త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mark Carney India visit | దెబ్బకు దిగివచ్చిన కెనడా.. మోదీతో భేటీకి ముందే భారీ యూ-టర్న్! భారత్‌పై ఆరోపణలు వెనక్కి

భారత్‌తో దెబ్బతిన్న దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ కీలక అడుగులు వేస్తున్నారు. ఆయన భారత పర్యటనకు ముందే, గతంలో జస్టిన్ ట్రూడో సర్కార్ చేసిన తీవ్ర ఆరోపణల నుంచి కెనడా వెనక్కి తగ్గింది. భారత ఏజెంట్ల జోక్యం, దాడుల పట్ల తమకు ఇకపై ఎలాంటి ఆందోళన లేదని కెనడా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

J

International | Published On Feb 26, 2026, 10.50 am IST

Mark Carney India visit | దెబ్బకు దిగివచ్చిన కెనడా.. మోదీతో భేటీకి ముందే భారీ యూ-టర్న్! భారత్‌పై ఆరోపణలు వెనక్కి

సంక్షిప్త సారాంశం

కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటనకు ముందే ఆ దేశం కీలక ప్రకటన చేసింది. గత ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్‌పై చేసిన ఆరోపణలను (భారత ఏజెంట్ల జోక్యం, ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య తదితర) కెనడా అనధికారికంగా వెనక్కి తీసుకుంది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత జోక్యం కొనసాగుతోందని భావిస్తే, అసలు ఈ పర్యటనే జరిగేది కాదని కెనడా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. వాణిజ్యం, భద్రత తదితర రంగాల్లో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాని కార్నీ ముంబై, న్యూఢిల్లీలలో పర్యటించనున్నారు.

Advertisement

Mark Carney India visit | భారత్‌, కెనడాల మధ్య గత కొన్నేళ్లుగా నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కెనడా నూతన ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) ప్రతిష్ఠాత్మక భారత పర్యటనకు ముందే ఆ దేశం కీలక ప్రకటన చేసింది. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) హయాంలో భారత్‌పై చేసిన తీవ్ర ఆరోపణల నుంచి మార్క్ కార్నీ ప్రభుత్వం దాదాపుగా వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. భారత ఏజెంట్ల జోక్యం, తమ గడ్డపై జరుగుతున్న దాడుల పట్ల తమకు ఇకపై ఎలాంటి ఆందోళన లేదని కెనడా సీనియర్ అధికారులు స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మార్క్ కార్నీ భారత్‌కు రానున్నారన్నారు.

ట్రూడో ఆరోపణలు.. కార్నీ యూ-టర్న్

2023లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపారేసింది. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది. అయితే, మార్చి 2025లో కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు మారాయి. విదేశాంగ విధానంలో వాస్తవిక విధానాన్ని అవలంబిస్తున్న ఆయన.. భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోవడంపై దృష్టి పెట్టారు.

Also Read : PM Modi | మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ @ 100 మిలియ‌న్స్‌.. ఈ ఘ‌నత‌ సాధించిన తొలి వ‌రల్డ్ లీడ‌ర్‌గా రికార్డ్

"ఈ సమస్యలపై భారత ప్రభుత్వంతో మాకు పరిపక్వమైన, పటిష్టమైన చర్చలు జరుగుతున్నాయి. విదేశీ జోక్యాన్ని నిరోధించడానికి మా వద్ద బలమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి" అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కెనడియన్ అధికారి పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొనసాగుతోందని భావించి ఉంటే.. అసలు తమ ప్రధాని ఈ పర్యటనకే వచ్చేవారు కాదని మరో ఉన్నతాధికారి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో దౌత్యపరమైన చర్చలు బలంగా జరుగుతున్నాయని, విదేశీ కార్యకలాపాలు (జోక్యం) ఇక కొనసాగడం లేదని తాము నమ్ముతున్నామని ఆయన చెప్పారు.

వాణిజ్యమే లక్ష్యంగా కార్నీ పర్యటన

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కెనడాకు అత్యవసరం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించే వాణిజ్య సుంకాల (Tariffs) వల్ల ఏర్పడే అనిశ్చితిని ఎదుర్కోవడానికి, వాణిజ్య భాగస్వామ్యాలను విస్తరించుకోవడం కెనడాకు అనివార్యంగా మారింది. ప్రధాని మార్క్ కార్నీ తన పర్యటనను ముందుగా భారత ఆర్థిక రాజధాని ముంబై నుంచి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత న్యూఢిల్లీ చేరుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో కీలక చర్చలు జరుపుతారు.

Also Read : PM Modi in Israel | 4 వేల మంది భారత సైనికులు ఈ గడ్డపై ప్రాణత్యాగం చేశారు.. జెరూసలేంలో ప్రధాని మోదీ

రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రక్షణ తదితర రంగాల్లో "సరికొత్త, ప్రతిష్ఠాత్మక భాగస్వామ్యాలపై" ఈ చర్చలు ప్రధానంగా సాగనున్నాయని కార్నీ కార్యాలయం తెలిపింది.

ప్రస్తుతం కెనడాకు ఏడో అతిపెద్ద వస్తు, సేవల వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది. ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 21 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి ఈ వాణిద్యాన్ని 50 బిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను పునఃప్రారంభించడానికి ఇరు దేశాలు గత ఏడాది అంగీకరించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో 600కి పైగా కెనడియన్ కంపెనీలు ప్రస్తుతం భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

భద్రత, వాణిజ్యం రెండూ ముఖ్యమే: కెనడా

భారత్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవడాన్ని కెనడాలోని కొన్ని వర్గాలు, ముఖ్యంగా ఖలిస్థాన్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సింధు స్పందిస్తూ.. "ఒకే సమయంలో మనం రెండు పనులు చేయగలం. ఒకవైపు మన కమ్యూనిటీ భద్రతను కాపాడుకుంటూ, న్యాయ అమలు సంస్థల మధ్య చర్చలు జరుపుతూనే.. మరోవైపు ప్రపంచ దేశాలతో ఆర్థికంగా సంబంధాలను కొనసాగించవచ్చు" అని స్పష్టం చేశారు. భద్రత, ఆర్థికాభివృద్ధి అనే రెండు ట్రాక్‌లపై కెనడా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

Advertisement
Advertisement