త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Baby Trafficking | ఢిల్లీలో ‘బేబీ బజార్’.. మగ పిల్లాడైతే రూ.8 లక్షలు, ఆడపిల్ల రేటు రూ.4 లక్షలు! పసికందుల అమ్మకాల ముఠా అరెస్ట్

రాజస్థాన్, గుజరాత్‌లో పేదల నుంచి పసికందులను కొని.. ఢిల్లీ, హర్యానాల్లోని ధనవంతులకు లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.

J

Crime | Published On Jun 20, 2026, 11.55 pm IST

Delhi Baby Trafficking | ఢిల్లీలో ‘బేబీ బజార్’.. మగ పిల్లాడైతే రూ.8 లక్షలు, ఆడపిల్ల రేటు రూ.4 లక్షలు! పసికందుల అమ్మకాల ముఠా అరెస్ట్
Advertisement
  • రాజస్థాన్, గుజరాత్‌లలో పేద దంపతుల నుంచి పసికందులను కొనుగోలు చేసి విక్రయిస్తున్న భారీ ముఠా అరెస్ట్
  • మగ పిల్లాడికి రూ. 6-8 లక్షలు, ఆడపిల్లకు రూ. 3-4 లక్షలు రేటు కట్టి విక్రయిస్తున్న వైనం
  • రోహిణిలోని 'హీరా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్' కేంద్రంగా డాక్టర్ వివేకి ఈ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు గుర్తింపు
  • నకిలీ కస్టమర్‌గా వెళ్లి ముఠాను పట్టుకున్న పోలీసులు.. మొత్తం ఐదుగురు పసికందుల రెస్క్యూ

Delhi Baby Trafficking | త్రినేత్ర.న్యూస్ : ఎవరు కన్నారో.. ఎక్కడ పుట్టారో.. కానీ భూమి మీద పడి వారం తిరక్కముందే లక్షల రూపాయలకు అమ్ముడుపోతున్నారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పసికందులను కొనుగోలు చేస్తూ, సంతానం లేని దంపతులకు వారిని విక్రయిస్తున్న ఓ భారీ ముఠాను ఢిల్లీ (Delhi) పోలీసులు రట్టు చేశారు. రాజస్థాన్, గుజరాత్‌లలో పుట్టిన పిల్లలను ఢిల్లీ, హర్యానాకు తీసుకొచ్చి ఈ 'బేబీ బజార్' (Baby Bazaar) నడుపుతున్న తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

పసికందులకూ ప్రైస్ ట్యాగ్

బజార్‌లో వస్తువులకు రేట్లు పెట్టినట్లే ఈ ముఠా పసికందులకు కూడా ప్రైస్ ట్యాగ్స్ ఫిక్స్ చేసింది. మగ పిల్లాడు కావాలంటే రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షలు.. అదే ఆడపిల్ల అయితే రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆడపిల్లలను లక్ష రూపాయలకు కొని మూడు నాలుగు లక్షలకు, మగ పిల్లలను రెండు లక్షలకు కొని 8 లక్షల వరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.

గుట్టు రట్టయింది ఇలా..

ఢిల్లీలోని పహార్‌గంజ్ ఏరియాలో ఓ మహిళ తరచూ వేర్వేరు పసికందులతో కనిపిస్తోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీసీటీవీ (CCTV) ఫుటేజ్, ఇంటెలిజెన్స్ ఆధారంగా జ్యోతి అలియాస్ కమలేష్ అనే మహిళను పోలీసులు ట్రాక్ చేశారు. పిల్లలను కొనే కస్టమర్ల తరహాలో ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ కమలేష్‌ను సంప్రదించింది. పిల్లల కోసం డీల్ మాట్లాడుకుని, రూ. 20 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. జూన్ 5న సదరు మహిళా ఆఫీసర్‌కు పసికందును అప్పగిస్తుండగా కమలేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Delhi Baby Bazaar Busted Boys Sold for 8 Lakh Girls for 3 Lakh

దందాకు అడ్డా హాస్పిటలే

కమలేష్‌ను విచారించగా షాలు, లలిత్, ప్రతిభ, విపిన్ అనే మరో నలుగురు దొరికారు. వీరిని ఇంటరాగేట్ చేయగా రోహిణి ప్రాంతంలోని 'హీరా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్' (Hira's Multispeciality Hospital) బండారం బయటపడింది. హాస్పిటల్ ఓనర్ డాక్టర్ వివేకి (Dr Viveki) ఈ మొత్తం దందాకు మాస్టర్ మైండ్ అని తేలింది. కస్టమర్లకు అప్పగించే వరకు పిల్లలను ఈ హాస్పిటల్‌లోనే ఉంచుతారు. పిల్లలు అక్కడే పుట్టినట్లుగా బర్త్ సర్టిఫికెట్లు, డిశ్చార్జ్ సమ్మరీల వంటి నకిలీ డాక్యుమెంట్లను (Forged documents) డాక్టర్ వివేకి స్వయంగా సృష్టించేది.

Delhi Baby Bazaar Busted Boys Sold for 8 Lakh Girls for 3 Lakh

సప్లై ఎక్కడి నుంచి వస్తోంది?

విచారణలో భాగంగా గుజరాత్‌కు చెందిన సభాభాయ్ గమర్ అలియాస్ కాలియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడు రాజస్థాన్, గుజరాత్‌లోని పేద దంపతుల నుంచి పసికందులను కొని ఢిల్లీలోని హాస్పిటల్‌కు చేరవేసేవాడు. గత ఏడాది కాలంలో ఈ ముఠా కనీసం 30 మంది చిన్నారులను అమ్మి ఉంటుందని పోలీసుల అంచనా. పిల్లలను కొనుగోలు చేసిన మధ్యప్రదేశ్, హర్యానాలకు చెందిన కొందరు కస్టమర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు. కన్నబిడ్డలను డబ్బు కోసం అమ్ముకున్నట్లు తేలితే ఆ తల్లిదండ్రులను కూడా నిందితులుగా చేరుస్తామని సెంట్రల్ డిస్ట్రిక్ట్ డీసీపీ రోహిత్ రాజ్‌బీర్ సింగ్ స్పష్టం చేశారు.

'కవలల' పేరుతో మోసం..

ఈ ముఠా దారుణాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. ఒకసారి ఓ దంపతులు మగ పిల్లాడి కోసం వీరిని సంప్రదించారు. ఆ సమయంలో ముఠా వద్ద ఒక ఆడపిల్ల 'మిగిలిపోయి' ఉంది. దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేసి.. సదరు దంపతులకు 'కవలలు' (Twins) పుట్టారని నమ్మించారు. వేర్వేరు చోట్ల నుంచి తీసుకొచ్చిన ఇద్దరు పిల్లలను (ఒక బాబు, ఒక పాప) కవలలుగా చూపి ఏకంగా రూ. 9 లక్షలకు విక్రయించడం గమనార్హం.

ఈ ఆపరేషన్‌లో మొత్తం ఐదుగురు పసికందులను రక్షించిన పోలీసులు, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ భారీ నెట్‌వర్క్‌ను పట్టుకోవడంలో మహిళా పోలీసులు ఎస్ఐలు ప్రగతి, యామిని, హెడ్ కానిస్టేబుల్ సుష్మ కీలక పాత్ర పోషించారని డీసీపీ వారిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement