త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | ప‌ర్సెంటేజీ వివాదానికి శుభం కార్డు – పెద్దికి లైన్ క్లియ‌ర్ – దిల్‌రాజు కామెంట్స్‌

టాలీవుడ్‌లోను కుదిపేస్తోన్న ప‌ర్సెంటేజీ వివాదానికి ముగింపు ప‌డిన‌ట్లు దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి సోమ‌వారం నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్ల మ‌ధ్య ఫిలిం ఛాంబ‌ర్‌లో అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌రిగింది. ఎగ్జిబిట‌ర్ల డిమాండ్ మేర‌కు సింగిల్ స్క్రీన్స్‌లో ప‌ర్సెంటేజీ సిస్ట‌మ్ అమ‌లు చేయ‌డానికి నిర్మాత‌లు అంగీక‌రించార‌ని దిల్‌రాజు చెప్పారు.

N

Entertainment | Published On May 15, 2026, 3.49 pm IST

Tollywood | ప‌ర్సెంటేజీ వివాదానికి శుభం కార్డు – పెద్దికి లైన్ క్లియ‌ర్ – దిల్‌రాజు కామెంట్స్‌
Advertisement

Tollywood |గ‌త కొద్ది రోజులుగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న ప‌ర్సెంటేజీ వివాదానికి శుభంకార్డు ప‌డింది. సింగిల్ స్క్రీన్స్‌లో ప‌ర్సెంటేజీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లోని ఎగ్జిబిట‌ర్లు డిమాండ్ చేస్తోన్నారు. ఎగ్జిబిట‌ర్ల డిమాండ్స్‌ను నిర్మాత‌లు తిర‌స్క‌రించారు. రెంట‌ల్ విధానంలోనే సింగిల్ స్క్రీన్స్‌లో త‌మ సినిమాల‌ను విడుద‌ల చేస్తామ‌ని, ప‌ర్సెంటేజీ షేరింగ్‌కు అంగీక‌రించేది లేద‌ని తేల్చిచెప్పారు. చిన్న‌గా మొద‌లైన ఈ వివాదం కాస్త ముదిరి టాలీవుడ్‌లో వ‌ర్గ‌పోరుకు దారితీసింది. ఎగ్జిబిట‌ర్లు, నిర్మాత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల దాడికి దిగారు.

దిల్ రాజుపై విమ‌ర్శ‌లు...

ర‌విశంక‌ర్‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీతో పాటు మ‌రికొంద‌రు నిర్మాత‌లు దిల్‌రాజుపై ఘాటుగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. రామ్‌చ‌ర‌ణ్ పెద్ది రిలీజ్‌ను టార్గెట్ చేసుకొని ఎగ్జిబిట‌ర్లు ఇబ్బందుల‌ను సృష్టిస్తున్నార‌ని కామెంట్లు చేశారు. నిర్మాత‌ల వ్యాఖ్య‌ల‌పై ఎగ్జిబిట‌ర్లు కూడా ధీటుగానే రియాక్ట్ అయ్యారు. సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ రేట్ల‌ను పెంచేది లేద‌ని, పర్సెంటేజీ విధానానికి అంగీక‌రించ‌ని నిర్మాత‌ల సినిమాల‌ను త‌మ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌మ‌ని అన్నారు. ఈ వివాదం ముద‌ర‌డంతో పెద్దితో పాటు జూన్‌లో రిలీజ్ కానున్న అన్ని సినిమాల‌పై ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

సురేష్ బాబు అధ్య‌క్ష‌త‌న‌...

ప‌ర్సెంటేజీ సిస్ట‌మ్ అమ‌లుకు సంబంధించి శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ఫిలిం ఛాంబ‌ర్‌లో అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో టాలీవుడ్ నిర్మాత‌ల‌తో పాటు ఎగ్జిబిట‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు పాల్గొన్నారు. ఫిలిం ఛాంబ‌ర్ ప్రెసిడెంట్ సురేష్ బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో ప‌ర్సెంటేజీ విధానం అమ‌లుపై వాడివేడిగానే చ‌ర్చ జ‌రిగింద‌ట‌. ఛాంబ‌ర్ మీటింగ్‌లో కూడా ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌ల దాడికి దిగిన‌ట్లు స‌మాచారం. ఒకానొక ద‌శ‌లో కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింద‌ట‌. చివ‌ర‌కు సురేష్‌బాబుతో పాటు అల్లు అర‌వింద్ క‌లుగ‌జేసుకొని నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్ల మ‌ధ్య స‌యోధ్య కుదిర్చిన‌ట్లు స‌మాచారం. చివ‌ర‌కు ఓ మెట్టు దిగిన నిర్మాత‌లు ప‌ర్సెంటేజీ విధానాన్ని అమ‌లు చేయ‌డానికి అంగీక‌రించార‌ట‌. ఈ విష‌యాన్ని తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మ‌న్, నిర్మాత దిల్‌రాజు వెల్ల‌డించారు.  సింగిల్ స్క్రీన్స్‌లో ప‌ర్సెంటేజీ సిస్ట‌మ్ అమ‌లుపై ఓ క‌మిటీ వేయ‌బోతున్న‌ట్లు దిల్‌రాజు వెల్ల‌డించారు. "ఏ, బీ, సీ అనే సెంట‌ర్ల వారిగా ఎంతెంత రెవెన్యూ షేర్ చేయాల‌న్న‌ది క‌మిటీ నిర్ణ‌యించ‌బోతుంది. క‌మిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు సాగ‌బోతున్నాం, మీటింగ్ చాలా సానుకూలంగా జ‌రిగింది" అని దిల్ రాజు అన్నారు.

నో డౌట్స్‌...

పెద్ది సినిమా రిలీజ్‌పై కూడా దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. "తెలంగాణ‌లో ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేకుండా రిలీజ్ కాబోతుంది. ఆ విష‌యంలో ఎవ‌రూ ఎలాంటి డౌట్స్ పెట్టుకోవ‌ద్దు" అని దిల్ రాజు  చెప్పారు.ప‌ర్సెంటేజీ సిస్ట‌మ్‌పై ఛాంబ‌ర్ ఏర్పాటుచేసిన క‌మిటీలో మొత్తం ప‌దిహేను మంది స‌భ్యులు ఉండ‌బోతున్నారు. ఐదుగురు నిర్మాత‌లు, ఐదుగురు డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో పాటు మ‌రో ఐదుగురు ఎగ్జిబిట‌ర్ల‌తో ఈ క‌మిటీని ఏర్పాటుచేసిన‌ట్లు స‌మాచారం.

 

Advertisement
Advertisement