త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drugs Racket Bust | మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్‌..

P

Hyderabad | Published On May 16, 2026, 6.55 pm IST

Drugs Racket Bust | మెహదీపట్నంలో భారీగా ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది అరెస్ట్‌..
Advertisement

Drugs Racket Bust | హైదరాబాద్ నగరంలో డ్ర‌గ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ రాకెట్ గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్, మెహదీపట్నం పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన పక్కా ఆపరేషన్‌లో ప్రధాన డ్రగ్ పెడ్లర్‌తో పాటు ముగ్గురు సబ్ పెడ్లర్లు, నలుగురు వినియోగ‌దారులు స‌హా ఎనిమిదిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఈ రాకెట్‌లో ప్రధాన నిందితుడిగా ఎం శుభమ్ కుమార్ మిశ్రా గుర్తించారు. అత‌నితో సబ్ పెడ్లర్లుగా సోహమ్ నాయక్ అలియాస్ జిత్తు, కలంగి రాజేశ్‌, ముంతున్ కుమార్ మిశ్రాలను అరెస్టు చేశారు. వినియోగదారులుగా మహ్మద్ అబ్రార్ అల్జమా, రషీద్ బిన్ హుస్సేన్, ఖాజా జోహైబుద్దీన్, అబ్దుల్ షాబాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఆపరేషన్‌లో మొత్తం 137.60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఒక వోల్వో ఎక్స్‌సీ 90 కార్ ( (TS 07 GP 0135), చిన్న ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్, సుత్తి, రబ్బర్ బ్యాండ్లు, ప్యాకింగ్ కవర్లు, ఎన్వలప్‌లు, అలాగే తొమ్మిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ. 26,80,500గా పోలీసులు అంచనా వేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వ‌చ్చాయ‌ని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు శుభమ్ కుమార్ మిశ్రా తన చిన్ననాటి స్నేహితుడైన బుసా సాయి నిఖిల్ యాదవ్ అలియాస్ సాయి ద్వారా ఎండీఎంఏ డ్రగ్స్‌కు పరిచయమయ్యాడు. సాయి ఇటీవల చిలకలగూడ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాక కూడా శుభమ్ ఈ దందాను ఆపకుండా కొన‌సాగించాడ‌న్నారు. అనంతరం తన స్నేహితులు సోహమ్ నాయక్, కలంగి రాజేష్‌లతో కలిసి డ్రగ్స్‌ను చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

డెలివరీ కోసం రాపిడో సేవలను కూడా ఉపయోగించడంతో పాటు, తన సోదరుడు ముంతున్ కుమార్ మిశ్రా ద్వారా కూడా సరఫరా చేయించినట్లు విచారణలో తేలింది. వినియోగదారులు గ్రాము ఎండీఎంఏను రూ. 2వేల నుంచి రూ.3వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ పర్యవేక్షణలో నిర్వ‌హించారు. గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్ వెంకటేశ్‌, మెహదీపట్నం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్ మల్లేశ్‌, సబ్-ఇన్‌స్పెక్టర్లు జీ విజయానంద్, జీవీ నరసింగరావు, సిబ్బంది నిందితుల‌ను చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా డీసీపీ వైభ‌వ్ మాట్లాడుతూ యువ‌త మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస‌లు కాకూడ‌ద‌న్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు.

Advertisement
Advertisement