త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీలో భారీ భద్రతా వైఫల్యం: కారుతో గేటును బద్దలు కొట్టి, స్పీకర్ కారుపై సిరా చల్లిన దుండగుడు

ఢిల్లీ అసెంబ్లీ వద్ద భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఓ దుండగుడు కారుతో అసెంబ్లీ గేటును బద్దలు కొట్టి లోపలికి చొరబడి, స్పీకర్ కారుపై సిరా చల్లి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

J

National | Published On Apr 6, 2026, 3.35 pm IST

Delhi Assembly Security Breach | ఢిల్లీ అసెంబ్లీలో భారీ భద్రతా వైఫల్యం: కారుతో గేటును బద్దలు కొట్టి, స్పీకర్ కారుపై సిరా చల్లిన దుండగుడు
Advertisement

Delhi Assembly Security Breach | త్రినేత్ర.న్యూస్ : ఢిల్లీ శాసనసభ (Delhi Assembly) ప్రాంగణంలో సోమవారం మధ్యాహ్నం భారీ భద్రతా వైఫల్యం బయటపడింది. అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అసెంబ్లీ ప్రాంగణంలోకి ఓ గుర్తుతెలియని కారు ఏకంగా గేటును బద్దలు కొట్టుకుని లోపలికి దూసుకురావడం అక్కడి సిబ్బందిని, భద్రతా అధికారులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటన రాష్ట్ర శాసనసభ భద్రతా ప్రోటోకాల్‌పై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ (UP) రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఓ కారులో మాస్క్ ధరించి వచ్చిన ఓ వ్యక్తి.. అసెంబ్లీకి చెందిన 2వ నంబర్ గేటు (Gate No 2) బారికేడ్లను అత్యంత వేగంగా ఢీకొట్టి లోపలికి చొరబడ్డాడు.

లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ కారు నేరుగా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు దూసుకెళ్లింది. అక్కడ పోర్చ్ వద్ద కారు ఆపిన ఆ దుండగుడు, కిందకు దిగి ఒక పూల బొకేను అక్కడ ఉంచాడు. అనంతరం స్పీకర్ కారుపై సిరా చల్లి, భద్రతా సిబ్బంది తేరుకునే లోపే కారుతో సహా అక్కడినుంచి పరారయ్యాడు.

Major Security Breach at Delhi Assembly Masked Man Rams Car Through Gate Throws Ink at Speaker Vehicle

గతంలో బాంబు బెదిరింపులు

ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల సమయంలోనూ ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు ఏకంగా ఓ ఆగంతకుడు కారుతో నేరుగా లోపలికి చొరబడి దాడికి పాల్పడటం అసెంబ్లీ భద్రతలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది.

రంగంలోకి ఢిల్లీ పోలీసులు

ఈ దాడిపై ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు. అసెంబ్లీ లోపల, బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కారు యూపీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ట్రేస్ చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. భద్రతా ఉల్లంఘన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న అసెంబ్లీ సిబ్బందిని, సెక్యూరిటీ గార్డులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అసెంబ్లీకి యాక్సెస్ పాయింట్లను సమీక్షిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన పర్యవేక్షణ, ఎంట్రీ పాయింట్ల వద్ద కఠినమైన తనిఖీలు చేపట్టాలని భద్రతా విభాగం నిర్ణయించింది.

Advertisement
Advertisement