త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mobile GST Reduction | స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..

Mobile GST Reduction | ఈ ఫెస్టివల్ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. మింట్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్లపై పన్ను తగ్గించే ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉంది.

S

Business | Published On Aug 29, 2026, 12.11 pm IST

Mobile GST Reduction | స్మార్ట్ ఫోన్ కొంటున్నారా.. కొద్ది రోజులు ఆగండి.. ఎందుకంటే..
Advertisement

Mobile GST Reduction | ఈ ఫెస్టివల్ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. మింట్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్లపై పన్ను తగ్గించే ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే జీఎస్టీని ఎంత శాతానికి తగ్గించాలనే అంశంపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదు. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, సమావేశం అజెండా ఇంకా ఖరారు కాలేదు.

మొబైల్ ఫోన్ల‌పై జీఎస్‌టీ స‌మీక్ష‌..?

దేశంలో స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ బలహీనపడుతున్న సమయంలో ప్రభుత్వం మొబైల్ ఫోన్లపై జీఎస్టీని సమీక్షించాలని భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు ఏడాది ప్రాతిపదికన 10 నుంచి 11 శాతం తగ్గాయి. జూన్ త్రైమాసికంలో నమోదైన ఈ క్షీణత ఆరేళ్లలోనే అత్యధికంగా పేర్కొంటున్నారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో ఈ రంగం ప్రభుత్వానికి కూడా కీలకంగా మారింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి విలువ సుమారు రూ.6.27 లక్షల కోట్లుగా ఉంది. దేశ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రూ.13.11 లక్షల కోట్లలో ఇది దాదాపు సగం. అందువల్ల ప్రస్తుత జీఎస్టీ విధానం మొబైల్ ఫోన్ల డిమాండ్‌తోపాటు దేశీయ తయారీని ప్రభావితం చేయకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

18 నుంచి 5 శాతానికి త‌గ్గింపు..?

మొబైల్ పరిశ్రమ ఇప్పటికే జీఎస్టీలో భారీ కోతను కోరుతోంది. రూ.25వేల వరకు ధర ఉన్న మొబైల్ ఫోన్లపై జీఎస్టీని ప్రస్తుత 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ ప్రతిపాదించింది. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఇదే ప్రతిపాదనను ఆమోదిస్తుందా లేదా మరో పన్ను శ్లాబ్‌ను నిర్ణయిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా లేదు. అందువల్ల రూ.25వేల వరకు ధర ఉన్న అన్ని మొబైల్ ఫోన్లపై జీఎస్టీ నేరుగా 5 శాతానికి తగ్గుతుందని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. జీఎస్టీ తగ్గి, ఆ ప్రయోజనాన్ని కంపెనీలు పూర్తిగా వినియోగదారులకు అందిస్తే స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. ఒక స్మార్ట్‌ఫోన్ పన్నులకు ముందు ధర రూ.20వేలుగా ఉందనుకుందాం. ప్రస్తుతం దానిపై 18 శాతం జీఎస్టీ విధిస్తే రూ.3,600 పన్ను చెల్లించాలి. దీంతో ఫోన్ మొత్తం ధర రూ.23,600 అవుతుంది. అదే ఫోన్‌పై జీఎస్టీ 5 శాతానికి తగ్గితే పన్ను రూ.1వేయికి పరిమితం అవుతుంది. అంటే జీఎస్టీ కారణంగా విధించే పన్నులో సుమారు రూ.2,600 తగ్గుదల ఉంటుంది. అయితే ఆ మొత్తాన్ని కంపెనీలు వినియోగ‌దారుల‌కు ప్ర‌యోజ‌నం రూపంలో అందిస్తాయా అన్న‌ది సందేహంగా మారింది.

14.4 శాతం మేర పెరిగిన ధ‌ర‌లు..

భారత్‌లో ఫెస్టివల్ షాపింగ్ సీజన్ ప్రారంభం కానున్న సమయంలో జీఎస్టీ కౌన్సిల్ నుంచి ఈ నిర్ణయం వచ్చే అవకాశం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది దీపావళి నవంబర్‌లో ఉండటంతో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య వరకు సుదీర్ఘ ప్రమోషనల్ సీజన్ లభించే అవకాశం ఉంది. ఈ ఏడాది మొబైల్ ఫోన్లు, ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగాయి. రెండో త్రైమాసికంలో భారత్‌లో మొబైల్ ఫోన్ల సగటు విక్రయ ధర 14.4 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 315 డాలర్లకు చేరింది. దీంతో కంపెనీలు, రిటైలర్లు ఫెస్టివల్ సీజన్‌లో డిస్కౌంట్లు, సులభమైన ఫైనాన్సింగ్ సదుపాయాల ద్వారా డిమాండ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో మొబైల్ ఫోన్లపై జీఎస్టీ తగ్గితే వినియోగదారులకు అదనపు ధర ప్రయోజనం లభించడంతోపాటు బలహీనమైన డిమాండ్‌కు ఊతం లభించే అవకాశం ఉంది.

కంపెనీలు ప్ర‌యోజ‌నం అందిస్తాయా..

మొబైల్ ఫోన్లపై జీఎస్టీ తగ్గింపు కేవలం వినియోగదారులకు ధరల ఉపశమనం కల్పించే అంశంగానే కాకుండా, దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యాలతో కూడా ముడిపడి ఉంది. ప్రభుత్వం ఇటీవల రూ.62,500 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ఐదేళ్ల పాటు, అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగనుంది. దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని పెంచడం, దేశీయ విలువ జోడింపును పెంచడం, స్థానిక తయారీ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్లపై అధిక జీఎస్టీ పరిశ్రమ ఉత్పత్తి వ్యయం, డిమాండ్‌పై ప్రభావం చూపే అంశంగా పరిగణిస్తున్నారు. అయితే ఇక్కడే కీలకమైన సందేహం త‌లెత్తుతోంది. జీఎస్టీ తగ్గితే మొబైల్ ఫోన్ల ధ‌ర‌లు నిజంగానే త‌గ్గుతాయా, లేదా అనేదే అస‌లు విష‌యం. గతేడాది జీఎస్టీ రేట్లలో జరిగిన మార్పుల ప్రయోజనం వినియోగదారులకు పూర్తిగా చేరిందా లేదా అనే అంశాన్ని కూడా జీఎస్టీ కౌన్సిల్ సమీక్షించే అవకాశం ఉంది. జీఎస్టీ తగ్గించిన తర్వాత కొన్ని కంపెనీలు ధరలను మళ్లీ పాత స్థాయికి పెంచాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. అందువల్ల ఈసారి జీఎస్టీ తగ్గిస్తే పన్ను తగ్గింపు వల్ల కలిగే వాస్తవ ప్రయోజనం వినియోగదారులకు చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement