త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pahadishareef Dargah | రేప‌ట్నుంచి ప‌హ‌డీష‌రీఫ్ ద‌ర్గా ఉర్సు.. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా ఉత్స‌వాలు..

Pahadishareef Dargah | తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మకమైన పహాడీషరీఫ్‌ దర్గా( Pahadishareef Dargah )760వ ఉర్సు ఉత్సవాలు ఫిబ్ర‌వ‌రి 8 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. హజరత్‌ బాబా షర్ఫుద్దీన్‌( Hazrath Baba Sharfuddin ) దర్గా ఉర్సు ఉత్స‌వాల‌కు రాష్ట్రం నలుమూలల నుంచి కుల‌మ‌తాల‌కు అతీతంగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు.

S

Hyderabad | Published On Feb 7, 2026, 7.11 am IST

Pahadishareef Dargah | రేప‌ట్నుంచి ప‌హ‌డీష‌రీఫ్ ద‌ర్గా ఉర్సు.. మ‌త సామ‌ర‌స్యానికి ప్ర‌తీక‌గా ఉత్స‌వాలు..
Advertisement

Pahadishareef Dargah | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మకమైన పహాడీషరీఫ్‌ దర్గా( Pahadishareef Dargah )760వ ఉర్సు ఉత్సవాలు ఫిబ్ర‌వ‌రి 8 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. హజరత్‌ బాబా షర్ఫుద్దీన్‌( Hazrath Baba Sharfuddin ) దర్గా ఉర్సు ఉత్స‌వాల‌కు రాష్ట్రం నలుమూలల నుంచి కుల‌మ‌తాల‌కు అతీతంగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు. దర్గాలోని బాబా షర్పొద్దీన్‌ మందిరంలో పూలు, చాదరే-గులాపే సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఉర్సు ఉత్స‌వాలు ఐదు రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. ప‌హ‌డీష‌రీఫ్ ద‌ర్గా ఉర్సు ఉత్స‌వాల్లో భాగంగా.. నిజాం ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో గంధం ఊరేగింపు, దీపాల అలంక‌ర‌ణ‌, ఖురాన్ ప‌ఠ‌నం, స‌ర్కారీ గంధం వంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

పహాడీషరీఫ్‌ కొండపై ఉన్న హజరత్‌ బాబా షర్ఫుద్దీన్‌ దర్గాను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనేది ఆయా మ‌తాల‌కు చెందిన భ‌క్తుల విశ్వాసం. ఈ క్ర‌మంలో ఒక్క తెలంగాణ నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తుంటారు. ఈ క్ర‌మంలో ఈ నాలుగైదు రోజులు ప‌హ‌డీష‌రీఫ్ ప్రాంతం సంద‌డిగా మార‌నుంది.

ప‌హ‌డీష‌రీఫ్ ద‌ర్గా నేప‌థ్యం ఇదే..

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో శ్రీశైలం వెళ్లే రోడ్డులో ఓ గుట్ట‌పై ప‌హ‌డీష‌రీఫ్ ద‌ర్గా ఉంది. ఇది ఒక ప‌విత్ర సూఫీ పుణ్య‌క్షేత్రం. హజరత్‌ బాబా షర్ఫుద్దీన్ 1174 - 1190 మ‌ధ్య ఇరాక్‌లో జ‌న్మించారు. ఆ త‌ర్వాత ఢిల్లీ మీదుగా ప్ర‌యాణించి 1229 - 1240 మ‌ధ్య కాలంలో మ‌ధ్య భార‌త‌దేశానికి వ‌చ్చి, ద‌క్క‌న్ ప్రాంతంలోని ఈ గుట్టపై ఆయ‌న స్థిర నివాసం ఏర్ప‌రుచుకున్నారు. హజరత్‌ బాబా షర్ఫుద్దీన్ మ‌త సామ‌ర‌స్యాన్ని ప్రోత్స‌హిస్తూ.. హిందువు, ముస్లిం అనే తేడా లేకుండా అంద‌రికీ స‌హాయం చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన ద‌ర్గాలోకి అంద‌ర్నీ ఆహ్వానించారు. నిత్యం ప్రార్థ‌న‌లు చేస్తూ.. ఒక ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణాన్ని ఆయ‌న భ‌క్తుల్లో పెంపొందించారు. మూలికా వైద్యం కూడా రోగుల‌కు అందించేవారు.

హజరత్‌ బాబా షర్ఫుద్దీన్ 1288 కాలంలో మ‌ర‌ణించారు. అనంత‌రం ఆయ‌న స‌మాధిని అభివృద్ధి చేశారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు ఈ స‌మాధి నిర్మాణాన్ని ప్రారంభించ‌గా, ఆరో నిజాం మీర్ మ‌హ‌బూబ్ అలీఖాన్ పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌.. ద‌ర్గా ఉన్న గుట్ట‌పైకి 365 మెట్ల‌ను ఏర్పాటు చేయించారు.

ఈ ద‌ర్గాకు ఎలా చేరుకోవాలి..?

హైద‌రాబాద్ న‌గ‌రం నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో ఈ ద‌ర్గా కొలువైంది. పహాడీషరీఫ్‌ బాబా షర్పొద్దీన్‌ దర్గా చార్మినార్‌కు 11 కిలో మీటర్ల దూరంలో, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. చార్మినార్‌, అఫ్జ‌ల్‌గంజ్, సైదాబాద్, చాంద్రాయ‌ణ‌గుట్ట నుంచి ఆర్టీసీ బ‌స్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.

Advertisement
Advertisement