త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఒక్క ఇల్లు కూల్చ‌కుండా.. రూ. 16 వేల కోట్ల‌తోనే మూసీ సుంద‌రీక‌ర‌ణ చేసి చూపిస్తాం : కేటీఆర్

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ బ్యూటిఫికేష‌న్ పేరిట లూటీఫికేష‌న్ చేస్తున్నార‌ని రేవంత్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రూ. 1.50 ల‌క్ష‌ల కోట్ల‌తో మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేస్తామ‌ని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ రూ. 16 వేల కోట్ల‌తోనే ఆ ప‌నులు చేయొచ్చు అని కేటీఆర్ తెలిపారు.

S

Hyderabad | Published On Mar 5, 2026, 4.18 pm IST

KTR | ఒక్క ఇల్లు కూల్చ‌కుండా.. రూ. 16 వేల కోట్ల‌తోనే మూసీ సుంద‌రీక‌ర‌ణ చేసి చూపిస్తాం : కేటీఆర్
Advertisement

ఒక్క ఇల్లు చెద‌ర‌గొట్ట‌కుండా రూ. 6 కోట్ల‌తో సుంద‌రీక‌ర‌ణ చేశాం
రూ. 16 వేల కోట్ల‌తో పోయేదానికి రూ. ల‌క్షా 50 వేల కోట్లు ఎందుకు..?
లూటిఫికేష‌న్ చేస్తామంటే త‌ప్ప‌కుండా అడ్డుకుంటాం..
సీఎం రేవంత్‌ను త‌రిమికొట్టే రోజులు ద‌గ్గ‌ర్లోనే..

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ బ్యూటిఫికేష‌న్ పేరిట లూటీఫికేష‌న్ చేస్తున్నార‌ని రేవంత్ స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రూ. 1.50 ల‌క్ష‌ల కోట్ల‌తో మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేస్తామ‌ని సీఎం రేవంత్ చెబుతున్నారు. కానీ రూ. 16 వేల కోట్ల‌తోనే ఆ ప‌నులు చేయొచ్చు. మూసీ సుందరీకరణ పనుల బాధ్యత మాకు అప్పగిస్తే రూ.16వేల కోట్లకే చేసి చూపిస్తాం. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్‌లోని నాగోల్ ఎస్టీపీని ప‌రిశీలించిన అనంత‌రం స్థానికంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

గ‌తంలో మూసీ తీరాన ఐదున్న‌ర కిలోమీట‌ర్ల పొడ‌వునా ఒక్క ఇల్లు చెద‌ర‌గొట్ట‌కుండా రూ. ఆరు కోట్ల‌తో సుంద‌రీక‌ర‌ణ చేప‌ట్టాం. ఫుట్‌పాత్‌లు, ఓపెన్ జిమ్‌లు, క్రీడా ప్రాంగ‌ణాలు, ల్యాండ్ స్కేపింగ్ చేశాం. భార‌త‌దేశంలోనే అతి పెద్ద‌దైనా ఎస్టీపీని నాగోల్‌లో ఏర్పాటు చేశాం. మూసీని జీవ‌న‌దిగా మార్చాల‌నే సంక‌ల్పంతో 32 ఎస్టీపీలు, 15 బ్రిడ్జిలు మంజూరు చేశాం. రూ. 4 వేల కోట్ల‌తో చేప‌ట్టిన 32 ఎస్టీపీలు 2023 డిసెంబ‌ర్ వ‌ర‌కు 85 శాతం పూర్త‌య్యాయి. అయితే మూసీని శుద్ధి చేసేందుకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో హైకోర్టు వ‌ద్ద కాఫ‌ర్ డ్యాం క‌ట్టార‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

గ్రావిటీ ద్వారా గండిపేట‌కు నీళ్లు

ఇక మూసీని జీవ‌న‌దిగా మార్చాల‌ని చెప్పి.. గోదావ‌రి నీళ్ల‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు ద్వారా మూసీకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించాం. కొండ‌పోచమ్మ సాగ‌ర్ నుంచి గ్రావిటీ ద్వారా గండిపేట‌కు నీళ్లు తీసుకొచ్చి మూసీలోకి వ‌ద‌లాల‌ని నిర్ణ‌యించాం. కేవ‌లం రూ. 1100 కోట్ల‌తో గోదావ‌రి నీళ్ల‌ను గండిపేట చెరువులో పోసేందుకు ప్ర‌ణాళిక‌ల‌కు ఆమోదం తెలిపాం. 15 బ్రిడ్జిల‌ను రూ. 540 కోట్ల‌తో మంజూరు చేశాం. శంకుస్థాప‌న చేశామ‌ని కేటీఆర్ తెలిపారు.

ఒక్క ఇల్లు కూల‌గొట్ట‌కుండా.. రూ. 6 కోట్ల‌తో సుంద‌రీక‌ర‌ణ

మొత్తానికి క‌ట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా ఒక వ‌డ్డించిన విస్త‌రిలాగా బంగారు ప‌ల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డికి అప్ప‌జెప్పాం. ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధ‌మైన నీరు వ‌స్తది. న‌ల్ల‌గొండ రైతుల‌కు న్యాయం చేయాల‌నే సంక‌ల్పంతో కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మం చేశారు. ఒక్క ఇల్లు కూల‌గొట్ట‌కుండా.. నాగోల్‌లో ప్ర‌యోగ‌త్మ‌కంగా ఐదు కిలోమీట‌ర్ల మేర రూ. 6 కోట్ల‌తో సుంద‌రీక‌ర‌ణ చేశాం. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మూసీ తీరంలో ప‌దెక‌రాల స్థ‌లంలో రూ. 30 కోట్ల‌తో శిల్పారామం ఏర్పాటు చేశామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇంత అల‌క‌గా చేస్తే ఆయ‌న రేవంత్ రెడ్డి ఎందుకు అయిత‌డు

ఒక్క ఇల్లు కూల‌గొట్ట‌కుండా, ఒక్క ఇటుక ముట్ట‌కుండా, ఒక్క పేద‌వాడి క‌డుపు కొట్ట‌కుండా మూసీ సుంద‌రీక‌ర‌ణ‌ కేసీఆర్ ప్ర‌భుత్వం చేసి చూపించింది. రేవంత్ ప్ర‌భుత్వం చేయాల్సింది ఏంటంటే.. రూ. 1100 కోట్ల‌తో గండిపేట‌కు నీళ్లు తీసుకురావాలి. 15 బ్రిడ్జిల‌ను పూర్తి చేయాలి. బ్ర‌హ్మాండంగా రిబ్బ‌న్లు క‌ట్ చేసుకోని చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌చ్చు. కానీ ఆయ‌న ఉద్దేశం వేరే ఉన్న‌ది. ఇంత అల‌క‌గా చేస్తే ఆయ‌న రేవంత్ రెడ్డి ఎందుకు అయిత‌డు. రూ. ల‌క్షా 50 వేల కోట్ల‌తో మూసీ సుంద‌రీక‌ర‌ణ చేస్తామ‌ని చెప్పాడు. మంచిరేవుల నుంచి ఘ‌ట్‌కేస‌ర్ వ‌ర‌కు 55 కిలోమీట‌ర్ల పొడ‌వునా ఎక్స్‌ప్రెస్‌వే క‌డితే రూ. 10 వేల కోట్ల ఖ‌ర్చు అయిత‌ది. రూ. 4 వేల కోట్ల‌తో ఎస్టీపీలు, రూ. 2 వేల కోట్ల‌తో సుంద‌రీక‌ర‌ణ చేస్తే రూ. 16 వేల కోట్ల‌తో అయిపోత‌ది. రూ. 16 వేల కోట్ల‌తో పోయేదాన్ని రూ. ల‌క్షా 50 వేల కోట్లు అని రేవంత్ రెడ్డి బ‌హిరంగంగా చెప్పారు. డీపీఆర్ ఉందా..? అంటే లేదు.. ఒక ప్రణాళిక లేదు. మూసీ తీరాన ఉన్న ఇండ్ల‌కు రెడ్ మార్కులు వేసి.. అధికారులు అన‌ధికారికంగా వ‌చ్చి బెదిరింపుల‌కు గురి చేశారని కేటీఆర్ మండిప‌డ్డారు.

భ‌యంతో ల‌క్షా యాభై వేల కుటుంబాలు 

యూపీలో బుల్డోజ‌ర్ రాజ్యం న‌డుస్త‌ది అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటారు. మ‌రి మీరు తెలంగాణ‌లో చేస్తున్న‌ది ఏంది..? ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల‌లో శత్రు దేశం మీద యుద్ధానికి పోయిన‌ట్టు రెండున్న‌ర వేల పోలీసుల‌తో వెళ్లి 1000 మంది ఇండ్లు కూల్చేస్తే దాన్ని ఏమ‌నాలి..? అది బుల్డోజ‌ర్ రాజ్యం కాదా..? మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో దివ్యాంగుల‌కు చెందిన‌ 150 మంది ఇండ్లు క‌ట్టుకుంటే.. నీ బుల్డోజ‌ర్లు పోయి నేల‌మ‌ట్టం చేశాయి. హైడ్రా పేరు మీద హైద‌రాబాద్‌లో చేస్తున్న అరాచ‌కాల‌కు అంతే లేదు. ప‌ర్మిష‌న్లు ఇచ్చింది మీరే. రిజిస్ట్రేష‌న్లు చేసింది మీరే.. ట్యాక్స్‌లు క‌ట్టించుకుంటున్న‌ది మీరే.. మ‌రి అక్ర‌మం ఎలా అయిత‌ది.. స‌క్ర‌మ‌మే క‌దా అంటే బెదిరిస్తున్నారు. పేద‌ల త‌ర‌పున రేవంత్ రెడ్డిని ఒక్క‌టే అడుగుతున్నా.. చిత్త‌శుద్ధి ఉంటే స‌మాధానం చెప్పు. కొడంగ‌ల్ కోస్గిలో క‌ట్టిన సీఎం ఇల్లు రెడ్డి కుంట చెరువులో ఉంది. సీఎం సోద‌రుడు తిరుప‌తి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉంట‌ది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్, కేవీపీ ఇల్లు బ‌ఫ‌ర్ జోన్‌లో ఉంటుంది. ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి ఇల్లు చెరువు మ‌ధ్య‌లో ఉంట‌ది. కానీ వారి ఇండ్ల‌ను ముట్టుకోరు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు పేద‌ల ఇండ్లు కూల‌గొడుతామంటే.. పేద ప్ర‌జ‌లు రాహుల్‌ను, సీఎంను వ‌దిలిపెట్ట‌రు. కుర్చీని మ‌డ‌త‌పెట్టి త‌రిమి కొట్టే రోజులు ద‌గ్గ‌ర్లో ఉన్నాయి. హైద‌రాబాద్‌లో ల‌క్షా యాభై వేల కుటుంబాలు భ‌యంతో బ‌తుకుతున్నాయి.. బుల్డోజ‌ర్లు ఎప్పుడు వ‌స్తాయో అని ఆందోళ‌న చెందుతున్నారు. ఇది బ్యూటిఫికేష‌న్ కాదు లూటిఫికేష‌న్. ల‌క్షా యాభై వేల కోట్లలో వేల కోట్లు దండుకుని మీ కుర్చీని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Advertisement
Advertisement