త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు

తొందరగా కోటీశ్వరుడు అవ్వాలనే ఆశతో ఉద్యోగం వదిలేశాడు. గూగుల్ చూసి ఇంట్లోనే ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టాడు. వంద కోట్ల సరుకుతో పోలీసులకు చిక్కాడు.

J

Crime | Published On Aug 15, 2026, 5.18 pm IST

Nagaur Drug Bust | నేవీ ఉద్యోగం వదిలేసి.. గూగుల్‌లో వెతికి ఇంట్లోనే రూ.100 కోట్ల డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన యువకుడు
Advertisement
  • రాజస్థాన్‌లోని నాగౌర్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసిన పోలీసులు
  • నేవీ ఉద్యోగం వదిలేసి, ఆన్‌లైన్‌లో చూసి డ్రగ్స్ (MDMA) తయారు చేస్తున్న మహావీర్ అరెస్ట్
  • పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు పది రోజులకోసారి సిమ్ కార్డులు మార్చిన కిలాడీ
  • ల్యాబ్ నుంచి 5.4 కిలోల ఎండీఎంఏ, 210 లీటర్ల కెమికల్స్ స్వాధీనం
  • వీటి విలువ సుమారు రూ.100 కోట్లు

Nagaur Drug Bust | త్రినేత్ర.న్యూస్ : రాజస్థాన్‌ (Rajasthan) లోని నాగౌర్ జిల్లాలో కళ్లు చెదిరే డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. 'ఆపరేషన్ నషా ముక్త్ నాగౌర్'లో భాగంగా.. ఆన్‌లైన్‌లో వీడియోలు చూసి ఇంట్లోనే ఏకంగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అద్దె ఇంట్లో సోదాలు చేయగా.. ఏకంగా రూ.100 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్, రసాయనాలు పట్టుబడటం విస్మయానికి గురిచేసింది.

అత్యాశతో ఉద్యోగం వదిలేసి..

ఈ డ్రగ్స్ ఫ్యాక్టరీ మాస్టర్‌మైండ్‌ను మహావీర్ జాట్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను గతంలో నేవీలో (Navy Employee) పని చేసేవాడు. అయితే, ఆ జీతం సరిపోవడం లేదని, షార్ట్‌కట్‌లో ఎలాగైనా కోటీశ్వరుడు అవ్వాలనే అత్యాశతో 2026 ఫిబ్రవరిలో ఉద్యోగం మానేశాడు. అంతకంటే ముందు.. డిసెంబర్ 2025 నుంచే ఆన్‌లైన్‌లో డ్రగ్స్ ఎలా తయారు చేయాలి (How to make drugs) అని గూగుల్ (Google) లో విపరీతంగా వెతకడం మొదలుపెట్టాడు.

భార్యకు కూడా తెలియకుండా సీక్రెట్ ల్యాబ్

నాగౌర్ జిల్లాలోని జోధ్‌పూర్ రోడ్డులో ఓ అద్దె ఇల్లు తీసుకున్న మహావీర్.. తన కుటుంబ సభ్యులకు కూడా అనుమానం రాకుండా అందులో సీక్రెట్‌గా డ్రగ్స్ ల్యాబ్ (Drugs Lab) ఏర్పాటు చేశాడు. ఆన్‌లైన్‌లో నేర్చుకున్న విద్యతో నెమ్మదిగా కెమికల్స్, మిక్సింగ్ మెషీన్లు, థర్మామీటర్లు, pH మీటర్లు కొనుగోలు చేసి ఎండీఎంఏ (MDMA) తయారీ ప్రారంభించాడు. పోలీసుల కళ్లుగప్పేందుకు టెక్నాలజీని వాడుకుంటూ.. ప్రతి 10 రోజులకోసారి మొబైల్ సిమ్ కార్డ్ (SIM Card) మార్చేవాడు. ఇలా తన ఆపరేషన్ కోసం దాదాపు 10 నుంచి 12 సిమ్ కార్డులు వాడాడు.

రూ.100 కోట్ల సరుకు సీజ్

ఆగస్టు 10న డీప్ కాలనీలో జరిపిన ఒక రైడ్‌లో పోలీసులు అనుమానంతో మహావీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా అసలు కథ బయటపడింది. వెంటనే జోధ్‌పూర్ రోడ్డులోని ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. అక్కడి సెటప్ చూసి కంగుతిన్నారు.

ల్యాబ్‌లో ఉన్న 5.418 కిలోల హై-క్వాలిటీ ఎండీఎంఏ (MDMA), 2.744 కిలోల కెఫీన్, 24 రకాల వివిధ కెమికల్స్, 210 లీటర్ల ద్రావణాలను అధికారులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని నాగౌర్ అడిషనల్ ఎస్పీ ఆశారామ్ చౌదరి తెలిపారు.

ముమ్మరంగా దర్యాప్తు

కేవలం ఆన్‌లైన్‌లో చూసి, ఒక్కడే ఇంత పెద్ద ఫ్యాక్టరీని రన్ చేయడం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తోంది? తయారైన డ్రగ్స్‌ను ఏయే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై డిజిటల్ ఆధారాలతో ఆరా తీస్తున్నారు. ఈ దందాలో మహావీర్‌కు సహకరించిన మరో నలుగురు అనుచరుల పాత్రపై కూడా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

Advertisement
Advertisement