త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Single Screen Theaters | రెంట‌ల్ నుంచి ప‌ర్సంటేజ్‌ విధానంలోకి … రేప‌టి నుంచి తెలంగాణ‌ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో కొత్త రూల్‌

తెలంగాణ‌లోని సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో ఏప్రిల్ 3 నుంచి కొత్త రూల్ అమ‌లులోకి రానుంది. ఇన్నాళ్లు రెంట‌ల్ సిస్ట‌మ్‌తో న‌డిచిన ఈ థియేట‌ర్ల‌లో ఇక నుంచి ప‌ర్సంటేజ్ విధానంలో సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. తెలంగాణ‌లోని 23 థియేట‌ర్ల‌లో ప‌ర్సెంటేజ్ సిస్ట‌మ్ అమ‌లులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌క‌టించింది.

N

Entertainment | Published On Apr 2, 2026, 4.16 pm IST

Single Screen Theaters | రెంట‌ల్  నుంచి ప‌ర్సంటేజ్‌ విధానంలోకి … రేప‌టి నుంచి తెలంగాణ‌ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో కొత్త రూల్‌
Advertisement

Single Screen Theaters | ఏప్రిల్ 3 నుంచి తెలంగాణ‌లోని ప‌లు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్స్‌లో కొత్త రూల్ అమ‌లులోకి రానుంది. ఇన్నాళ్లు రెంట‌ల్ సిస్ట‌మ్‌తో ఈ థియేట‌ర్ల‌లో సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించారు. ఏప్రిల్ 3 నుంచి ప‌ర్సంటేజ్‌ విధానంలో ఈ థియేట‌ర్ల‌లో స్క్రీనింగ్ ఉండ‌బోతున్న‌ట్లు తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌క‌టించింది. నైజాం ఏరియాలోని 23 థియేట‌ర్ల‌లో ఈ ప‌ర్సెంటేజ్ విధానం అమ‌లు చేయ‌బోతున్నారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్‌...ఆ థియేట‌ర్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. భ‌విష్య‌త్తులో మిగిలిన సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లోనూ ఈ రూల్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు.

ప‌ర్సంటేజ్ విధానంలో...

ప‌ర్సంటేజ్‌ విధానంలో మొద‌టి వారంలో అర‌వై శాతం నిర్మాత‌ల‌కు, న‌ల‌భై శాతం థియేట‌ర్ ఓన‌ర్ల‌కు రెవెన్యూ ల‌భించ‌నుంది. రెండో వారంలో చెరో యాభై శాతం...మూడో వారంలో నిర్మాత‌ల‌కు న‌ల‌భై శాతం... థియేట‌ర్ ఓన‌ర్ల‌కు అర‌వై శాతం ప‌ర్సంటేజ్‌లో సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ ప‌ర్సంటేజ్ విధానంలో ఓ షో హౌస్‌ఫుల్ అయితే వ‌చ్చే గ్రాస్ మొత్తాన్ని హోల్డ్ ఓవర్‌గా ప‌రిగ‌ణిస్తారు.

సింగిల్ స్క్రీన్ కౌంట్ డౌన్‌...

సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ వ్య‌యాలు పెర‌గ‌డం, రెవెన్యూ రానురాను త‌గ్గిపోతుండ‌టంతోనే చాలా థియేట‌ర్లు మూత‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే సింగిల్ స్క్రీన్స్ సంఖ్య తెలంగాణ‌లో చాలా త‌గ్గింది. ఉన్న థియేట‌ర్ల‌ను కాపాడుకోవ‌డం కోస‌మే డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌ల‌తో మాట్లాడి ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలంగాణ థియేట‌ర్ ఎగ్జిబిట‌ర్లు ప్ర‌క‌టించారు.

ఇత‌ర రాష్ట్రాల్లో...

తెలంగాణలోని మిగిలిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల‌లో దశలవారీగా ప‌ర్సంటేజ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని అన్నారు. తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే సింగిల్ స్క్రీన్లు పర్సంటేజ్ పద్ధతిలోనే నడుస్తున్నాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో మ‌ల్టీప్లెక్స్‌లు చాలా వ‌ర‌కు ప‌ర్సంటేజ్ విధానం లోనే న‌డుస్తున్నాయి.
రెంట‌ల్ విధానంలో త‌మ థియేట‌ర్ల‌ను డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌ల‌కు ఎగ్జిబిట‌ర్లు అద్దెకు ఇచ్చేవారు. లాభ‌న‌ష్టాల‌ను థియేట‌ర్ ఓన‌ర్ల‌కు సంబంధం ఉండేది కాదు. ఫిక్స్‌డ్ ఎమౌంట్ వ‌చ్చేది. కానీ ప‌ర్సంటేజ్ విధానంలో థియేట‌ర్ల‌కు వ‌చ్చే రెవెన్యూ పెరుగుతుంది. ఓపెనింగ్స్‌లో నిర్మాత‌ల‌కు వ‌చ్చే వాటా త‌గ్గుతుంది.

ఆ థియేటర్లు ఇవే...

గోకుల్ - ఎర్ర‌గ‌డ్డ‌, హైటెక్ - మాదాపూర్‌, ఈశ్వ‌ర్ అత్తాపూర్‌, భ్ర‌మ‌రాంభ, అర్జున్ - కూక‌ట్‌ప‌ల్లి, రాజ్య‌ల‌క్ష్మి, శ్రీకృష్ణ థియేట‌ర్స్ - ఉప్ప‌ల్‌, సాయిరంగ థియేట‌ర్ - మియాపూర్‌, వైజ‌యంతీ థియేట‌ర్ - నాచారం, ప్ర‌తాప్ - లంగ‌ర్ హౌజ్‌తో పాటు మ‌రికొన్ని థియేట‌ర్ల‌లో ప‌ర్సంటేజ్ విధానం అమ‌లులోకి రానుంది.

 

Advertisement
Advertisement