembly

ఆ తర్వాత అకస్మాత్తుగా కారు ఆపి, మెడలో బంతిపూల దండలు, చేతిలో ఓ బ్యాగ్, పూల బొకేతో ప్రశాంతంగా కిందకు దిగాడు. నేరుగా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు వెళ్లిన అతడు.. స్పీకర్ కారులో కూర్చుని అక్కడ పూల బొకేను ఉంచాడు. సెక్యూరిటీ సిబ్బంది తేరుకునే లోపే మళ్లీ తన కారులో ఎక్కి గేటు బయటకు ఉడాయించాడు.

బాంబు స్క్వాడ్ తనిఖీలు

ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల సమయంలోనూ ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ ఘటన మరువక ముందే ఈ చొరబాటు జరగడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించారు. దుండగుడు వదిలివెళ్లిన పూల బొకేను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేవని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు సరబ్జిత్ సింగ్‌ను విచారిస్తున్నారు. అసలు ఈ దురాగతానికి ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement