త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | నిందితుల‌కు ఈ తీర్పు గుణ‌పాఠం : సీపీ వీసీ స‌జ్జ‌నార్‌

CP Sajjanar | సనత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో మూడేళ్ల కింద‌ట సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్‌, హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసిన పోలీసులు, ప్రాసిక్యూష‌న్ బృందాన్ని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ గురువారం స‌న్మానించారు.

P

Hyderabad | Published On May 15, 2026, 3.23 pm IST

CP Sajjanar | నిందితుల‌కు ఈ తీర్పు గుణ‌పాఠం : సీపీ వీసీ స‌జ్జ‌నార్‌
Advertisement

CP Sajjanar | సనత్‌నగర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో మూడేళ్ల కింద‌ట సంచలనం సృష్టించిన బాలుడి కిడ్నాప్‌, హత్య కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసిన పోలీసులు, ప్రాసిక్యూష‌న్ బృందాన్ని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ గురువారం స‌న్మానించారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ జీవీ రామకృష్ణారావు, దర్యాప్తు అధికారి ఎం ముత్తు యాదవ్, సనత్‌నగర్ ఎస్‌హెచ్‌వో అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎన్ శేఖర్‌లను సీపీ అభినందించి సత్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా-3 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు ఇటీవల చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన రెండో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇమ్రాన్ అలీ ఖాన్ అలియాస్ ఫిజా 2023 ఏప్రిల్ 20న అబ్దుల్ వాహిద్ ఖాన్ అనే ఎనిమిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాడు. బాలుడి తండ్రి వసీం ఖాన్ తనకు ఇచ్చిన రూ.లక్ష అప్పు తిరిగి చెల్లించలేదనే ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు తన నివాసంలోనే బాలుడిని గొంతు నులిమి హత్య చేసి, అనంతరం మహమ్మద్ రఫీక్ సాయంతో మృతదేహాన్ని బకెట్‌లో పెట్టి సమీపంలోని నాలాలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడు కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించి కేసును ఛేదించారు.

ఈ కేసులో సమర్పించిన సాక్ష్యాధారాల ఆధారంగా కోర్టు ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ అలియాస్ ఫిజాకు ఉరిశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. కిడ్నాప్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష, సాక్ష్యాధారాల ధ్వంసం కేసులో మరో ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రెండో నిందితుడు మహమ్మద్ రఫీక్‌కు సాక్ష్యాధారాల ధ్వంసం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. సమాజం తలదించుకునేలా బాలుడిని దారుణంగా హత్య చేసిన నిందితులకు ఈ తీర్పు గుణపాఠంగా నిలుస్తుందన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ ఈ కేసులో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. డీసీపీ క్రైమ్స్ ఎస్ చైతన్యకుమార్, ఓఎస్డీ మల్లారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక కేసుల దర్యాప్తు సమీక్ష కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో పనిచేయడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని సీపీ వివ‌రించారు.

Advertisement
Advertisement