త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aadhaar Biometric | అక్టోబర్‌ 1 నుంచి గ్యాస్‌ సబ్సిడీకి ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి..!

Aadhaar Biometric | వంట గ్యాస్‌ సిలిండర్‌పై ప్రభుత్వ సబ్సిడీ పొందాలంటే ఇకపై ఆధార్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కానుంది. అక్టోబర్‌ 1, 2026 నుంచి సబ్సిడీ ధరకు దేశీయ ఎల్‌పీజీ రీఫిల్‌ బుక్‌ చేసుకునే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ (BAA) పూర్తి చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.

P

National | Published On Sep 19, 2026, 9.45 pm IST

Aadhaar Biometric | అక్టోబర్‌ 1 నుంచి గ్యాస్‌ సబ్సిడీకి ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి..!
Advertisement

Aadhaar Biometric | వంట గ్యాస్‌ సిలిండర్‌పై ప్రభుత్వ సబ్సిడీ పొందాలంటే ఇకపై ఆధార్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి కానుంది. అక్టోబర్‌ 1, 2026 నుంచి సబ్సిడీ ధరకు దేశీయ ఎల్‌పీజీ రీఫిల్‌ బుక్‌ చేసుకునే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ (BAA) పూర్తి చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. సబ్సిడీ ప్రయోజనం అర్హులైన కుటుంబాలకే అందేలా చూడటంతో పాటు.. దేశీయ అవసరాల కోసం ఉద్దేశించిన సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు మళ్లించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ఆధార్‌తో ఎల్‌పీజీ కనెక్షన్లను అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్, అనర్హమైన కనెక్షన్లను గుర్తించి తొలగించేందుకు వీలవుతుందని పేర్కొంది.

ఇప్పటికే పూర్తి చేసిన వారికి మినహాయింపు

ఇప్పటికే బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ పూర్తి చేసిన వినియోగదారులు మరోసారి ఈ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేదు. వారు మునుపటిలాగే గ్యాస్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు బీఏఏ పూర్తి చేయని వారు సబ్సిడీతో కూడిన రీఫిల్‌ పొందాలంటే అక్టోబర్‌ 1 తర్వాత ముందుగా అథెంటికేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వినియోగదారులకు బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కోసం పలు మార్గాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ సమయంలో డెలివరీ సిబ్బంది వినియోగించే మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అలాగే సంబంధిత ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌ షోరూమ్‌లోనూ అథెంటికేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్‌ కంపెనీల మొబైల్‌ యాప్‌ల ద్వారా కూడా అథంటికేష‌న్ పూర్తి చేసుకోవ‌చ్చు. ఇండెన్ గ్యాస్ వినియోగ‌దారులు ఇండెన్ వ‌న్, భారత్‌గ్యాస్‌ వినియోగదారులు హ‌లో బీపీసీఎల్‌, హెచ్‌పీ గ్యాస్‌ కస్టమర్లు, హెచ్‌పీ పే యాప్‌లను ఉపయోగించుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

సబ్సిడీ వద్దనుకుంటే మార్కెట్‌ ధరకు..

ఆధార్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ చేయించుకోకూడదనుకునే వినియోగదారులకు కూడా గ్యాస్‌ సరఫరా నిలిపివేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వారికి సబ్సిడీ వర్తించదు. మార్కెట్‌ ధర ప్రకారమే సిలిండర్‌ సరఫరా చేస్తారు. ఇలాంటి వినియోగదారులు తమ నిర్ణయాన్ని ఆయా చమురు మార్కెటింగ్‌ సంస్థల డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో నమోదు చేసుకోవాలి. వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌లు, వాట్సాప్‌ చాట్‌బాట్లు, ఐవీఆర్‌ఎస్‌ తదితర మార్గాల్లో తమ ప్రాధాన్యతను నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. స్థానికంగా లభ్యతను బట్టి 5 కిలోలు లేదా 10 కిలోల సిలిండర్లను కూడా సరఫరా చేస్తారు.

27.43 కోట్ల మంది..

సెప్టెంబర్‌ 19 నాటికి దేశవ్యాప్తంగా 27.43 కోట్ల మంది యాక్టివ్‌ దేశీయ ఎల్‌పీజీ వినియోగదారులు బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ పూర్తి చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది మొత్తం వినియోగదారుల్లో దాదాపు 90 శాతానికి సమానం. అక్టోబర్‌ 2023 నుంచే చమురు మార్కెటింగ్‌ సంస్థలు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌ సందేశాలు, డిస్ట్రిబ్యూటర్లు, డెలివరీ సిబ్బంది ద్వారా క్షేత్రస్థాయి ప్రచారం, ప్రత్యేక నమోదు శిబిరాలు, ఐవీఆర్‌ఎస్‌ రిమైండర్లు, డిజిటల్‌, సంప్రదాయ మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొంది. 2026 సెప్టెంబర్‌లో 14.2 కిలోల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌పై ప్రభుత్వం అందిస్తున్న అంతర్గత సబ్సిడీ సుమారు రూ.210గా ఉందని కేంద్రం తెలిపింది. నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకే సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు భరిస్తున్న అండర్‌రికవరీలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీని అర్హులకే పరిమితం చేయడం అవసరమని ప్రభుత్వం వివరించింది.

Advertisement
Advertisement