త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Foods During Journey | ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు ఈ ఆహారాల‌ను అస‌లు తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

Foods During Journey | వేస‌వి సీజ‌న్ కావ‌డంతో చాలా మంది ఆధ్యాత్మిక లేదా ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు టూర్లు వేస్తుంటారు. అందులో భాగంగానే అంద‌రూ టూర్ల కోసం భిన్న మార్గాల‌ను ఎంచుకుంటారు. అయితే హైవే, ట్రెయిన్ ఇలా ఏ ప్ర‌యాణ మార్గం అయినా స‌రే మార్గ మ‌ధ్య‌లో స్నాక్స్ లేదా ఇత‌ర చిరుతిళ్ల‌ను, ఆహారాల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు.

S

Lifestyle | Published On Apr 19, 2026, 1.08 pm IST

Foods During Journey | ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు ఈ ఆహారాల‌ను అస‌లు తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?
Advertisement

Foods During Journey | వేస‌వి సీజ‌న్ కావ‌డంతో చాలా మంది ఆధ్యాత్మిక లేదా ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు టూర్లు వేస్తుంటారు. అందులో భాగంగానే అంద‌రూ టూర్ల కోసం భిన్న మార్గాల‌ను ఎంచుకుంటారు. అయితే హైవే, ట్రెయిన్ ఇలా ఏ ప్ర‌యాణ మార్గం అయినా స‌రే మార్గ మ‌ధ్య‌లో స్నాక్స్ లేదా ఇత‌ర చిరుతిళ్ల‌ను, ఆహారాల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. జ‌ర్నీ స‌మ‌యంలో ఇష్ట‌మైన ఫుడ్స్‌ను తింటూ ప్ర‌యాణాన్ని ఆస్వాదిస్తారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు కొన్ని ర‌కాల ఆహారాలను అస‌లు తీసుకోకూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. వాటివ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంటున్నారు.

వేయించిన ఆహారాలు, క‌ట్ చేసిన ఫ్రూట్స్‌..

ఎక్కువగా నూనెతో వేయించిన ఆహారాల‌ను ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు అస‌లు తిన‌కూడదు. ప‌కోడీలు, స‌మోసాలు వంటివి ఈ కోవ‌కు చెందుతాయి. ఉద‌యం చేసే బ్రేక్ ఫాస్ట్‌లో పూరీ కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. ఇవి పొట్ట‌లో భారంగా ఉండి అలసటను పెంచుతాయి. ముఖ్యంగా లాంగ్‌ డ్రైవ్‌ల సమయంలో ఇవి శరీరాన్ని మందగింపజేస్తాయి. అలాగే ఎక్కువ మసాలా ఉన్న వంటకాల‌ను ఖాళీ కడుపుతో తీసుకుంటే అసిడిటీ లేదా జీర్ణ సమస్యలు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. దీంతో రోజంతా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే కట్ చేసిన పండ్ల విష‌యంలోనూ జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు పక్కన విక్రయించే కట్ ఫ్రూట్స్ తాజాగానే కనిపించినా, సరైన శుభ్రత లేకపోవడం, ధూళి తగలడం వల్ల అవి కలుషితమయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్యాక్ చేసిన లేదా క‌ట్ చేయ‌ని పూర్తి పండ్లు తీసుకోవడం మరింత సురక్షితంగా ఉంటుంది. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

పాలు, పాల ఉత్ప‌త్తులు, కూల్ డ్రింక్స్‌..

పాలు లేదా పాల సంబంధిత‌ ఉత్పత్తులను కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. లస్సీ, మజ్జిగ, పనీర్‌తో చేసిన వంటకాలు వేడి వాతావరణంలో త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. సరైన నిల్వ లేకపోతే ఇవి జీర్ణాశ‌య‌ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి ఈ తరహా ఆహారాలను తీసుకునే ముందు పరిశుభ్రతను క‌చ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉండే పానీయాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్ ను కూడా ప్రయాణికులు తాగ‌కూడ‌దు. ఇవి తాత్కాలికంగా శక్తిని ఇచ్చినట్లుగా అనిపించినా, కొంతసేపటికి డీహైడ్రేషన్, అలసటకు దారితీస్తాయి. అందుకు బదులుగా నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాల‌ను తీసుకోవడం మంచిది. వీలుంటే కొబ్బ‌రినీళ్ల‌ను తాగ‌డం ఇంకా ఉత్త‌మం. అలాగే సరిగా వండని లేదా మళ్లీ వేడి చేసిన ఆహారం హైవే హోటళ్లలో సాధారణంగా క‌నిపిస్తుంది. ఇటువంటి ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువ‌గా ఉంటుంది. అది ఫుడ్ పాయిజ‌నింగ్‌ను క‌ల‌గ‌జేస్తుంది. కాబట్టి తాజా వేడి వేడి వంటకాలను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అధికంగా తిన‌డం..

ప్రయాణాల్లో అధికంగా తినడం కూడా సాధారణంగా జరిగే తప్పిదం. ఎక్కువగా తినడం వల్ల నిద్రమత్తు పెరిగి డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత తగ్గుతుంది. అందువల్ల తేలికపాటి, సమతుల ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం సురక్షితంగా ఉంటుంది. దేశంలో హైవే సదుపాయాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రయాణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆహార ఎంపికలపై అవగాహన మరింత ముఖ్యమవుతోంది. ఏం తింటున్నారో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం ద్వారా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే రోడ్డు ప్ర‌యాణం కాకుండా రైలు ప్ర‌యాణాల్లోనూ ప్ర‌యాణికులు జాగ్ర‌త్త‌లు పాటించాలి. రైళ్ల‌లో లేదా ప్లాట్‌ఫామ్‌ల‌పై కనిపించే ఆహారాల‌ను తినేముందు లేదా తాగేముందు శుభ్ర‌త‌ను ప‌రిశీలించాలి. ఫుడ్ ప్యాకింగ్‌, ఎలా ఉంది, ఎక్స్‌పైరీ తేదీ వంటివి త‌నిఖీ చేయాలి. అనుమానం వ‌స్తే అధికారుల‌కు ఫిర్యాదు చేయాలి. ప్ర‌యాణాల్లో ఉన్న‌ప్పుడు ఆహారం విష‌యంలో స‌రైన జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోతే ఆరోగ్య‌ప‌రంగా ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. జ‌ర్నీలో ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే మ‌ళ్లీ వైద్యుల‌ను క‌ల‌వ‌డం చాలా ఇబ్బందిగా మారుతుంది. అందువ‌ల్ల ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement