త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delimitation | కేంద్రంపై క‌త్తులు నూరుతున్న ద‌క్షిణాది రాష్ట్రాలు.. బిల్లుల‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు క‌ష్ట‌మే..?

Delimitation | కేంద్ర ప్ర‌భుత్వం గురువారం ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ది. ఇందులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వీభ‌జ‌న బిల్లులు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ బిల్లుల‌పై ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది.

P

National | Published On Apr 15, 2026, 7.40 am IST

Delimitation | కేంద్రంపై క‌త్తులు నూరుతున్న ద‌క్షిణాది రాష్ట్రాలు.. బిల్లుల‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు క‌ష్ట‌మే..?
Advertisement

Delimitation | కేంద్ర ప్ర‌భుత్వం గురువారం ప్ర‌త్యేక పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌బోతున్న‌ది. ఇందులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వీభ‌జ‌న బిల్లులు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ బిల్లుల‌పై ప్ర‌తిప‌క్షాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ప్ర‌భుత్వం, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని చారిత్రాత్మక నిర్ణ‌యంగా అభివర్ణిస్తుండగా.. ప్రతిపక్షం దీని వెనుక ఉన్న ఉద్దేశాలపై ప్ర‌శ్న‌లు సంధిస్తోంది.

ఈ బిల్లు ఉద్దేశం అస్పష్టంగా ఉందని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి హాని క‌లిగిస్తుంద‌ని కాంగ్రెస్ విమ‌ర్శ‌లు గుప్పించింది. ప్రభుత్వ ఉద్దేశాలు మోసపూరితమైనవని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. దక్షిణ భార‌త్‌లోని పలువురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగినా, ఉత్తరాది నేత‌ల పలుకుబడి పెరిగినా విస్తృతమైన ఆందోళనలు జరుగుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హెచ్చ‌రించారు.

ప్ర‌ధానికి రేవంత్‌రెడ్డి లేఖ‌..

అన్ని రాజ‌కీయ పార్టీలతో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఇప్ప‌టికే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం ప్ర‌ధానికి లేఖ రాశారు. కేవలం జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లను విభజించడం సమాఖ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని, దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఉమ్మడి వ్యూహం కోసం రెడ్డి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు ముఖ్యమంత్రులకు కూడా లేఖ రాశారు. రాష్ట్రాల సమ్మతి లేకుండా తీసుకునే ఏ నిర్ణయమైనా విస్తృత నిరసనలకు దారితీస్తుందని తేల్చి చెప్పారు.

తమిళనాడు మౌనంగా ఉండద‌న్న స్టాలిన్‌..

డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వంపై త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర‌స్థాయిలో స్పందించారు. త‌మిళ‌నాడు అన్యాయం జ‌రిగితే భారీ ఉద్య‌మం చేప‌డుతామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ ప్రక్రియ తమిళనాడుకు హాని కలిగించినా, ఉత్తర రాష్ట్రాల రాజకీయ శక్తిని అసమానంగా పెంచినా రాష్ట్రంలో విస్తృత నిరసనలు జరుగుతాయి ఆయ‌న హెచ్చ‌రించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి తన నాయకత్వంలో భారీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో దృష్టి వేరే చోట ఉంటుందని, మీరు ఢిల్లీలో నిశ్శబ్దంగా డీలిమిటేషన్ చేయవచ్చని అనుకోవద్ద‌ని, తమిళనాడుకు అన్యాయం జరిగితే.. దాని ఫ‌లితం యావత్ దేశం దాన్ని అనుభ‌విస్తుంద‌న్నారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి రహస్యంగా జరుగుతోందని స్టాలిన్ ఆరోపించారు. తన పార్టీ అయిన డీఎంకేను గానీ, మరే ఇతర రాజకీయ పార్టీని గానీ, రాష్ట్రాన్ని గానీ సంప్రదించలేద‌న్నారు. ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరుగుతుందో కూడా మాకు చెప్ప‌లేద‌ని విమ‌ర్శించారు.

వివక్ష ఉండడ‌ద‌న్న రిజిజు

లోక్‌సభ స్థానాల పునర్విభజన (delimitation)తో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న ఆందోళనలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను గరిష్టంగా 850కి పెంచే రాజ్యాంగ సవరణ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలే లబ్ధి పొందుతాయని, ఎందుకంటే నియోజకవర్గాల సంఖ్య దామాషా పద్ధతిలో పెరుగుతుందన్నారు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పూర్తిగా సమతుల్యంగా, సుదీర్ఘ ఆలోచనతో రూపొందించబడిందని, ప్రతి వర్గం, ప్రాంతం, రాష్ట్ర ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటుందని రిజిజు నొక్కి చెప్పారు. దీనిపై విమర్శలకు ఎలాంటి ఆస్కారం లేద‌న్నారు. విధానాలు, కార్యక్రమాల పరంగా ఎవరైనా దీన్ని విమర్శిస్తే రాజకీయ రంగంలో అది పూర్తిగా అర్థం చేసుకోదగిన విషయమేన‌న్నారు. అయితే, శాసనసభల్లో మహిళలకు కల్పించే 33 శాతం రిజర్వేషన్‌ను ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించడం లేద‌ని, ఇది కేవలం ప్రభుత్వ బిల్లు మాత్రమే కాదు, ఏదో ఒక రకంగా ఇది అన్ని రాజకీయ పార్టీలకు, యావత్ దేశానికి సంబంధించిన బిల్లు అని మంత్రి తెలిపారు.

మహిళా సాధికారత లక్ష్యానికి మద్దతుగా అన్ని పార్టీలు ఏకమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సొంతంగా మూడింట రెండు వంతుల మెజారిటీ లేద‌ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే, ఈ బిల్లులను ఆమోదించడం కష్టమవుతుంద‌న్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైనా సరే ఆమోదం పొందాలంటే, పార్లమెంటులో హాజరైన సభ్యులలో మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి అనే నియమం ఉంద‌న్నారు. లోక్‌సభలో గానీ, రాజ్యసభలో గానీ ప్రభుత్వానికి సొంతంగా ఈ మెజారిటీ లేద‌ని, లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీకి 362 సభ్యులు అవసరం కాగా, ఎన్డీఏ కూటమికి కేవలం 292 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజారిటీకి 163 సభ్యులు అవసరం కాగా, ప్రభుత్వానికి కేవలం 141 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు.

నేడు కాంగ్రెస్ స‌మావేశం..

మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు బుధవారం సమావేశం కానున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ మార్పులకు కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement