త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake Chocolate factory Hyderabad | ఎక్స్‌పైరీ అయిన రసాయనాలతో చాక్లెట్ల తయారీ.. సీతారాంబాగ్‌లో ఫ్యాక్టరీ సీజ్!

హైదరాబాద్‌లోని సీతారాంబాగ్‌లో గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న భారీ ముఠాను హెచ్-ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రట్టు చేశారు.

J

Hyderabad | Published On Jun 4, 2026, 9.00 pm IST

Fake Chocolate factory Hyderabad | ఎక్స్‌పైరీ అయిన రసాయనాలతో చాక్లెట్ల తయారీ.. సీతారాంబాగ్‌లో ఫ్యాక్టరీ సీజ్!
Advertisement
  • హైదరాబాద్ ఓల్డ్ మల్లేపల్లి (సీతారాంబాగ్)లో నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపు దాడి
  • గడువు ముగిసిన (Expired) రసాయనాలు, ఫ్లేవర్లతో పిల్లలు తినే చాక్లెట్ల తయారీ చేస్తున్నట్లు గుర్తింపు
  • భారీగా చాక్లెట్లు, ప్యానింగ్ యంత్రాలు, ఎక్స్‌పైరీ అయిన ఎస్సెన్స్‌లను సీజ్ చేసిన అధికారులు
  • నిర్వాహకుడు కొండ కార్తీక్‌ అరెస్ట్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హబీబ్‌నగర్ పోలీసులు

Fake Chocolate factory Hyderabad | త్రినేత్ర.న్యూస్ : పిల్లలు ఇష్టంగా అడుగుతున్నారని చాక్లెట్లను కొనిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ వార్త చదవాల్సిందే. కాసుల కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు ప్రజలు, పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గడువు తీరిపోయిన (Expired) రసాయనాలు, ఫ్లేవర్లు వాడుతూ నకిలీ చాక్లెట్లు తయారు చేస్తున్న ఒక భారీ ముఠాను హైదరాబాద్ సిటీ పోలీస్ స్పెషల్ వింగ్ 'హెచ్-ఫాస్ట్' (H-FAST), ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా రట్టు చేశారు.

Fake Chocolate Factory Busted in Hyderabad Expired Products Seized

అసలేం జరిగిందంటే

పక్కా సమాచారంతో ఓల్డ్ మల్లేపల్లి, సీతారాంబాగ్‌లోని "విగ్నేట్ ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్" అనే తయారీ కేంద్రంపై హెచ్-ఫాస్ట్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) సమీనా బేగం, హబీబ్‌నగర్ పోలీసులు కలిసి మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో ఫ్యాక్టరీ నిర్వాహకుడు కొండ కార్తీక్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎలాంటి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా, కేవలం లాభార్జనే ధ్యేయంగా ఈ ఫేక్ దందా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Fake Chocolate Factory Busted in Hyderabad Expired Products Seized

ప్యాకెట్లపై కనీస వివరాలు నిల్

అక్కడ తయారవుతున్న చాక్లెట్ ప్యాకెట్ల మీద కనీసం మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ (Manufacturing Date), బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ డేట్ (Expiry Date) లాంటి వివరాలు ఏవీ లేకపోవడాన్ని అధికారులు గమనించారు. లోపల మరింత లోతుగా తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

చాక్లెట్ల తయారీలో గడువు ముగిసిన ఫ్లేవర్లు, ఎస్సెన్స్‌లు, కృత్రిమ రంగు పొడులు వాడుతున్నట్లు తేలింది. వీరికి కొత్త ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ ఉన్నప్పటికీ, పాత లైసెన్స్ నంబర్‌తోనే మార్కెట్లోకి ప్రొడక్ట్స్ పంపుతూ మోసానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా, అక్కడ పనిచేసే వర్కర్లకు కనీసం మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవు, కనీస పెస్ట్ కంట్రోల్ (Pest control) రికార్డులు కూడా నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.

భారీగా నిల్వలు సీజ్

ఈ దాడుల్లో అధికారులు భారీగా నకిలీ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

  • సుమారు 200 కిలోల క్యారమెల్ చాక్లెట్, 20 కిలోల చోకో బాల్స్.
  • చాక్లెట్ స్టిక్స్, మార్ష్‌మెలో, జుజుబి, క్రాన్‌బెర్రీ, పాన్, జీడిపప్పు చాక్లెట్లు.
  • చాక్లెట్ల తయారీకి వాడే 4 ప్యానింగ్ (Panning) మెషీన్లు, 2 మెల్టింగ్ మెషీన్లు.
  • బబుల్ గమ్, కార్న్ సిరప్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, వెనిలా, పెప్పర్‌మింట్ లాంటి అనేక రకాల ఎక్స్‌పైరీ అయిపోయిన ఫ్లేవర్లు, రసాయనాల బాటిళ్లను జప్తు చేశారు.

నిందితుడిని, సీజ్ చేసిన సరుకును అదుపులోకి తీసుకున్న హెచ్-ఫాస్ట్ బృందం.. తదుపరి విచారణ కోసం హబీబ్‌నగర్ పోలీసులకు అప్పగించింది. ఈ మేరకు నిందితుడిపై క్రైమ్ నంబర్ 145/2026, సెక్షన్ 318(4), 275 BNS చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. డీసీపీ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌ పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బయట దొరికే బ్రాండ్ లేని చాక్లెట్ల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement
Advertisement