త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kidneys | కిడ్నీలు ఎల్ల‌ప్పుడూ సుర‌క్షితంగా ఉండాలంటే.. వైద్య నిపుణులు చెప్పిన సూచ‌న‌లు..

Kidneys | మ‌నిషి శరీరంలో మూత్రపిండాలు ప్రతిరోజూ ఎంతో కీలకమైన పనులను నిర్వహిస్తాయి. చిక్కుడు గింజ‌ల‌ ఆకారంలో ఉండే ఈ అవయవాలు రక్తంలో ఉన్న వ్యర్థాలను వడబోస్తాయి, శరీరంలోని ద్రవాల‌ స్థాయిలను నియంత్రిస్తాయి, ఎలక్ట్రోలైట్ సమతౌల్యాన్ని కాపాడుతాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

S

Lifestyle | Published On Mar 11, 2026, 12.06 pm IST

Kidneys | కిడ్నీలు ఎల్ల‌ప్పుడూ సుర‌క్షితంగా ఉండాలంటే.. వైద్య నిపుణులు చెప్పిన సూచ‌న‌లు..
Advertisement

Kidneys | మ‌నిషి శరీరంలో మూత్రపిండాలు ప్రతిరోజూ ఎంతో కీలకమైన పనులను నిర్వహిస్తాయి. చిక్కుడు గింజ‌ల‌ ఆకారంలో ఉండే ఈ అవయవాలు రక్తంలో ఉన్న వ్యర్థాలను వడబోస్తాయి, శరీరంలోని ద్రవాల‌ స్థాయిలను నియంత్రిస్తాయి, ఎలక్ట్రోలైట్ సమతౌల్యాన్ని కాపాడుతాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ఇంత ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ, సమస్యలు తలెత్తే వరకు చాలా మంది మూత్రపిండాల ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టరు. మూత్రపిండాలు వ్యర్థాలను తొలగించడం, ద్రవ సమతౌల్యాన్ని కాపాడటం, రక్తపోటును నియంత్రించడం, శరీర సమగ్ర ఆరోగ్యాన్ని ర‌క్షించ‌డంలో కీలకంగా ఉండడం వల్ల వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మూత్రపిండాలు దెబ్బతింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రారంభ దశ నుంచే ఆరోగ్యకరమైన అలవాట్ల‌ను పాటించడం ద్వారా జీవితాంతం మూత్రపిండాలను రక్షించుకోవచ్చు.

నీళ్లు, స‌మ‌తుల ఆహారం..

గుర్గావ్‌లోని ఫోర్టిస్ హాస్పిట‌ల్‌లో నెఫ్రాలజీ విభాగం ప్రిన్సిపల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న‌ డాక్టర్ సలీల్ జైన్ మూత్ర పిండాల ఆరోగ్యం కోసం ప‌లు కీలక సూచ‌న‌లు చేశారు. కొన్ని ర‌కాల సుల‌భ‌త‌ర‌మైన జీవ‌న‌శైలి అల‌వాట్ల‌ను పాటించ‌డంతోపాటు ఇత‌ర సూచ‌న‌ల‌ను జాగ్ర‌త్త‌గా అనుసరిస్తే దీర్ఘ‌కాలంలో మూత్ర‌పిండాలను సుర‌క్షితంగా ఉంచుకోవ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. కిడ్నీల‌ను ర‌క్షించుకునేందుకు గాను రోజూ త‌గినంత నీటిని తాగాల‌ని ఆయ‌న సూచించారు. రోజుకు క‌నీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్ల‌ను తాగితే డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. కిడ్నీల్లో స్టోన్స్‌, మూత్ర‌నాళ ఇన్ఫెక్ష‌న్ల‌ను నివారించ‌వ‌చ్చు. శ‌ర‌రీంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే కిడ్నీల ఆరోగ్యంపై రోజూ తీసుకునే ఆహారం కూడా ప్ర‌భావం చూపిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. స‌మ‌తుల‌ ఆహారం తీసుకోవాల‌ని సూచించారు. పండ్లు, కూర‌గాయ‌లు, ప‌ప్పు దినుసులు, మిల్లెట్లు, తృణ ధాన్యాలు, ఫైబ‌ర్ ఆహారాల‌ను తీసుకోవాల‌ని, జంక్ ఫుడ్‌, ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, ఉప్పు, చ‌క్కెర ఆహారాలను త‌గ్గించాల‌ని లేదా మానేయాలని చెప్పారు.

బీపీ, షుగ‌ర్ ఉంటే..

సోడియం అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో మూత్ర‌పిండాల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని డాక్ట‌ర్ జైన్ తెలిపారు. క‌నుక సోడియం ఉండే ఆహారాల‌ను పూర్తిగా త‌గ్గించాల‌ని, బెర్రీలు, ఆకుకూర‌లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల‌ని అన్నారు. ర‌క్త‌పోటు కూడా కిడ్నీల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. ర‌క్త‌పోటును నియంత్ర‌ణ‌లో ఉంచుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయ‌ని అన్నారు. ఇందుకు గాను స‌రైన ఆహారం తీసుకోవ‌డంతోపాటు రోజూ వ్యాయామం చేయాల‌ని అన్నారు. అలాగే త‌ర‌చూ బీపీ ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. ఇక డ‌యాబెటిస్ ఉన్నా కూడా కిడ్నీల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని, మ‌ధుమేహం ఉన్న‌వారు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాల‌ని, దీంతో దీర్ఘ‌కాలంలో కిడ్నీల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారించ‌వ‌చ్చ‌ని తెలిపారు. షుగ‌ర్ లేక‌పోయినా త‌ర‌చూ ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం ద్వారా వ్యాధి రాక‌ముందే గుర్తించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే త‌ద్వారా డ‌యాబెటిస్ రాక‌ను ఆల‌స్యం చేయ‌డంతోపాటు కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చ‌ని తెలిపారు.

వ్యాయామం త‌ప్ప‌నిస‌రి..

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాల‌ని డాక్ట‌ర్ జైన్ సూచించారు. వ్యాయామం వ‌ల్ల ర‌క్త‌పోటు, ర‌క్తంలో చక్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉండి కిడ్నీల ఆరోగ్యంపై పాజిటివ్ ప్ర‌భావాన్ని చూపిస్తాయి. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ అయినా చేయాల‌ని చెప్పారు. అలాగే శరీర బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం వ‌ల్ల కూడా కిడ్నీల‌ను దీర్ఘ‌కాలంలో కాపాడుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఇక చాలా మంది చిన్న నొప్పికే పెయిన్ కిల్ల‌ర్ మందుల‌ను వాడుతున్నార‌ని, దీని వ‌ల్ల దీర్ఘ‌కాలంలో కిడ్నీల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని, కిడ్నీలు చెడిపోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. నొప్పి నివార‌ణ‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాల‌ని, వైద్యుల స‌ల‌హా లేకుండా పెయిన్ కిల్ల‌ర్ మందుల‌ను వాడొద్ద‌ని, దీని వ‌ల్ల మూత్ర పిండాలు దీర్ఘ‌కాలంలోనూ సుర‌క్షితంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ధూమ‌పానం, మ‌ద్య‌పానం వ‌ద్దు..

మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి అంశాలు కిడ్నీల ఆరోగ్యాన్ని గ‌ణ‌నీయంగా దెబ్బ తీస్తాయి. అందువ‌ల్ల ఆయా అల‌వాట్లు ఉన్న‌వారు వెంట‌నే వాటిని మానేయాల్సి ఉంటుంది. అలాగే త‌ర‌చూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం, కుటుంబంలో ఎవ‌రికైనా కిడ్నీ స‌మ‌స్య‌లు లేదా డ‌యాబెటిస్‌, హైబీపీ వంటి స‌మ‌స్య‌లు ఉంటే ఇత‌రులు కూడా ర‌క్తం, మూత్రం ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం, చురుకైన జీవ‌న‌శైలిని క‌లిగి ఉండ‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో మూత్ర‌పిండాల‌ను సంర‌క్షించుకోవ‌చ్చ‌ని, కిడ్నీలు దెబ్బ తినే ప్ర‌మాదం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని డాక్ట‌ర్ జైన్ తెలిపారు.

Advertisement
Advertisement