త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aloka The Peace Dog | ప్రపంచాన్ని చుట్టేస్తున్న భారతీయ వీధి కుక్క ‘అలోక’: గ్లోబల్ పీస్ డాగ్‌గా ఎలా మారిందంటే?

బోధ్‌గయలో బౌద్ధ సన్యాసుల వెంట నడిచిన ఒక వీధి కుక్క.. నేడు ప్రపంచ శాంతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. దేశాలు దాటిన ఈ 'పీస్ డాగ్' ఇన్‌స్పైరింగ్ జర్నీ మీకోసం.

J

National | Published On Jun 13, 2026, 3.50 pm IST

Aloka The Peace Dog | ప్రపంచాన్ని చుట్టేస్తున్న భారతీయ వీధి కుక్క ‘అలోక’: గ్లోబల్ పీస్ డాగ్‌గా ఎలా మారిందంటే?

సంక్షిప్త సారాంశం

2022లో గాయాలతో ఉన్న ఓ వీధి కుక్క (అలోక) బౌద్ధ సన్యాసులతో కలిసి 100 రోజులకు పైగా పాదయాత్ర చేసి బోధ్‌గయ చేరుకుంది. సన్యాసులతో కలిసి అమెరికాలో 2,300 మైళ్లు నడిచిన అలోక.. శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల్లోనూ పర్యటించింది. జూన్ 8, 2026న 'వాక్ ఫర్ పీస్'లో భాగంగా అలోక, బౌద్ధ సన్యాసుల బృందం తిరిగి మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కరుణ, మైండ్‌ఫుల్‌నెస్ (mindfulness) ప్రాముఖ్యతను చాటుతూ మనుషులు, జంతువుల మధ్య ప్రేమకు అలోక ఒక ప్రతీకగా నిలుస్తోంది.

Advertisement

Aloka The Peace Dog | త్రినేత్ర.న్యూస్ : ఒకప్పుడు భారతీయ వీధుల్లో అనాథగా తిరిగిన ఓ కుక్క.. ఇప్పుడు ప్రపంచ దేశాలు చుట్టొస్తూ 'గ్లోబల్ పీస్ మస్కట్' (శాంతి దూత)గా మారిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 2022లో బౌద్ధ సన్యాసులతో కలిసి నడక ప్రారంభించిన 'అలోక' (Aloka).. జూన్ 8, 2026న మరోసారి తన పుట్టినిల్లు అయిన బీహార్‌లోని బోధ్‌గయ మహాబోధి ఆలయానికి చేరుకుంది. బౌద్ధ సన్యాసులు చేపట్టిన స్పిరిచ్యువల్ 'వాక్ ఫర్ పీస్' (Walk for Peace)లో భాగంగా అలోక చేసిన ఈ ప్రయాణం అందరినీ ఆకట్టుకుంటోంది.

అసలు ఈ కనెక్షన్ ఎలా మొదలైంది?

2022లో భిక్ఖు పన్నకర (Bhikkhu Pannakara) నేతృత్వంలోని బౌద్ధ సన్యాసుల బృందం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ నుంచి బోధ్‌గయకు పాదయాత్రగా బయలుదేరింది. ఆ యాత్ర ఆరో రోజున గాయాలతో ఉన్న ఓ వీధి కుక్క వారిని వెంబడించడం ప్రారంభించింది. దారిలో చాలా కుక్కలు వారితో కలిసినా, కొద్ది దూరం తర్వాత వెనుదిరిగేవి.

కానీ, ఈ కుక్క మాత్రం ఏకంగా 100 రోజులకు పైగా వారితో నడిచి మహాబోధి ఆలయానికి చేరుకుంది. "మాతో పాటు చివరిదాకా ఉండిపోయింది అలోక మాత్రమే" అని పన్నకర గుర్తుచేసుకున్నారు. అక్కడే దానికి 'అలోక' అని నామకరణం చేసి, తమతో పాటే తీసుకెళ్లాలని సన్యాసులు నిర్ణయించుకున్నారు.

అమెరికాలో 2,300 మైళ్ల పాదయాత్ర!

బోధ్‌గయ యాత్ర ముగిశాక.. పన్నకర అలోకను అమెరికా తీసుకెళ్లారు. టెక్సాస్‌లోని హువాంగ్ డావ్ విపస్సన భావన సెంటర్‌లో ఉంటూ.. అమెరికాలో దాదాపు 10 రాష్ట్రాల గుండా 2,300 మైళ్ల పాదయాత్రను బౌద్ధ సన్యాసులు పూర్తి చేశారు. ఆ యాత్రలో అలోక కూడా వారితోనే అడుగులు వేసి ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనల్లోనూ అలోక పాల్గొంది.

ఇప్పుడు తాజాగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA) భవనంలో ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ (IBC) నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సన్యాసుల బృందంతో పాటు అలోక కూడా హాజరైంది.

స్లో డౌన్.. దొరుకుతుంది ప్రశాంతత!

ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం కరుణ, మైండ్‌ఫుల్‌నెస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే. "మనం జీవితంలో వేగాన్ని తగ్గిస్తే, మనకు ప్రశాంతత దొరుకుతుంది. మన అంతరంగాన్ని మనం పరిశీలించుకుంటే శాంతి లభిస్తుంది" అని పన్నకర పేర్కొన్నారు.

ఒకప్పుడు ఇంజనీర్‌గా పనిచేసి.. డబ్బు సంపాదించే బిజీ లైఫ్ నుంచి బౌద్ధ సన్యాసిగా మారిన పన్నకర.. తన జీవితం పూర్తిగా మారిపోయిందని తెలిపారు.

The delegation of Buddhist monks, led by Bhikkhu Pannakara, at an event at the Indira Gandhi National Centre for the Arts in New Delhi | Photo: Tarini Unnikrishnan | ThePrint

IBC మాజీ డైరెక్టర్ జనరల్ అభిజిత్ హల్దర్ మాట్లాడుతూ.. "ఈ యాత్ర కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడం కాదు, మనుషుల హృదయాలను తాకే ప్రయాణం. వేగంతో పరుగులు తీస్తున్న ఈ ప్రపంచానికి, కాస్త ఆగి నెమ్మదిగా నడవాలనే సందేశాన్ని మీరు ఇచ్చారు" అని కొనియాడారు. ఈ యాత్రను ప్రపంచానికి కనెక్ట్ చేయడంలో అలోక పాత్ర కీలకమని.. ఎంతో మంది పిల్లలు అలోక ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీశారని ఆయన చెప్పారు.

కరుణకు హద్దులు లేవు

ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ మాట్లాడుతూ.. "కుక్కలు, పిల్లులు, చెట్లు.. వీటన్నింటికీ ప్రాణం ఉంటుంది. అవి మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి, మనల్ని రక్షిస్తాయి. వాటిని సరిగ్గా చూసుకుంటే మనకు ఎలాంటి నష్టమూ ఉండదు" అని స్పష్టం చేశారు. మనుషులు, వీధి కుక్కల మధ్య సంబంధాల గురించి చర్చ జరుగుతున్న ఈ సమయంలో అలోక ప్రయాణం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు.

"ప్రేమ, కరుణలకు ఎలాంటి బౌండరీలు లేవు. అన్ని జీవులూ మెరుగైన జీవితానికి అర్హులే" అని పన్నకర ముగించారు. ఒకప్పుడు రోడ్డుపై అనాథగా తిరిగిన అలోక.. ఇప్పుడు ప్రపంచ దేశాలు తిరుగుతూ కరుణ అనేది కేవలం మనుషులకే పరిమితం కాదనే బౌద్ధ సిద్ధాంతానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

Advertisement
Advertisement