త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Forensic Lab | ఫోరెన్సిక్ ల్యాబ్‌ సీజ్.. సున్నితమైన డేటా ధ్వంసం!

Forensic Lab | హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని (Nampally) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో (Forensic Lab) భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా కీలకమైన కేసుకు సంబంధించి సున్నితమైన డేటా ధ్వంసమైనట్లు తెలుస్తున్న‌ది.

G

Hyderabad | Published On Feb 8, 2026, 11.24 am IST

Forensic Lab | ఫోరెన్సిక్ ల్యాబ్‌ సీజ్.. సున్నితమైన డేటా ధ్వంసం!
Advertisement

Forensic Lab | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని (Nampally) ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో (Forensic Lab) భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా కీలకమైన కేసుకు సంబంధించి సున్నితమైన డేటా ధ్వంసమైనట్లు తెలుస్తున్న‌ది. ప్రమాదవశాత్తు జరిగిందా కుట్రకోణం దాగి ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం ఉదయం ల్యాబ్‌ను సీజ్‌ చేశారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మ‌రికాసేప‌ట్లో ల్యాబ్‌లో​ ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు.

నేరం ఎలా జరిగింది, ఎవరు చేశారనే విషయాలను సాక్ష్యాధారాలతో నిర్ధారించే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో (FSL) శనివారం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో అగ్నిప్రమాదం సంభవించింది. భ‌వ‌నం మొద‌టి అంత‌స్తులోని కంప్యూట‌ర్ ల్యాబ్‌లో తొలుత మంట‌లు చెల‌రేగి ఆ ఫ్లోర్ అంత‌ట వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంలో 40 కంప్యూట‌ర్ల‌తో పాటు కీల‌క‌మైన డాక్యుమెంట్స్‌, ఇత‌ర వ‌స్తువులు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపు చేశారు.

కాగా, ఇప్ప‌టికీ ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన క్లూస్ టీమ్ ఎస్పీ, ఆదివారం కూడా మ‌రోసారి త‌నిఖీలు చేప‌ట్ట‌నున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఆఫీసులో ఎవరెవ‌రు ఉన్నారు? అనే దానిపై ఎస్పీ ఆరా తీయనున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించనున్నారు.

హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతి..!

రాష్ట్రంలోని ప‌లు కీల‌క కేసుల‌కు సంబంధించిన పేప‌ర్ ఫైల్స్, హార్డ్ డిస్క్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయ‌య‌ని అధికారులు ధృవీక‌రించారు. ప‌లు కేసుల‌కు సంబంధించిన ఫిజిక‌ల్ ఎవిడెన్స్‌తో పాటు డీఎన్ఏ ప‌రీక్ష‌లు, ఫింగ‌ర్ ప్రింట్ విశ్లేష‌ణ‌కు సంబంధించిన వివ‌రాలు కూడా మొద‌టి ఫ్లోర్‌లోనే భ‌ద్ర‌ప‌రిచారు. కీల‌క కేసుల‌కు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక‌ల‌ను కూడా ఇక్క‌డే భ‌ద్ర‌ప‌రిచారు. మొత్తంగా ఆయా కేసుల‌కు సంబంధించిన పేప‌ర్ వ‌ర్క్ పూర్తిగా ద‌గ్ధ‌మైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ఓటుకు నోటు కేసు సాక్ష్యాలు భ‌ద్ర‌మేనా..?

ఓటుకు నోటు కేసులో వీడియో, ఆడియో ఫైల్స్‌తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, అలాగే సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన డాటా, హార్డ్ డిస్కులు ఇక్క‌డే ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే అవి భ‌ద్రంగా ఉన్నాయా..? కాలి బూడిద‌య్యాయా..? అనే దానిపై అధికారుల నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

ఎంతో కీలకం..

వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, ఆయుధాలు, బుల్లెట్లు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా, డీఎన్‌ఏ నమూనాలు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ల విశ్లేషణ సహా ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్‌లో పరిశీలించి నివేదికలు తయారుచేస్తారు. కోర్టు తీర్పుల్లో ఈ ఆధారాలే కీలకంగా ఉంటాయి. ఈ ప్రమాద ప్రభావం కేసుల దర్యాప్తుపై ఎంతమేర పడనుందనేది ఆందోళనకరమైన విషయం.

Advertisement
Advertisement