త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ghoshamahal Police | మాన‌వ‌త్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని ర‌క్షించి అప్ప‌గించారు..

Ghoshamahal Police | | మాన‌సిక దివ్యాంగురాలైన ఓ మ‌హిళ‌ను గోషామ‌హ‌ల్ పోలీసులు ర‌క్షించి సుర‌క్షితంగా కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించి మాన‌వ‌త్వం చాటుకున్నారు. డైల్‌-100 కు స‌మాచారం అందిన కొద్ది గంట‌ల్లోనే బాధితురాలిని కాపాడారు.

S

Hyderabad | Published On May 28, 2026, 1.46 pm IST

Ghoshamahal Police | మాన‌వ‌త్వంతో స్పందించారు.. దివ్యాంగురాలిని ర‌క్షించి అప్ప‌గించారు..
Advertisement
  • ఫిర్యాదు అందిన కొద్ది గంట‌ల్లోనే కేసును ఛేదించిన గోషామ‌హ‌ల్ పోలీసులు
  • అభినంద‌న‌లు తెలిపిన‌ ఉన్న‌తాధికారులు

Ghoshamahal Police | త్రినేత్ర‌.న్యూస్: మాన‌సిక దివ్యాంగురాలైన ఓ మ‌హిళ‌ను గోషామ‌హ‌ల్ పోలీసులు ర‌క్షించి సుర‌క్షితంగా కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించి మాన‌వ‌త్వం చాటుకున్నారు. డైల్‌-100 కు స‌మాచారం అందిన కొద్ది గంట‌ల్లోనే బాధితురాలిని కాపాడారు. దీంతో పోలీసు ఉన్న‌తాధికారులు వారిని అభినందించారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..

గోషామహల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బి.శ్రవణ్ కుమార్ ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. ఈనెల 27న‌ రాత్రి తొమ్మిది గంటల సమయంలో గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కానిస్టేబుళ్లు పి.సి. 9933 జి. శంభు లింగం, పి.సి. 1848 ఠాకూర్ ఆశిష్ సింగ్ నిరంతర గస్తీ (పెట్రోలింగ్) విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో నగర్‌ఖానా ప్రాంతం నుండి డైల్-100 కు ఓ ఫిర్యాదు అందింది. గుర్తుతెలియని, మానసిక వికలాంగురాలైన మహిళ తమ నివాస ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో తిరుగుతోందని స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సిబ్బంది ఆమెను ఆప్యాయంగా విచారించగా తన పేరు పద్మ అని, తనది నాగసానిపల్లి గ్రామం అని చెప్పగలిగింది. ఆమె మాట్లాడే భాష, యాసను బట్టి వనపర్తి జిల్లా పరిధిలోకి రావచ్చని కానిస్టేబుల్ జి. శంభు లింగం ఊహించారు.

వెంట‌నే వనపర్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించి వివరాలు సేకరించారు. వారి ద్వారా శ్రీరంగపురం పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ దాకూరి మరియపు రెడ్డి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గోషామహల్ ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ లింగం కలిసి శ్రీరంగపురం ఏఎస్ఐతో మాట్లాడారు. ఆయన నాగసానిపల్లి గ్రామంలో స్థానికంగా విచారణ జరపగా, సదరు మహిళా ఆ గ్రామానికి చెందినదిగా, గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిందని నిర్ధారణ అయింది. ఐదు రోజుల క్రితం ఎల్.బి. నగర్ ప్రాంతం నుండి తన తల్లి తప్పిపోయిందని, ఆమె కోసం తాము గాలిస్తున్నామని స‌ద‌రు మహిళ కుమారుడు బోరవెల్లి నరేందర్ పోలీసుల‌కు తెలిపారు. అనంత‌రం నరేందర్‌ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా త‌న త‌ల్లిని సురక్షితంగా అప్పగించారు. దీంతో బాధిత కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

సమయస్ఫూర్తితో, పట్టుదలతో వ్యవహరించి ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీస్ కానిస్టేబుళ్లు జి. శంభు లింగం, ఠాకూర్ ఆశిష్ సింగ్, ఏఎస్ఐ శ్రీనివాస్‌లను గోషామహల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) ఇన్‌స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి, వారి వృత్తిపరమైన నిబద్ధతను కొనియాడారు.

 

Advertisement
Advertisement