త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Techie Drowning Case | టెకీ మృతి కేసు.. యోగి సర్కార్ సీరియస్: నోయిడా అథారిటీ సీఈవోపై వేటు, సిట్ ఏర్పాటు

దట్టమైన పొగమంచు కారణంగా నిర్మాణ స్థలంలోని నీటి గుంతలో కారు పడి 27 ఏళ్ల టెక్కీ ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తండ్రి కళ్లెదుటే కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా రక్షించలేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో యోగి సర్కార్ రంగంలోకి దిగింది.

J

Crime | Published On Jan 19, 2026, 9.02 pm IST

Techie Drowning Case | టెకీ మృతి కేసు.. యోగి సర్కార్ సీరియస్: నోయిడా అథారిటీ సీఈవోపై వేటు, సిట్ ఏర్పాటు
Advertisement

Techie Drowning Case | త్రినేత్ర.న్యూస్ : నోయిడా సెక్టార్ 150లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ యువరాజ్ మెహతా (27) రోడ్డు పక్కనే ఉన్న నీటి గుంతలో పడి మునిగి మృతి చెందిన ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ చర్యలకు శ్రీకారం చుట్టింది. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. నోయిడా అథారిటీ సీఈవో లోకేష్‌ని తక్షణమే పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఐదు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఊపిరాడక, గుండెపోటుతో మరణించిన యువరాజ్

గురుగ్రామ్‌లోని ఒక సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువరాజ్ మెహతా, శుక్రవారం అర్ధరాత్రి తన ఇంటికి తిరిగి వస్తుండగా దట్టమైన పొగమంచు కారణంగా దారి కనిపించక సెక్టార్ 150లోని ఒక నిర్మాణ స్థలంలో తవ్విన లోతైన నీటి గుంతలోకి తన కారుతో సహా పడిపోయారు. సుమారు 30 అడుగుల లోతున్న ఈ గుంతలో కారు మునిగిపోవడంతో యువరాజ్ ఊపిరాడక, గుండెపోటుతో మరణించాడని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

తండ్రి ముందే విషాదం

యువరాజ్ మరణానికి ముందు తన తండ్రి రాజ్‌కుమార్ మెహతాకు ఫోన్ చేసి, "నాన్న నేను నీటిలో మునిగిపోతున్నాను, నన్ను కాపాడు" అని వేడుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ టీమ్ చేరుకున్నప్పటికీ, యువకుడిని కాపాడే సరైన పరికరాలు లేకపోవడం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిర్మాణ సంస్థలపై కేసు నమోదు

యువరాజ్ తండ్రి ఫిర్యాదు మేరకు 'ఎంజే విష్‌టౌన్ ప్లానర్ లిమిటెడ్', 'లోటస్ గ్రీన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్' అనే రెండు బిల్డర్ కంపెనీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలంలో ఎలాంటి బారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయకపోవడం, కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ప్రమాదంతో నోయిడా అథారిటీ ప్రమాద స్థలంలో హుటాహుటిన బారికేడ్లను ఏర్పాటు చేసింది. అయితే, తమ కుమారుడిని కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబ సభ్యులు, బాధ్యులైన ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement