త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gujarat High Court | నేరం నాది కాదు ఆకలిది.. అన్నం అడిగిన కుమార్తెపై దాడి చేసి మరణానికి కారణమైన తల్లికి బెయిల్

ఆకలితో అలమటిస్తూ అన్నం అడిగిన పాపపై దాడి చేసి ప్రాణాలు తీసిన తల్లికి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ హృదయవిదారక వ్యాఖ్యలు చేసింది.

J

National | Published On Aug 5, 2026, 11.55 pm IST

Gujarat High Court | నేరం నాది కాదు ఆకలిది.. అన్నం అడిగిన కుమార్తెపై దాడి చేసి మరణానికి కారణమైన తల్లికి బెయిల్

సంక్షిప్త సారాంశం

ఆకలి తట్టుకోలేక అన్నం అడిగిన రెండేళ్ల కుమార్తెపై ఆగ్రహంతో దాడి చేసి, ఆ పాప మరణానికి కారణమైన ఏడు నెలల గర్భిణి (తల్లి)కి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేరస్థులు పుట్టరని.. పరిస్థితులే వారిని నేరస్థులుగా మారుస్తాయని, ఆకలి వల్ల తల్లి ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం సమాజ వ్యవస్థల వైఫల్యమేనని జస్టిస్ హస్ముఖ్ డి సుతార్ వ్యాఖ్యానించారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్, మహాత్మా గాంధీ సూక్తులను ఉటంకిస్తూ.. ఆకలి అనేది కేవలం ఆర్థిక అంశం కాదని, మానవ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని న్యాయమూర్తి తెలిపారు. తల్లికి ఎలాంటి దురుద్దేశం లేదని, అది కేవలం ఆ క్షణంలో ఆకలి భరించలేక చేసిన పొరపాటని భావించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

Advertisement
  • బెయిల్ ఇస్తూ హైకోర్టు కంటతడి పెట్టించే వ్యాఖ్యలు

Gujarat High Court | త్రినేత్ర.న్యూస్ : "నేరస్థులు పుట్టరు.. పరిస్థితులే వారిని నేరస్థులుగా మారుస్తాయి. తీవ్రమైన ఆకలి ఒక తల్లిని ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టేలా చేసిందంటే.. అది ఆమె వ్యక్తిగత వైఫల్యం కాదు, మన సమాజం, సంక్షేమ వ్యవస్థల ఉమ్మడి వైఫల్యం" — ఇది గుజరాత్ హైకోర్టు ఒక హృదయవిదారక కేసులో చేసిన భావోద్వేగ వ్యాఖ్య.

ఆకలితో తల్లడిల్లుతూ అన్నం పెట్టమని గొడవ చేసినందుకు తన రెండేళ్ల కుమార్తెను కొట్టగా.. ఆ చిన్నారి మరణించిన కేసులో గర్భవతి అయిన తల్లికి జస్టిస్ హస్ముఖ్ డి సుతార్ బెయిల్ మంజూరు చేశారు.

'ఆకలితో ఉన్న వ్యక్తికి దేవుడు అన్నం రూపంలోనే కనిపిస్తాడు'

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి విక్టర్ హ్యూగో రాసిన 'లే మిజరబుల్స్' (Les Misérables) నవలని, గుజరాత్ కరవు నేపథ్యంలో పన్నాలాల్ పటేల్ రాసిన 'మానవినీ భవాయి' అనే ప్రముఖ నవలను గుర్తు చేసుకున్నారు. "మనిషి చెడ్డవాడు కాదు.. ఆకలే చెడ్డది" అని ఆ కథల్లో చెప్పిన సత్యాన్ని సభకు వివరిస్తూ కోర్టు కంటతడి పెట్టించే వ్యాఖ్యలు చేసింది.

కోర్టు కీలక వ్యాఖ్యలు

"ఒకవైపు ఆకలితో అరిచిన బిడ్డ కడుపు నింపలేక, ఆగ్రహంలో ఆమె ప్రాణాలు తీసిన తల్లి.. మరోవైపు ఆమె కడుపులోనే జన్మకోసం పోరాడుతున్న ఇంకో జీవి! ఇది కేవలం ఒక కుటుంబంలో జరిగిన విషాదం కాదు. మన సామాజిక న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్న సత్యం." అని జస్టిస్ హస్ముఖ్ డి సుతార్ వ్యాఖ్యానించారు.

ప్రతి మతంలోనూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమధర్మమని చెప్పారని గుర్తుచేస్తూ.. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలోని పవిత్ర వాక్యాలను కోర్టు ఉటంకించింది. అలాగే "ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు నేరుగా కనిపించడు, కేవలం అన్నం రూపంలోనే కనిపిస్తాడు" అన్న మహాత్మా గాంధీ మాటలను ధర్మాసనం ప్రస్తావించింది.

అసలు ఏం జరిగింది?

పిటిషనర్ భర్త ఆరు నెలల క్రితం ఉద్యోగం కోసం వెళ్లి కుటుంబాన్ని గాలికి వదిలేశాడు. తీవ్ర పేదరికంలో ఉన్న ఆమె తన ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తోంది. ఆ సమయంలో రెండేళ్ల చిన్నారి ఆకలితో అలమటిస్తూ అన్నం కావాలని నిరంతరం ఏడవడంతో, ఆకలి బాధలో ఉన్న తల్లి తట్టుకోలేక కోపంతో బిడ్డను కొట్టింది.

ఆ తర్వాత చిన్నారి అచేతనంగా పడిపోవడంతో కంగారుపడిన తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాప అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

దురుద్దేశం లేకే బెయిల్ మంజూరు

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆమెను జైలుకు పంపారు. నిందితురాలి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి అని, ఆమెతో పాటు జైలులో ఒక చిన్నారి ఉంటే, ఇంట్లో మరొక చిన్నారి ఒంటరిగా ఉండిపోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కేసులో తల్లికి పాపను చంపాలనే దురుద్దేశం లేదని, ఆకలి భరించలేక క్షణికావేశంలో చేసిన ఆతురత చర్యగా కోర్టు అభివర్ణించింది. చిన్నారి స్పృహ తప్పగానే ఆస్పత్రికి పరుగులు తీసిందని, ఇది ఆమె మాతృత్వ వేదనకు అద్దం పడుతోందని పేర్కొంటూ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం ఆరేళ్ల లోపు పిల్లలకు సంరక్షణ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది.

Advertisement
Advertisement