త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | ఉనికిలోకి మూడు కార్పొరేష‌న్లు.. నేటి నుంచి స్వీయ పాల‌న‌

GHMC | జీహెచ్ఎంసీ (GHMC) విభ‌జ‌న ప‌రిపూర్ణ‌మైంది. కొత్త‌గా ఏర్ప‌డిన రెండు కార్పొరేష‌న్లు అధికారికంగా ఉనికిలోకి వ‌చ్చాయి. సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (CMC), మల్కాజిగిరి నగరపాలక సంస్థ (MMC)ల్లో బుధ‌వారం నుంచి నుంచి స్వీయపాలన పూర్తిస్థాయిలో అమలులోకి వ‌చ్చింది.

G

Hyderabad | Published On Apr 1, 2026, 7.55 am IST

GHMC | ఉనికిలోకి మూడు కార్పొరేష‌న్లు.. నేటి నుంచి స్వీయ పాల‌న‌
Advertisement

GHMC | త్రినేత్ర‌.న్యూస్‌: జీహెచ్ఎంసీ (GHMC) విభ‌జ‌న ప‌రిపూర్ణ‌మైంది. కొత్త‌గా ఏర్ప‌డిన రెండు కార్పొరేష‌న్లు అధికారికంగా ఉనికిలోకి వ‌చ్చాయి. సైబరాబాద్‌ నగరపాలక సంస్థ (CMC), మల్కాజిగిరి నగరపాలక సంస్థ (MMC)ల్లో బుధ‌వారం నుంచి నుంచి స్వీయపాలన పూర్తిస్థాయిలో అమలులోకి వ‌చ్చింది. ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీని విభ‌జించిన రాష్ట్ర ప్రభుత్వం.. సైబ‌రాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అదే రోజున కమిషనర్లను సైతం నియమించినప్పటికీ మార్చి 31 వ‌ర‌కు వాటి పరిధిలో చేపట్టాల్సిన ప్రతి ఖర్చుకు ఆయా కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీ ఆమోదం తీసుకుంటూ వచ్చాయి. సొంత ఆదాయం లేకపోవడంతో ఇన్నాళ్లు బ్యాంకు ఖాతా కూడా తెరవలేదు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల‌ ప్రకారం ఏప్రిల్‌ 1 నుంచి రెండు కార్పొరేషన్లు సొంతంగా ఆదాయ, వ్యయాలను నిర్వహించుకోనున్నాయి.

ఈ నేప‌థ్యంలో జీహెచ్‌ఎంసీ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ట్యాంక్‌బండ్‌ బ్రాంచిలోనే సీఎంసీ, ఎంఎంసీ ఖాతాలు తెరిచాయి. దీంతో బ్యాంకు అధికారులు మూడు కార్పొరేషన్లకు వేర్వేరు ‘ఈ-పేమెంట్స్‌’ వ్యవస్థలను కూడా సిద్ధం చేశారు. ఇక బుధ‌వారం నుంచి ప్రజలు చెల్లించే పన్నులు, రుసుములు.. ఆయా కార్పొరేషన్ల ఖాతాకు చేర‌నున్నాయి.

దీంతో సైబ‌రాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కట్టే భవన నిర్మాణాలకు సంబంధించిన చెల్లింపులను ‘కమిషనర్, సీఎంసీ’ పేరుతో, మల్కాజిగిరి పరిధిలో ‘కమిషనర్, ఎంఎంసీ’ పేరుతో చెల్లించాల్సి ఉంటుంది.

జీహెచ్ఎంసీ విభ‌జ‌న ఇలా..

జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి గడువు మంగళవారం (ఫిబ్రవరి 10)తో ముగిసింది. దీంతో జీహెచ్ఎంసీ విభజనకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్ ప‌రిధిలో ఉన్న‌ 7 కార్పొరేషన్లు, 20 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. దీంతో మొత్తం 300 డివిజన్లుగా విభజించింది. ఆ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను.. జీహెచ్ఎంసీ, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)గా విభజించింది. జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్‌-3(1) ప్రకారం జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీని ఏర్పాటు చేసింది.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్‌లు ఉంటాయి. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్ జోన్‌‌లు ఉంటాయి. పునర్నిర్మించబడిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో ఇప్పుడు శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్‌లు ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement