త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suyash Jain Social Worker | మండుటెండల్లో కార్మికులకు షర్బత్, పక్షులకు నీళ్లు.. ఆగ్రా యువకుడి రియల్ హీరో స్టోరీ!

ఆగ్రాకు చెందిన సుయాష్ జైన్ మండుటెండల్లో కార్మికులకు చల్లటి షర్బత్, పక్షులకు నీళ్లు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ స్పూర్తిదాయక కథనాన్ని తెలుసుకుందాం రండి.

J

National | Published On Jun 23, 2026, 1.00 am IST

Suyash Jain Social Worker | మండుటెండల్లో కార్మికులకు షర్బత్, పక్షులకు నీళ్లు.. ఆగ్రా యువకుడి రియల్ హీరో స్టోరీ!

సంక్షిప్త సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మండుతున్న వేసవిలో నిర్మాణ కార్మికులకు, వీధి వ్యాపారులకు సుయాష్ జైన్ రోజూ చల్లటి షర్బత్ అందిస్తున్నారు. పక్షుల దాహార్తిని తీర్చేందుకు నగరంలో పలుచోట్ల నీటి బౌల్స్, ఆహారాన్ని (బాజ్రా) ఏర్పాటు చేశారు. కరోనా సమయంలోనూ ఆయన 'కొవిడ్-19 ఫ్రీ జాబ్స్ ఫోరమ్' ద్వారా వేలాది మందికి ఉపాధి, రేషన్ సాయం అందించారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో తన సొంత ఖర్చులతో చేస్తున్న ఈ 'సమ్మర్ రిలీఫ్ సేవ'కు దాతలు, వాలంటీర్ల సాయం కోరుతున్నారు.

Advertisement

Suyash Jain Social Worker | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) నగరంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. మండుతున్న ఎండలో, వడగాల్పుల మధ్య నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు పడే కష్టం వర్ణనాతీతం. మరోవైపు దాహంతో అలమటించే పక్షులు నీటి కోసం విలవిలలాడుతుంటాయి. అందరూ తమ దైనందిన పనుల్లో బిజీగా ఉంటే.. సుయాష్ జైన్ (Suyash Jain) అనే యువకుడు మాత్రం ఒక అడుగు ముందుకేసి వారి కష్టాన్ని తీర్చే బాధ్యత భుజాన వేసుకున్నాడు.

మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్న సుయాష్‌కు సామాజిక సేవ అంటే ఎంతో మక్కువ. తన వృత్తిపరమైన బాధ్యతలతో పాటు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటాడు.

Agra Man Brings Relief to Birds and Labourers in Summer Heat

కరోనా సమయంలో మొదలైన సేవ..

ఒక ఛేంజ్‌మేకర్‌గా (Changemaker) సుయాష్ ప్రయాణం కోవిడ్-19 (COVID-19) సమయంలో అందరికీ తెలిసింది. మొదటి వేవ్‌లో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడినప్పుడు, రజత్ అగర్వాల్‌తో కలిసి 'కొవిడ్-19 ఫ్రీ జాబ్స్ ఫోరమ్' (COVID-19 Free Jobs Forum) ను ప్రారంభించాడు. ఒక చిన్న గూగుల్ ఫామ్‌తో మొదలైన ఈ ప్రయత్నం.. ఏకంగా 13,000 మంది జాబ్ సీకర్స్, 600 మంది రిక్రూటర్లతో ఒక పెద్ద నెట్‌వర్క్‌గా మారింది. దీని ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి పొందారు.

Agra Man Brings Relief to Birds and Labourers in Summer Heat

కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిరుపేదలు, వలస కార్మికులు కనీసం ఒక్కపూట భోజనానికి కూడా ఇబ్బంది పడటం చూసి చలించిపోయాడు. వెంటనే మే 15, 2021న 'ఫీడింగ్ వన్స్ ఇన్ నీడ్' (Feeding Ones In Need) అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. తన సొంత డబ్బులతో గోధుమపిండి, బియ్యం, పప్పులు, నూనె, సుగంధ ద్రవ్యాలతో కూడిన రేషన్ కిట్స్ (Ration kits) పంపిణీ చేశాడు. ఒక్కో కిట్ నాలుగురు ఉన్న కుటుంబానికి రెండు వారాల పాటు సరిపోయేది. ఇలా ఆగ్రా అంతటా సుమారు 400 కుటుంబాలకు ఆకలి తీర్చాడు.

తల్లిదండ్రులే అతనికి స్ఫూర్తి

ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన సుయాష్‌కు తన కుటుంబం నుంచే వచ్చింది. అతని తండ్రి రోజూ ఉదయాన్నే లేచి పక్షులకు ధాన్యం (బాజ్రా), ఆవులకు రోటీలు పెట్టేవారు. వేసవిలో వాచ్‌మెన్లు, పారిశుధ్య కార్మికులకు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవారు. తన తల్లి కూడా తెరవెనుక ఉండి ఈ పనులన్నీ సజావుగా సాగేలా చూసుకునేది.

Agra Man Brings Relief to Birds and Labourers in Summer Heat

"ఇతరులకు సాయం చేయడం మా కుటుంబ రక్తంలోనే ఉంది," అని సుయాష్ చిరునవ్వుతో చెబుతాడు. ఆ స్ఫూర్తితోనే ఆగ్రా మండుటెండల నుంచి కార్మికులకు, పక్షులకు ఉపశమనం కలిగించేందుకు నడుంబిగించాడు.

కార్మికులకు చల్లని షర్బత్.. పక్షులకు నీరు

ఈ ఏడాది వేసవిలో సుయాష్ ‘సమ్మర్ రిలీఫ్ సేవా’ (Summer Relief Seva) పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇందులో భాగంగా రెండు ముఖ్యమైన పనులు చేస్తున్నాడు.

షర్బత్ పంపిణీ: ఎండలో కష్టపడే నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, చెత్త ఏరుకునే వారికి చల్లటి, తియ్యటి షర్బత్ (Sharbat) అందిస్తున్నాడు.

పక్షులకు నీరు, ఆహారం: నగరవ్యాప్తంగా పలుచోట్ల పక్షుల కోసం నీటి బౌల్స్, ధాన్యం ఏర్పాటు చేస్తున్నాడు.

మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య తన లంచ్ బ్రేక్ సమయంలో సుయాష్ స్వయంగా ఈ షర్బత్ పంపిణీ చేస్తాడు. కేవలం చల్లటి నీరు ఇస్తే దాహం మాత్రమే తీరుతుందని, అదే కొద్దిగా చక్కెర కలిపిన షర్బత్ ఇస్తే వారికి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుందనేది అతని ఆలోచన. రోజూ సుమారు 30 నుంచి 40 మంది కార్మికులకు ఈ ద్రావణాన్ని అందిస్తున్నాడు. వందలాది మందికి నాసిరకం సేవ చేయడం కంటే, తక్కువ మందికైనా రోజూ క్వాలిటీగా ఇవ్వాలన్నది అతని ఉద్దేశం.

ప్రస్తుతం రోజుకు సుమారు రూ.350 చొప్పున తన సొంత జేబులోంచి ఖర్చు చేస్తూ సుయాష్ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాడు. ఈ వేసవి పూర్తయ్యే వరకూ అంటే ఆగస్టు మొదటి వారం దాకా దీన్ని కొనసాగించాలన్నది అతని లక్ష్యం.

Advertisement

తాజావార్తలు

Advertisement