త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jharkhand Ex CM Champai Soren Grandson Died | మనాలీలో విషాదం: జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ మనవడు మృతి

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన స్నేహితులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి వెకేషన్‌కు వెళ్లిన ఆయన మనవడు వీర్ సోరెన్ (19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

J

National | Published On Feb 25, 2026, 4.17 pm IST

Jharkhand Ex CM Champai Soren Grandson Died | మనాలీలో విషాదం: జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ మనవడు మృతి
Advertisement

Jharkhand Ex CM Champai Soren Grandson Died | త్రినేత్ర.న్యూస్ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆయన మనవడు, బాబులాల్ సోరెన్ కుమారుడైన వీర్ సోరెన్ (19) హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరగడం సోరెన్ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఏం జరిగింది?

వీర్ సోరెన్ తన స్నేహితులతో కలిసి ఫిబ్రవరి 22న మనాలీ చేరుకున్నాడు. అక్కడి సిమ్సా ప్రాంతంలోని ఒక హోమ్‌స్టేలో వీరు బస చేశారు. ఫిబ్రవరి 23న సోలాంగ్ వ్యాలీ, సేథన్ గ్రామాల సందర్శన ముగించుకుని హోటల్‌కు తిరిగి వచ్చిన తర్వాత వీర్ సోరెన్ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో వీర్ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు స్నేహితులకు చెప్పాడు. వాళ్లు ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో అవి వేసుకొని నిద్రపోయాడు. అయితే, మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో గదిలో పెద్ద శబ్దం రావడంతో స్నేహితులు వెళ్లి చూడగా, వీర్ బెడ్ పైనుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

నోటి వెంట నురుగు.. ఆసుపత్రికి వెళ్లేలోపే..

వీర్ సోరెన్ పరిస్థితి విషమించడంతో వెంటనే అతడిని మనాలీలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే వీర్ నోటి నుంచి నురుగు రావడం గమనించినట్లు సమాచారం. ఆసుపత్రిలో వైద్యులు సీపీఆర్ నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

హై-ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌?

ప్రాథమిక సమాచారం ప్రకారం, అతి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు కలిగే అనారోగ్యం కారణంగానే మరణం సంభవించి ఉండవచ్చని మనాలీ డీఎస్పీ కేడీ శర్మ తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.

చంపై సోరెన్ భావోద్వేగ ట్వీట్

మనవడి మరణవార్త తెలియగానే చంపై సోరెన్ తన ముగ్గురు కుమారులతో కలిసి రాంచీ నుంచి ఢిల్లీ మీదుగా మనాలీ చేరుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ద్వారా ఈ విషాద వార్తను ఆయన పంచుకున్నారు.

"మా ప్రియమైన మనవడు వీర్ సోరెన్ అకాల మరణం మా కుటుంబాన్ని కలిచివేసింది. మనాలీలో అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. విధి మరోలా తలచింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు పోస్ట్‌మార్టం నిర్వహించవద్దని వారు కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోరెన్ కుటుంబం మనవడి పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

https://x.com/ChampaiSoren/status/2026526051485233200

 

Advertisement
Advertisement